ఏపీలో పూర్వపు బీహఆర్ కనిపిస్తోంది
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.;
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యానికి అంతు లేకుండా పోయిందని, ఎక్కడా ఏ మాత్రం బలం లేకున్నా గెల్చేందుకు అన్ని చోట్లా యథేచ్ఛగా దాడుల పర్వం కొనసాగించిందని జగన్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు నెలకొందన్నది ప్రతి ఒక్కరూ వాళ్ల గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే లింగమయ్య భార్య ఉంది. తన భర్తను కోల్పోయిన బాధలో ఉంది. గత నెలలో రాష్ట్రంలో 57 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, 7చోట్ల చంద్రబాబుకు సానుకూల పరిస్థితి లేదు. మిగిలిన వాటిలో ఏకంగా 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. వాటిలో చంద్రబాబుకు బలం లేదు. గెల్చిన వారంతా వైఎస్సార్సీపీ సభ్యులే. ఫ్యాన్ గుర్తు గెల్చిన చోట చంద్రబాబుకు బలం లేదని తెలిసి కూడా హింసను ప్రోత్సహిస్తూ, పోలీసులను తన వద్ద ఉన్న వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నారన్నారు. ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుంది? ఉప సర్పంచ్ పదవి లేకపోతే ఏమవుతుంది చంద్రబాబు?. తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి.. సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రిని అన్న అహంకారంతో లా అండ్ ఆర్డర్ను పూర్తిగా ధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు.
రామగిరి మండలంలో ఏం జరిగింది?
రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి 10 మందికి గాను 9 మంది వైయస్ఆర్సీపీ ఎంపీటీసీలు గెలిచారు. ఇక్కడ ఎంపీపీ స్థానానికి నోటిఫికేషన్ వస్తే ఏ పార్టీకి ఎంపీపీ పదవి వస్తుంది? అయినా కూడా ఎందుకు ఇక్కడ చంద్రబాబు స్థానిక ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి చివరకు వైఎస్సార్సీపీ సభ్యులను ప్రలోభపెట్టారు? వీళ్లంతా కోర్టుకు వెళ్లి తమకు ప్రాణ హాని ఉందని నోటిసులు తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశాలతో 8 మంది ఎంపీటీసీలను తీసుకువస్తుంటే మధ్యలో పోలీసుల రక్షణలో ఓటు వేయాల్సి ఉండగా, రామగిరి ఎస్ఐ సుధాకర్ వీళ్ల కాన్వాయ్లోకి వచ్చి ఆయన ఫోన్ నుంచి ఎమ్మెల్యేతో వీడియో కాల్ చేయించి మాట్లాడించారు. భారతమ్మ అనే ఎంపీటీసీ సభ్యురాలి అమ్మానాన్నను వీడియోకాల్లో చూపించి బెదిరించారు. ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఒక ఎస్ఐ చేసే పనేనా ఇది? అని ప్రశ్నించారు.
ప్రలోభాలకు లొంగకపోవడంతో ఎన్నిక జరగకుండా కోరం లేదంటూ వాయిదా వేయించారు. ఇదే ఎస్ఐ ఎంపీటీసీలను పెనుకొండకు తీసుకెళ్లి బైండోవర్ చేశారు. అక్కడికి మా నాయకులు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, ఉషాశ్రీ చరణ్ వెళ్తే వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. అసలు వాళ్లు చేసిన తప్పేంటి? మా పార్టీకి చెందిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తుంటే అడ్డుకోవడం తప్పా? అందుకు వారిపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లింగమయ్య హత్య
ఇన్ని చేసినా టీడీపీ గెలువదు కాబట్టి మండలంలో భయాందోళనకు గురి చేసేందుకు గత నెల 27, 28 తేదీల్లో జయచంద్రారెడ్డి ఇంటిపై దాడి చేశారు. కురుబ లింగమయ్య ఆ దాడిని అడ్డుకున్నారు. ఎంపీటీసీలను భయాందోళనకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకో లేదు. 28వ తేదీ లింగమయ్య కొడుకుతో కలిసి బైక్పై వెళ్తుంటే దాడి చేశారు. కర్రలు, రాళ్లు, మచ్చు కత్తి తీసుకెళ్లి లింగమయ్యపై దాడి చేశారు. ఆ దాడిలో లింగమయ్య తల పగిలిపోయింది. ఈ సందర్భంగా ఏకంగా బేస్బాల్ బ్యాట్ విరిగిందంటే, ఏ స్థాయిలో హింసించారనేది అర్ధం చేసుకోవచ్చు.
