‘టీడీపీ, జేడీయూ రెండూ అసంతృప్త ఆత్మలు’
x

‘టీడీపీ, జేడీయూ రెండూ అసంతృప్త ఆత్మలు’

కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.


కేంద్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై బీజేపీ మిత్రపక్షాలు నితీశ్‌ కుమార్‌, ఎన్‌ చంద్రబాబునాయుడు అసంతృప్తితో ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు.

ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్ శరద్ పవార్‌నుద్దేశించి ప్రధాని మోదీ వాడిన "భటక్తి ఆత్మ" పదాన్ని రౌత్ గుర్తుచేస్తూ.. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వరకు ఈ ‘అశాంతి ఆత్మలు' విశ్రమించవని పేర్కొన్నారు.

"పోర్ట్‌పోలియోలు కేటాయించిన విధానం, ముఖ్యంగా ఎన్‌డిఎ మిత్రపక్షాలందరి ఆత్మలు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్రంలో ముఖ్యంగా రెండు `అసంతృప్త ఆత్మలు' (బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు)లను సంతృప్తి పరచాలి. " అని రౌత్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ముఖ్యమైన శాఖలన్నింటిని తన వద్దే ఉంచుకుందని రౌత్ వ్యాఖ్యానించారు. పోర్ట్‌ఫోలియో కేటాయింపులో నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్-యునైటెడ్‌కు చెందిన లాలన్ సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలు లభించగా..టిడిపికి చెందిన కె రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారని, జెడి(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ శాఖ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

మోడీ మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ముస్లింలు బిజెపికి ఓటు వేయలేదని మోదీ భావిస్తున్నారని, అందుకే ఆ వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని రౌత్ ఆరోపించారు.

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి, రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేనలో "జీవం లేదన్నారు". ఆ రెండు శివసేన(UBT), NCP (శరద్చంద్ర పవార్)ను బలహీనపరిచేందుకు ఏర్పడిన పార్టీలని పేర్కొన్నారు.

Read More
Next Story