దాడులు - ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

ఇజ్రాయెల్ పైకి ఇరాన్ రెండో విడత క్షిపణుల దాడి, ఇరాన్ లోని వంద లక్ష్యాలపై తొలి విడత దాడులు చేసిన ఐడీఎఫ్;

Update: 2025-06-14 05:01 GMT
ఇరాన్ దాడుల్లో ధ్వంసం అవుతున్న టెల్ అవీవ్ లోని ఓ భవనం

అణుబాంబు సిద్దం చేయడానికి కావాల్సిన సాంకేతికతకు ఇరాన్ చేరువుతున్న తరుణంలో ఇజ్రాయెల్ భారీ స్థాయిలో సైనిక చర్యకు దిగిన సంగతి తెలిసిందే. ఐడీఎఫ్ ఇరాన్ లోని కీలక సైనిక జనరల్లు, శాస్త్రవేత్తలు, అణు కేంద్రాలే లక్ష్యంగా వైమానిక, డ్రోన్లతో దాడి చేసింది.

ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 78 మంది ఇరానియన్లు మరణించారు. ఇందులో ఇరాన్ కీలక మిలటరీ నాయకులు సైతం ఉన్నారు. మరో 320 మంది తీవ్రంగా గాయపడినట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు.

ఇరాన్ ప్రతిదాడి..
ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్ లక్ష్యంగా ప్రయోగించిన మిస్సైల్స్ చాలావరకు గాల్లోనే ఇజ్రాయెల్ పేల్చివేసింది.
కొన్ని క్షిపణులు భవనాలను తాకడంతో అవి ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల విషయాన్ని ఐడీఎఫ్ అంగీకరించింది. కానీ ఎంతమంది పౌరులు మరణించారనేది మాత్రం వెల్లడించలేదు. అవసరాన్ని బట్టి ప్రతిదాడులు చేస్తామని మాత్రం దాని ప్రతినిధి చెప్పారు. 
జెరూసలెంలో భారీ పేలుళ్లు...
శనివారం ఉదయం ఇరాన్ రెండో విడతగా ఇజ్రాయెల్ పైకి భారీ స్థాయిలో క్షిపణలు ప్రయోగించడంతో జెరూసలెంలో సైరన్ల మోతలు వినిపించాయి. ఆకాశంలో ఎక్కడ చూసిన పేలుళ్లే కనిపించాయి.
చాలా క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్మీ తమ పౌరులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. బయట తిరగొడ్డని సైరన్లు మోగగానే వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని సూచించింది.
‘‘వారు(ఇజ్రాయెల్) చేసినటువంటి తప్పు నుంచి తప్పించుకోలేరు.’’ అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. ఆయన పేరుతో ఉన్న రికార్డెడ్ వీడియో ఒకటి అక్కడి అధికారులు విడుదల చేశారు. ఈ దాడులకు తాము కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అన్నారు.
టెల్ అవీవ్ ప్రాంతంలో జరిగిన దాడుల వల్ల 34 మంది గాయపడ్డారని మాత్రం ఇజ్రాయెల్ పారామెడికల్ విభాగం తెలిపింది. వీరిలో ఒక మహిళ శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. టెల్ అవీవ్ తూర్పున ఉన్న రామత్ గాన్ లో అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్ట్ కాలిపోయిన కార్లు, కనీసం మూడు దెబ్బతిన్న ఇళ్లను చూసినట్లు చెప్పాడు. వాటిలో ఒక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయింది.
ఆ ప్రాంతంలో అమెరికా భూ ఆధారిత వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసేందుకు సహాయపడుతున్నాయని ఈ చర్యలపై చర్చించడానికి పేరు వెల్లడించిన ఒక అమెరికా అధికారి తెలిపారు.
పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమా?
ఇజ్రాయెల్ కొనసాగించబోతున్న వైమానిక కార్యకలాపాలు, ఇరాన్ ప్రతీకార దాడులు వెరసి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి యుద్ధం మొదలవుతుందని ప్రపంచం బయపడుతోంది.
ఇప్పటికే సంక్షోభం అంచులో ఉన్న ప్రాంతంలో మరోసారి నిప్పుల కొలిమి అంటుకుంటుందని ఆందోళనలు నెలకొన్నాయి. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
ఇరాన్ చేపట్టిన న్యూక్లియర్ ప్రొగ్రాం పూర్తిగా నాశనం అయిందా లేదా అనే విషయంలో కూడా సమాచారం బయటకు అందడం లేదు.
అమెరికాకు ముందుగానే సమాచారం ఇచ్చాము..
2023 అక్టోబర్ 7 నాటి దాడుల తరువాత ఇజ్రాయెల్ తన శత్రువులను భారీ స్థాయిలో వేటాడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల కావడంతో ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
కచ్చితంగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు. ఒమన్ వేదికగా జరిగిన ఆరు విడతల చర్చలు విఫలం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ భారీ ఎత్తున వైమానిక దాడులు చేపట్టింది. అయితే ఈ దాడుల సమాచారం ముందుగానే అమెరికాకు అందజేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు.
ఇరాన్ కూడా తన అణు కార్యక్రమ వివరాలను ఐరాస వాచ్ డాగ్ కు ఇవ్వడానికి నిరాకరించింది. ఇకముందు తమ అణ్వాయుధ కార్యకలాపాల సమచారం ప్రపంచ సంస్థలకు ఇవ్వమని తెగిసి చెప్పింది.
ఇజ్రాయెల్ చేసిన దాడులు పశ్చిమఆసియాలోని ఇరాన్ అనుకూల దేశాలు ఖండించాయి. పలువురు ప్రపంచ నాయకులు కూడా వెంటనే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని రెండు దేశాలను కోరారు.
ఇరాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి ఐరాసకు రాసిన లేఖలో ఇజ్రాయెల్ పై కఠిన పదాలు వాడారు. తమ దేశ టాప్ మిలిటరీ కమాండర్లు, శాస్త్రవేత్తల చంపడాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. తమది సార్వభౌమత్వ దేశమని, ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని లేఖలో వాదించారు.
ఇరాన్ లోని దాదాపు 100 లక్ష్యాలపై ఇజ్రాయెల్ కు చెందిన ఐడీఎఫ్ దాడులకు పాల్పడింది. ఇందులో దాదాపు 200 వరకూ అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా తెలియజేసింది.
దీనితో తోడు ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ ఇరాన్ లో చాలా ప్రాంతాల్లో రహస్యంగా డ్రోన్లు, ప్రెసిషన్ స్ట్రైక ఆయుధాలను సిద్దంగా ఉంచి అదను చూసి దాడులకు దిగింది.
ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంఛర్లే లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇద్దరు భద్రతా అధికారులు తెలిపారు.
Tags:    

Similar News