1949: తెలుగు సినిమాకు  అందగాడిని అందించిన సంవత్సరం
x
మనదేశం (1949)

1949: తెలుగు సినిమాకు అందగాడిని అందించిన సంవత్సరం

తెలుగు చిత్రప్రేక్షకులకు మరుపురాని చిత్రాలను అందించడమే కాదు, భవిష్యత్తు మహానటులను కూడా అందించిన సంవత్సరం


తెలుగు సినిమా చరిత్రలో 1949కు చాలా ప్రాముఖ్యం ఉంది. తెలుగు సినిమాని కొత్త మలుపు తిప్పిన సంవత్సరం అది. తెలుగు చిత్రప్రేక్షకులకు మరుపురాని చిత్రాలను అందించడమే కాదు, భవిష్యత్తు మహానటులను కూడా అందించిన సంవత్సరం అది. ఆ ఏడాది మొత్తం ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి. అందులో ఆరు హిట్టయ్యాయి. అవి: రక్షరేఖ (అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి, షావుకారు జానకి, భానుమతి), కీలుగుఱ్టం (అక్కినేని నాగేశ్వరరావు,అంజలీ దేవి, రేలంగి), బ్రహ్మరథం, లైలా మజ్నూ(అక్కినేని,పద్మిని, బానుమతి, ముక్కామల), ధర్మాంగద( సూర్యకాంతం, గోవిందరాజుల సుబ్బారావు), మనదేశం( నారాయణ రావు, చిత్తూరు నాగయ్య, నందమూరి తారకరామరావు, క్రిష్ణవేణి, రేలంగి),గుణసుందరి కథ ( కాళ్లకూరి సదాశివరావు, రేలంగి), జీవితం( ఎస్ వరలక్ష్మి, చిలకపాదు సీతారామాంజనేయులు).ఇందులో కీలుగుఱ్ఱం సూపర్ హిట్ అయింది.

*కీలుగుఱ్ఱం తెలుగు నుంచి తమిళంలోకి డబ్బింగ్ అయిన మొదటి చిత్రం.సూపర్ హిట్టయిన చిత్రం.

*ఎన్టీరామారావు తొలిచిత్రం ‘మనదేశం’ విడుదలయింది కూడా ఈ సంవత్సరంలోనే. దాని నిర్మాత మీర్జాపూరం రాజావారు. ఈ చిత్రంలో రామారావుది పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర. సినిమా అవకాశాల కోసం ఆలస్యంగా దర్శకుడు ఎల్ వి ప్రసాద్ ను ఆయన కలుసుకోవడమే దీనికి కారణం. లేకుంటే ఆయన హీరోగా సెలెక్ట్ అయ్యే వారే. ఆ చిత్రానికి అప్పటికే హీరోగా సిహెచ్ నారాయణరావు ను ఎంపిక చేశారు. ఆ రోజుల్లో నారాయణరావుకు తెలుగు సినిమా అందగాడని పేరు. రామరావు నటన చూశాక, తెలుగు తెరకు ’మరొక అందగాడు’ దొరికాడు అని అలాంటి నారాయణ రావే వ్యాఖ్యానించారట. ఆ మరుసటి సంవత్సరమే ఎన్టీఆర్ కు బిఎ సుబ్బారావు చిత్రం పల్లెటూరి పిల్ల లో హీరో అవకాశం వచ్చింది. అంతే తెలుగు సినిమాల్లో రామారావు శకం మొదలయింది.

* ఘంటసాల పూర్తిస్థాయి మ్యూజిక్ డైరెక్టర్ అయింది కూడా ఈ సంవత్సరంలోనే. అదికూడా మనదేశం చిత్రంతోనే.

*ఈ ఏడాదే తెలుగుతెర మీద ప్రత్యక్ష మయిన మరొక మహానటుడు ఎస్ వి రంగారావు. ఆయన ప్రవేశం కూడా మనదేశం చిత్రంతోనే.

*మీర్జాపురం రాజా ‘శోభనాచల స్టూడియో’ ని నిర్మించారు. ఈ శోభనాచలం ఏమిటి? విజయవాడకు సమీపాన అగిరిపల్లె అనే ఊరు ఉంటుంది. అక్కడ శోభనాద్రి అనే కొండ ఉంటుంది. ఆక్కడి దేవాలయంలో ఉండే దేవుడే శోభనాద్రీశ్వరుడు. ఈ దేవుడి పేరు మీదే స్టూడియోకూ ఆ పేరు పెట్టారు. అంతవరకు ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ ఏడాదే ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు. నాగేశ్వరరావు నటించిన కీలుగుఱ్ఱం చిత్రానికి డైరెక్టరాయనే. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ ‘శోభన గిరి నిలయా, దయామయా ’ అనే పాట రాజావారి భార్య సి కృష్ణవేణి పాడారు. టైటిల్స్ లో ఈ క్షేత్రాన్ని చూడవచ్చు. ఈ కృష్ణవేణియే ‘మనదేశం’ చిత్రం నిర్మాత

