జగన్ తగలబెట్టిన ఆ ఫైళ్లేంటి?..టీడీపీ కౌంటర్
జగన్ నివాసం సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలకు, లిక్కర్ స్కామ్కు లింకెట్టి టీడీపీ పెట్టిన పోస్టు, వీడియో చర్చనీయాంశంగా మారాయి. వాటిల్లో ఏముందంటే?;
By : The Federal
Update: 2025-02-12 04:52 GMT
‘నిజంగా స్కాం చేసి తగులబెడితే ఇంటి బయట తగలబెట్టడానికి ఆయనేమైనా మాలోకం అనుకున్నారేంట్రా’.
‘ఇంట్లో తగలబెడితేనే మాలోకం అంటార్రా ఎర్రి మాలోకమ్’.
‘మాలోకం కాబట్టే.. వెర్రిపప్ప అయ్యాడు కదా’.
‘మదనపల్లి ఫైల్స్ తగలెడ్డాయి ఆ కేసు ఏమైంది. ప్రకాశం బ్యారేజీ బోట్లు సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డూ విషయం ఏమైంది. ఇది అంతే. డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు దిట్ట. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా కాలం వెళ్లదీయండి’.
‘ఈ సోది మీరు చెబుతూనే ఉంటారు. మేము వింటూనే ఉంటాం. మీరిద్దరూ కలిసి జనాన్ని ఎర్రి పప్పలని చేసి బాగా వాడుకుంటున్నారు’.
‘తాడేపల్లి ప్యాలస్ బయట అగ్ని ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదు. లిక్కర్ మతలబులు చెరిపి వేయడానికి కావాలని చేసిన ప్రమాదమే. లిక్కర్ కుంభకోణం మొదటి నేరం. ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించడం దాని కన్నా పెద్ద నేరం’.
‘ఎంత వాగితే అంత మైలేజ్ వస్తుందని అనుకుంటే పొరపాటే జగన్మోహన్రెడ్డి గారు.. మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే చిక్కుల్లో పడుతారు.. లిక్కర్ స్కాంలో చిక్కుకున్న వాళ్లు ఎవరూ బయటపడలేదు.. కవిత, కెజ్రీవాల్ ఓడిపోయారు’.
ఇవి ఏంటనుకుంటున్నారా? ఇటీవల తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డి నివాసానికి సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటి మీద టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీని మీద నెటిజన్ల కామెంట్లు ఇవి. ఇలా వందలాది మంది నెటిజెన్లు దీని గురించి చర్చిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది జగన్కు సపోర్టు చేస్తుంటే.. మరి కొందరు టీడీపీకి మద్దతు పలుకుతున్నారు.
అసలేం జరిగిందంటే..
తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ‘వేల కోట్ల లిక్కర్ స్కామ్లో సిట్కు ఆధారాలు దొరక్కుండా తాడేపల్లి ప్యాలెస్లో అగ్నిప్రమాదం పేరుతో కీలక ఫైల్స్, డైరీలు కాల్చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో మూడు రోజుల క్రితం పోస్టు పెట్టారు. దీంతో పాటుగా సినిమా రేంజ్లో తయారు చేసిన ఓ వీడియోను పోస్టు చేశారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్తో పాటు అద్భుతమైనా గ్రాఫిక్స్ను మేళవించి రూపొందించిన ఈ వీడియోకు అంతకంటే అద్భుతమైన మ్యూజిక్ను జోడించారు. వినడానికి, చూడటానికి ఈ వీడియో ఓ క్రైమ్ స్టోరీని తలపిస్తుంది. ఇట్టే ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. ప్రముఖ నటుడు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే తన కంఠానికి సాటి లేదని చెప్పి, కంచు కంఠంగా పేరొందిన సాయికుమార్ కంఠం లాంటి గొంతుతో వాయిస్ ఓవర్ను ప్రొఫెషనల్గా పలికించిన మాటలు, అందుకు తగ్గట్టుగా ఫొటోస్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అమర్చిన తీరు అద్భుతమనే చెప్పాలి. దీంతో ఈ వీడియోను వేల సంఖ్యలోనే వీక్షిస్తున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే..
జగన్ ఇంటి బయట.. జగన్ తగలబెట్టిన ఫైల్స్ డైరీలేంటి? జగన్ స్కాంకు సంబంధించిన పేపేర్లేనా? సిట్ భయంతోనే తగులబెట్టారా? ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లల్లో జగన్రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే. బూం బూం బ్రాండ్లతో ప్రజల డబ్బులను దోచేసి.. తాడేపల్లి ప్యాలెస్లో ప్రతి రోజు 280 కౌంటింగ్ మిషన్లతో రోజుకు 840 మందితో ఆ డబ్బును లెక్కించే వారని లిక్కర్ కేసులో అరెస్టైన కసిరెడ్డి కక్కేశాడు. ప్రస్తుత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది. ఆ భయంతోనే జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు.. డైరీలు ధ్వసం చేసే ప్రయత్నంలో జగన్ ఇంటి బయట అగ్ని ప్రమాదం అనే కథ అల్లి కీలకమైన సమాచారాన్ని తగలబెట్టినట్లు ఉన్నారు.
వెంటనే సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. సాయంత్రానికి ఫైళ్లను కాల్చేసిన జగన్.
అంటూ ఓ సబ్ టైటిల్ చెబుతూ.. వీడియోను కంటిన్యూ చేశారు. గత ప్రభుత్వంలో తన తాడేపల్లి ప్యాలెస్ను సీఎంవోగా మార్చేసిన జగన్ రెడ్డి ప్యాలెస్లో ఉన్న కీలకమైన లిక్కర్ స్కాంకు సంబంధించిన ప్రెయివేటుగా మెయింటెయిన్ చేసిన డాక్యుమెంట్లు, డైరీలను అగ్ని ప్రమాదం మాటున తగలబెట్టేశారని సమాచారం. సిట్ విచారణ తన ఇంటి వద్దకు వస్తుందని.. కోడి కత్తి 2.ౌ నాటకం ఆడిస్తున్నాడు. అగ్నిప్రమాదం జరిగింది అని చెబుతున్నారు కానీ.. ఇప్పటి వరకు జగన్ ఇంటి బయట ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలు బయటకు ఎందుకు రాలేదు. మదనపల్లిలో ఫైల్స్ దహనం తరహాలో తాడేపల్లి ప్యాలెస్లో పోగుపడిన లెక్కల చీటీల మొదలు మొత్తం వదిలించుకోవాలని చేసిన ప్రయత్నంలాగా కనిపిస్తుంది. భయంతోనే తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోయాలి అనే చూస్తున్నాడు. ఇదేనే జగన్ 2.ౌ అంటే.. అంటూ భారీ ఎత్తున ఆరోపణలు గుమ్మరిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో చేసిన ఆరోపణలు అటు రాజకీయ వర్గాలు, ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు.