పవన్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే: కవిత
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు ఏనాడూ ఎవరి చెడూ కోరుకోలేదని అన్నారు. తెలంగాణ కూడా కోణసీమలా పచ్చగా ఉండాలనుకున్నారే తప్ప.. కోనసీమ చెడిపోవాలని కలలో కూడా అనుకోలేదని కవిత అన్నారు. పవన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో తాజాగా కవిత స్పందించారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మన బిడ్డలు ప్రాణాలే త్యాగం చేశారని గుర్తు చేశారు.
కానీ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది. మేము పెద్దగా ఆలోచిస్తాం. మా రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు అయ్యింది. ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే అన్నాం’’ అని తెలిపారు.
‘‘తెలంగాణ ఎంత బాగుందో...ఆంధ్రా కూడా అంతే బాగుండాలని కోరుకున్నాం. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్ లో మాట్లాడాను. పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలనే కోరుకుంటాం. కానీ పక్కోడు చెడిపోవాలని అనుకోం. అలా అనుకొని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప...ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు. ఆనాడు మీరు సినిమా నటుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏపీ డిప్యూటీ సీఎం. మీ మాటలను ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారు. కనుక పవన్ కల్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి’’ అని హితవు పలికారు.