*జానపద చిత్రాలు ఆరోజుల్లో బాగా విజయవంతమవుతుంటే మీర్జాపురం రాజా ఒక మంచి కథకావాలని ప్రముఖ రచచయిత తాపీ ధర్మారావును అడిగారు. ఆయన కాశీమజిలీ కథల ఆధారంగా ఈ కీలుగుర్రం కథ తయారు చేశారు. అంతవరకు మీర్జాపూరం రాజావారి చిత్రాలకు డైరెక్టర్ గా పనిచేసిన చిత్రపు నారాయణ మూర్తి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే తయారు చేశారు.

*ఈ చిత్రం సూపర్ హిట్ అయి అక్కినేని నాగేశ్వరరావుని తిరుగులేని హీరోని చేసింది. అంతకు ముందే బాలరాజు తో నాగేశ్వరావు సక్సెస్ ఫుల్ హీరో అయినా, కీలు గుఱ్ఱం ఆయన తారాస్థాయికి తీసుకు వెళ్లింది.

*నిజానికి ఈ చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించేందుకు అంజలీ దేవి మొదట అంగీకరించలేదు. అయితే రాజాగారి భార్య, నటి, గాయకురాలు అయిన సి కృష్ణ వేణి ఆమెను ఒప్పించారు. చిత్రంలో ఆమె పాటలన్నీ కృష్ణ వేణియే పాడారు. అంజలీ అత్యద్భతంగా నటించారీ చిత్రంలో. ముఖ్యంగా ఆమె నృత్యాలకు విపరీతంగా పేరొచ్చింది.

*ఈ సినిమా కు సంగీతం ఘంటసాల సమకూర్చారు. ’కాదు సుమా... కల కాదు సుమా’ అనే ఘంటసాల , వక్కలంక సరళ పాడిన పాట ఆ రోజుల్లో తెగ సూపర్ హిట్టయింది.ఇప్పటికీ అది మరుపురాని పాటయే. చిత్రంలో దీనిని ఎఎన్ ఆర్, జూనియర్ లక్ష్మిరాజ్యం మీద చిత్రీకరించారు.

*కీలుగుఱ్ఱం 1949, ఫిబ్రవరి 19 న విడుదలయింది. విజయవాడ మారుతి టాకీస్ లో 148 రోజులు ఆడింది. చాలాచోట్ల శత దినోత్సవం జరుపుకుంది.

*ఈ చిత్రం ఒక విధంగా నాగేశ్వరరావుకు మొదటి వెడ్డింగ్ యాన్నివర్సరీ కానుక లాంటిది.ఎందుకంటే ఒక ఏడాది కిందటే ఆయనకు అన్నపూర్ణతో ఏలూరు దగ్గిర దెందులూలో వివాహమయింది.

* షూటింగ్ లో ఉన్నపుడే కీలుగుఱ్ఱం చరిత్ర సృష్టించింది. దానిని తమిళంలో రీమేక్ చేసేందుకు లంకా సత్యం ముందుకు వచ్చారు. దానిని జూపిటర్ పిక్చర్చ్ వారు ‘మెహినీ’ పేరుతో తీశారు. టిఎస్ బాలయ్య, మాధురి దేవి నాయకనాయికలుగా నటించారు. ఇందులో ఎమ్జీ ఆర్, విన్ జానకిలు నటించినా వారివి సపోర్టింగ్ రోల్సే. సన్నగా నాజూకుగా చలాకిగా ఉండే నాగేశ్వరరావు లాగా బాలయ్య కనిపించలేదు. గాలిలో కీలుగుర్రం మీద తేలిపోయే సీన్ లో బాలయ్య ఆకట్టుకోలేదు. బాలయ్యకు కొంచెం బొజ్జ ఉంటుంది.అది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. తమిళ చిత్రాన్ని వారు ఆదరించలేక పోయారు. అది బాక్సాఫీస్ దగ్గిర ఫెయిలయింది.

*దీనితో మీర్జాపురం రాజా కీలుగుఱ్ఱం ను తమిళంలోకి మాయక్కుదిరై (Mayakkari) పేరుతో డబ్ చేశారు. ఇలా కీలుగుఱ్ఱం తమిళంలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రమయింది. సూపర్ హిట్టయింది. రాజావారికి కాసుల వర్షం కురిపించింది. అన్నట్లు ఆరోజుల్లో నాగేశ్వ రావు తమిళంలో కూడా సూపర్ స్టారే..

Read More
Next Story