సిగ్గు లేకుండా అరాచకాలు
అయ్యా చంద్రబాబు మీరు చేస్తున్నది న్యాయమేనా? ధర్మమేనా? ఈరోజు రాష్ట్రం బీహర్ కంటే దారుణంగా తయారవుతోంది. సిగ్గు లేకుండా అరాచకాలు చేస్తున్నారు. లింగమయ్య హత్య కేసులో పోలీసులు కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టారు. ఈ కేసులో క్రియాశీలంగా వ్యవహరించిన రమేష్నాయుడిపై ఎందుకు కేసు పెట్టలేదు? వారంతా ఎమ్మెల్యే బంధువులు కాబట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెచ్చగొట్టిన వ్యక్తులను ఎందుకు కేసుల నుంచి తప్పించారు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కుమారుడిపై ఎందుకు కేసు పెట్టలేదు?.
ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? ఎస్ఐ సుధాకర్ వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని ప్రలోభపెట్టారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన ఫోన్ రికార్డులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు.
లింగమయ్య కొడుకుపై కూడా దాడి చేశారు. కొడుకుతో ఫిర్యాదు తీసుకోకుండా లింగమయ్య భార్యకు చదువు రాదని ఆమెతో వేలిముద్రలు తీసుకున్నారు. పోలీసులు రాసుకున్న పేపర్పై భయపెట్టి వేలిముద్రలు బలవంతంగా వేయించుకున్నారు. కొడుకు స్టేట్మెంట్ తీసుకోలేదు.
హత్యను వక్రీకరిస్తున్నారు..
లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్బాల్ బ్యాట్తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్బాల్ బ్యాట్ ఉందని రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురు టీడీపీకి చెందిన వారిని విచారించారు. పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంత కంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా దారుణ పోలీసు వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా ఉండదు.
యథేచ్ఛగా దౌర్జన్యాలు. దాడులు
రామగిరిలో జరిగిన విషయమైనా, రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలు ప్రజలు గమనిస్తున్నారు. తిరుపతి, రామకుప్పంలో కూడా దౌర్జన్యంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. విశాఖలో కూడా ఇప్పుడు ఏం జరుగుతోంది. 98 మంది సభ్యుల్లో 59 మంది వైయస్ఆర్సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈనెల 6న ఆళ్లగడ్డలోని సిరివెళ్లలో ప్రతాప్రెడ్డిపై హత్యాయత్నం చేశారు. దేవాలయంలో పూజలు చేస్తుండగా దాడి చేశారు. ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతాప్రెడ్డి అన్నను చంపించారు. మా ప్రభుత్వంలో ప్రతాప్రెడ్డికి గన్మెన్ సౌకర్యం కల్పిస్తే.. మళ్లీ చంద్రబాబు వచ్చాక గన్మెన్ను తొలగించారు.
మహానందిలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపారు. నంద్యాల హెడ్ క్వార్టర్కు కూతవేటు దూరంలో మర్డర్ జరిగినా పోలీసులు స్పందించ లేదు. గత ఏడాది జూలై 23న పెద్దకూరపాడులో సాంబిరెడ్డిని ఇనుపరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇప్పటికీ కోలుకోలేదు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. వాటన్నింటిపై మేము ఢిల్లీలో ధర్నా చేశాం.
తప్పుడు కేసులతో వేధింపులు
పోసాని కృష్ణమురళి నంది అవార్డు తీసుకోలేదు. కుల వివక్ష పాటిస్తున్నారని 2017లో స్టేట్మెంట్ ఇస్తే, ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 105 రోజులు జైల్లో పెట్టారు. పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. వీటన్నింటిలో పోలీసులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ దాడి ఘటనలో లేకపోయినా, ఆయన్ను కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్బుక్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలీసులూ.. ప్రవర్తన మార్చుకొండి
చంద్రబాబు, పోలీసులకు చెబుతున్నా. చంద్రబాబు మెప్పు కోసం వాళ్ల టోపిలపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తే.. అలాంటి పోలీసుల బట్టలు ఊడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడుతాం. మీ ఉద్యోగాలు ఊడగొడతాం. ప్రతి పోలీసు అధికారి మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి. మీరు చేసిన ప్రతి పనికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం. అలాగే మిమ్మల్ని తప్పకుండా ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని వైఎస్ జగన్ హెచ్చరించారు.