తులంబంగారానికి వడ్డీగా తులమున్నర బంగారం

మెదక్ జిల్లాలో రెచ్చిపోతున్న ప్రయివేటు ఫైనాన్స్ వ్యాపారులు

Update: 2025-11-14 11:20 GMT

మెదక్ జిల్లాలో ప్రయివేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఎక్కడా లేని నిబంధనలతో డబ్బు అవసరం ఉన్నవారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తులం బంగారం అప్పుగా ఇస్తే.. దానికి వడ్డీ కలుపుకుని తిరిగి తులమున్నర బంగారం ఇవ్వాలని సొంత రూల్స్ పెట్టారు. ఈ రూల్‌ను పాటించడంలో ఒక కుటుంబం విఫలమైనందుకు వారిపై దాడి చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతన్ శెట్టి పల్లి గ్రామంలో జరిగింది. పోతన్ శెట్టి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన బోసు రమణి, రవి దంపతులు ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ఐదుగురు ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర నుంచి తొమ్మిది తులాల బంగారం అప్పుగా తీసుకున్నారు. దానిని తిరిగి ఇవ్వడంలో దంపతులు ఆలస్యం చేశారు. దీంతో దంపతుల ఇంటిపై ఫైనాన్స్ వ్యాపారులు మూకుమ్మడిగా దాడి చేశారు. రుణగ్రహిత కుటుంబ సభ్యులను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు.

ఒప్పందం ప్రకారం తొమ్మిది తులాల బంగారానికి వడ్డీ కింద నాలుగున్నర తులాల బంగారం కలిపి మొత్తం పదమూడున్నర తులాల బంగారం ఇవ్వాల్సిందేనని బోసురమణి దంపతులపై ఒత్తిడి పెంచారు. 2023లో తులం బంగారం ధర రూ.50-60 వేలు ఉండగా ప్రస్తుతం అది రూ.1.28 లక్ష వరకు పలుకుతుంది. వాళ్లు కొత్తగా కట్టుకున్న ఇంటికి తాళం వేసి ఒప్పందం ప్రకారం బంగారం ఇచ్చాకే ఇంటి లోపల అడుగు పెట్టాలని బెదిరించారు. రమణి దంపతులు ఎంత ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీంతో బాధితులు పోలీసులనాశ్రయించారు. . తమను విచక్షణా రహితంగా కొట్టి, తమ ఇంటి తాళం వేసుకుని వెళ్లారంటూ ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని ప్రయివేటు వ్యాపారుల నుంచి ఇంటి తాళం తీసుకుని బాధితులకు అందించారు.
దాంతో వ్యాపారుల కోపం మరింత పెరిగింది. రెండ్రోజుల తర్వాత మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అని రుణగ్రహిత దంపతులుపై మరోసారి దాడిచేశారు. రవిని మళ్ళీ చితకొట్టారు. దీంతో చేసేదేమీ లేక.. బాధితులు మరోసారి పోలీసుల దగ్గరకు వెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు కోల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News