ఆ న్యూస్ ఛానల్ కు షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్.. మూసివేయాలని ఆదేశాలు

ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న అల్ జజీరా న్యూస్ ఛానల్ ను మూసివేయాలని ఆదేశించింది.

Update: 2024-09-22 07:39 GMT

వెస్ట్ బ్యాంక్ లో ఉన్న అరబ్ న్యూస్ ఛానల్ అల్ జజీరాకు ఇజ్రాయెల్ షాక్ ఇచ్చింది. ఆదివారం తెల్లవారుజామున రమాల్లాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి 45 రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న భవనంలోకి తెల్లవారుజామున ముసుగులు ధరించి భారీగా ఆయుధాలు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించారని అల్ జజీరా నివేదించింది.

సైనికులు వెస్ట్ బ్యాంక్‌కు సంబంధించిన నెట్‌వర్క్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్-ఒమారీకి ఆర్డర్‌ను అందజేశారు. న్యూస్ ఛానల్ ను వెంటనే మూసివేయాలని హెచ్చరించారు. కానీ నోటీసుల్లో మూసివేతకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

'అన్ని కెమెరాలు తీసుకుని వెళ్లిపో'
అల్ జజీరా ప్రకారం, ఒక ఇజ్రాయెల్ సైనికుడు అల్-ఒమారీతో ఇలా అన్నాడు, "అల్ జజీరాను 45 రోజుల పాటు మూసివేయాలని కోర్టు ఆదేశం ఉంది." సదరు సైనికుడు అరబిక్ భాషలో హెచ్చరిస్తూ "అన్ని కెమెరాలను తీసుకొని వెంటనే కార్యాలయం నుంచి బయలుదేరండి" అని సిబ్బందిని ఆదేశించాడు. రమల్లా లోని అల్ జజీరా కార్యాలయం కరస్పాండెంట్ ఫోన్ లో మాట్లాడుతూ.. ఇజ్రాయల్ ఇచ్చిన ఆర్డర్ ఆశ్చర్యకరమైందని అన్నారు. గతంలోనూ ఇదే విధంగా తమపై నియంత్రణ విధించారని చెప్పారు.
ముందస్తు హెచ్చరికలు
"ఇజ్రాయెల్ అధికారులు ఇప్పటికే బ్యూరోను మూసివేస్తామని బెదిరించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని సైనిక పాలకులను అలా చేయమని కోరడం గురించి ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. అయితే, ఈ రోజు అది జరుగుతుందని మేము ఊహించలేదు," ఇబ్రహీం చెప్పారు. జాతీయ భద్రతా సమస్యలను ఉటంకిస్తూ మేలో దేశంలో అల్ జజీరా కార్యకలాపాలపై ఇజ్రాయెల్ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఆ కాలంలో అల్ జజీరా తన కార్యాలయంగా ఉపయోగించిన జెరూసలేం హోటల్‌పై కూడా ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి.
ఈ సంఘటన తర్వాత, బ్యూరో చీఫ్ అల్-ఒమారీ మాట్లాడుతూ... ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. సత్యాన్ని అణచివేయడానికే ఇలా యూదులు దాష్టికాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలు నిజాలు వినకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. గాజాలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం ఇజ్రాయెల్ చర్యను "చెవిటి కుంభకోణం"గా అభివర్ణించింది. గ్లోబల్ మీడియా సంస్థలు, మానవ హక్కుల సంఘాలు హేయమైన నేరం అని పిలిచే దానిని ఇజ్రాయెల్ చేసిందని అన్నారు. పత్రికా, మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసిందని విమర్శించారు.
అల్ జజీరా ఈ నిషేధాన్ని ఖండించింది. ఇది మానవ హక్కులు, ప్రజల సమాచార హక్కును బలహీనపరిచే "నేరపూరిత చర్య" అని పేర్కొంది. అంతర్జాతీయ, మానవతా చట్టాలను ఉల్లంఘిస్తూ గాజాలో తన కార్యకలాపాలను దాచడానికి ఇజ్రాయెల్ స్వేచ్ఛా ప్రెస్‌ని అణిచివేస్తోందని నెట్‌వర్క్ ఆరోపించింది. గాజా స్ట్రిప్‌లో యుద్ధంలో నిమగ్నమై ఉన్న తీవ్రవాద సంస్థ హమాస్ మౌత్ పీస్ మీడియా అని ఇజ్రాయెల్ ఆరోపించింది.
Tags:    

Similar News