ఆపరేషన్ సిందూర్: హైజాక్ నిందితుడు యూసుఫ్ అజార్ హతం..
1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసిన వ్యక్తుల్లో అజార్ కీలకంగా వ్యవహరించాడు.;
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) దాడుల్లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్లో పాల్గొన్నవారు కూడా ఉన్నారు. మృతులంతా నిషేధిత సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్ఇటి)లతో సంబంధం ఉన్నవారే. హతమయిన ఉగ్రవాదులలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ బావమరిది మహ్మద్ యూసుఫ్ అజార్ కూడా ఉన్నాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిగతా నలుగురు ఎల్ఈటికి చెందిన ముదస్సార్ ఖాదియన్ ఖాస్ అలియాస్ ముదస్సార్ అలియాస్ అబు జుందాల్, మసూద్ అజార్ అన్నయ్య హఫీజ్ ముహమ్మద్ జమీల్, ఎల్ఇటికి చెందిన ఖలీద్ అలియాస్ అబు ఆకాషా మరియు జెఇఎంకు చెందిన మహ్మద్ హసన్ ఖాన్.
యూసుఫ్ అజార్ (Yusuf Azhar) ఎవరు?
నిషేధిత ఉగ్రసంస్థ జేఈఎమ్(JeM)లో కీలక సభ్యుడు యూసుఫ్ అజార్. ఉగ్రమూకలకు ఆయుధాల వాడకంలో శిక్షణ ఇస్తుంటాడు. ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీం, ఘోసి సాహబ్ అనే మారుపేర్లున్న ఇతను జమ్మూ కశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఖాట్మండు నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 ను హైజాక్ చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇతనిపై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది ఇంటర్పోల్.
బహవల్పూర్పై దాడులు..
'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళాలు చేసిన దాడుల్లో యూసుఫ్ అజార్ హతమయ్యాడు. బహవల్పూర్లోని ఈ ఉగ్రస్థావరం 2015 నుంచి ఉగ్రమూకలకు శిక్షణనిస్తోంది. 2019లో జరిగిన పుల్వామా దాడితో సహా అనేక ఉగ్ర కుట్రలతో ఈ కేంద్రానికి సంబంధం ఉంది. ఉగ్రస్థావరంలో జేఈఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ సహా మరికొంత ఉగ్ర నాయకులు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్గర్, మౌలానా అమ్మర్, అజార్ కుటుంబ సభ్యుల నివాసాలు ఉన్నాయి.