ఇండోనేషియా సెమినార్ లో ఐఏఎఫ్ అధికారి కీలక వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్ లో జెట్ లను కోల్పోయామని అంగీకారం, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్, తప్పుగా అర్థం చేసుకున్నారన్న రాయబార కార్యాలయం;

Update: 2025-06-30 08:18 GMT

జూన్ 10న జకార్తాలో జరిగిన ఒక సెమినార్ లో భారత వైమానిక దళం రాజకీయ పరిమితుల కారణంగా కొన్ని ఐఏఎఫ్ ఫైటర్ జెట్లను కోల్పోయిందని కెప్టెన్ శివ్ కుమార్ చెప్పడంపై కలకలం రేగింది.

దీనిపై విపక్షాలు విమర్శలు చేయడంతో ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. కొన్ని విమానాలు కోల్పోయిందనే వ్యాఖ్యలను తప్పుగా చూపించిందని, ఈ సంఘటన జరిగిన సందర్భం వేరని వివరణ ఇచ్చింది.

డిఫెన్స్ అటాచ్ ఏం చెప్పారు..
జూన్ 10న జకార్తాలో జరిగిన ఒక సెమినార్ లో ఇండోనేషియాకు చెందిన భారత రక్షణ అనుబంధ కెప్టెన్ శివ్ కుమార్, ఆపరేషన్ సిందూర్ ప్రారంభ దశలలో పాకిస్తాన్ వైమానిక రక్షణ లేదా సైనిక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకోవద్దని భారత ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించిందని చెప్పారు.
ఈ ఆర్డర్ వల్ల ప్రారంభంలో ఐఏఎఫ్ కొన్ని విమానాలు కోల్పోయిందని చెప్పారు. ‘‘రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఈ అడ్డంకి కారణంగానే ఐఏఎఫ్ కొన్ని యుద్ద విమానాలు కోల్పోయింది’’ అని కెప్టెన్ శివ్ కుమార్ చెప్పారు.
మొదట్లో ఎదురుదెబ్బ తిన్న తరువాత, భారత దళాలు తమ వ్యూహాలను మార్చుకుని ఎదురుదాడి చేశాయని చెప్పారు.‘‘మన దాడులన్నీ ఉపరితలం, గగనతలం నుంచి క్షిపణులు, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ప్రయోగించి వాటిని అణచివేశాం’’ అన్నారు.
జకార్తాలోని ఒక విశ్వవిద్యాలయంలో ‘‘పాకిస్తాన్- భారత వైమానిక యుద్ధం విశ్లేషణ, వాయుశక్తి ముందస్తు వ్యూహాలు’’ అనే అంశంపై జరిగిన సెమినార్ లో భారత నావికాదళ అధికారి ప్రసంగించారు.
భారత రాయబార కార్యాలయం స్పష్టత..
సెమినార్ లో కెప్టెన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చేసిన పంతొమ్మిది రోజుల తరువాత సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్ గా మారింది. ఇవి తరువాత దుమారం రేగడంతో ఇండోనేషియాలోని భారత రాయాబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ‘‘ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో ఉదహరించబడ్డాయి. మీడియా సంస్థలు, స్పీకర్ చేసిన ప్రజంటేషన్ ఉద్దేశాన్ని, ఉత్సాహాన్ని తప్పుగా చూపించాయి’’ అని వివరణ ఇచ్చింది. దీనిపై ఎక్స్ లో సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.
‘‘మా పొరుగున ఉన్న కొన్ని ఇతర దేశాల మాదిరిగా కాకుండా’’ మా దళాలు పౌర రాజకీయ నాయకత్వంలో పనిచేస్తాయని రాయబార కార్యాలయం పేర్కొంది. పరోక్షంగా పాక్  పేరు చెప్పకుండా దాని సైనిక ఆధిపత్యం గురించి విమర్శించింది.
సీడీఎస్ చౌహన్ వ్యాఖ్యలు..
నెల రోజుల క్రితం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్ సింగపూర్ లో మాట్లాడుతూ.. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సైనిక ఘర్షణల్లో విమానాలను కోల్పోయిందని చెప్పారు.
ఆ తరువాత భారత్ తన వ్యూహాలను సరిదిద్దుకుని పాకిస్తాన్ భూభాగంలోని చొచ్చుకెళ్లి దాడి చేసిందని వివరించారు. అయితే ఎన్ని విమానాలు నష్టపోయామో, ఏ రకం ఫైటర్ జెట్లో సీడీఎస్ వెల్లడించలేదు. ఇదే సమయంలో ఆరు ఫైటర్ జెట్లు కూల్చివేశామనే పాకిస్తాన్ చేసిన ప్రకటన తప్పు అని ఆయన ఖండించారు.
‘‘జెట్ విమానాలు కూల్చివేయడం కాదు.. అవి ఎందుకు కూలిపోయాయన్నదే ముఖ్యం’’ అని జనరల్ అన్నారు.
కాంగ్రెస్ విమర్శలు..
రక్షణ శాఖ అధికారి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. భారత ప్రభుత్వం దేశాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
‘‘అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించడానికి, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకురావడానికి ప్రధానమంత్రి ఎందుకు నిరాకరిస్తున్నారు.? పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ఎందుకు అంగీకరించడం లేదు. ’’ అని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రక్షణ శాఖ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ప్రత్యక్ష నేరారోపణ అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా అన్నారు. ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీపడ్డారని , నిజం చెప్తే కాంగ్రెస్ ఏం చేస్తుందో అని భయపడుతున్నారని ఖేరా అన్నారు.
ఆపరేషన్ సిందూర్..
పహల్గామ్ లో హిందూ టూరిస్టులను మతం అడిగి, ప్యాంటు విప్పి భార్యల ముందు భర్తలను ఇస్లామిక్ ఉగ్రవాద మూకలు కాల్చి చంపడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబీకాయి.
దీనిపై భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేసింది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు చెలరేగాయి. మే 10 పాకిస్తాన్ తెల్లజెండా ఊపడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
Tags:    

Similar News