రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తే సహించవద్దని చంద్రబాబు పిలుపు

ధీటుగా తిప్పికొట్టాలి, లేకుంటే అది నిజమనుకుంటారని చెప్పిన చంద్రబాబు;

Update: 2025-08-18 15:51 GMT
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ కు పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజధాని అమరావతిని నాశనం చేసిందే జగన్ అని, ఈ విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లి వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు.
'నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ (YSRCP) పనైంది. రాజధాని మునిగిపోయిందని.. ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలి. దీన్ని సహించకూడదు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
‘సుపరిపాలనలో తొలి అడుగు’, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ దుష్ప్రచారంపై స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
‘‘రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఊళ్లు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ ప్రమాదంలో పడిందని ఓ సారి వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైకాపా యత్నిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజం అనే స్థాయికి తీసుకెళ్తారు. మంచి గురించే కాదు.. చెడు చేసేవారి గురించీ ప్రజలను చైతన్య పరచాలి’’ అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
‘‘రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేసే విషయంలో కఠినంగా ఉంటాం. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి. అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని మరింత క్రమశిక్షణతో ఉండాలి. మీ మాట, చర్య ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉండకూడదు. ఏ ఒక్కరూ వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కోసం నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తున్నాం. ఇతర పదవుల భర్తీ కూడా త్వరలోనే చేపడతాం. పార్టీ కమిటీలను సాధ్యమైనంత వరకు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి’’ అని చెప్పారు. వైఎస్ జగన్ పేరు ఎత్తకుండానే ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
Tags:    

Similar News