విధినిర్వహణలో గుండెపోటుతో ఎస్ఐ మృతి
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లోనే నిద్రపోతూ సంజయ్ సావంత్ చనిపోయారు
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న సంజయ్ సావంత్ గుండెపోటుతో మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో మంగళవారం రాత్రి పీఎస్లోనే ఆయన నిద్రపోయారు.నిద్రలోనే ఎస్సైకు గుండెపోటు రావడంతో చనిపోయారు. నాచారంలో నివాసముండే సంజయ్ సావంత్.. బుధవారం అబ్దుల్లాపూర్మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. ఎస్సై మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
1989లో కానిస్టేబుల్ గా సెలక్ట్ అయిన సంజయ్ సావంత్ రెండేళ్ల క్రితం ఎస్ ఐగా ప్రమోట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. హైబీపీతో బాధపడుతున్న ఎస్ ఐ సావంత్ పని ఒత్తిడి వల్లే గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ సంవత్సరం సెప్టెంబర్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా డ్యాన్స్ చేస్తూ ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన మల్కాజ్గిరిలోని ఆనంద్బాగ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరిలోని విష్ణుపురి కాలనీలో 31 ఏళ్ల డేవిడ్ అనే కానిస్టేబుల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతడు ఘట్కేసర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వినాయక నిమజ్జనంలో విష్ణుపురికాలనీలో భక్తులతో పాటే తానూ డ్యాన్స్ చేస్తూ కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృది చెందినట్టు వైద్యులు నిర్దారించారు. ఇటీవల కాలంలో గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనని వైద్యులు చెబుతున్నారు. హైబీపీ ఉన్నవారికి సమయానికి చికిత్స అందకపోతే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ ‘ఫెడరల్ తెలంగాణ’తో చెప్పారు.