
అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’రివ్యూ
పుష్ఫరాజ్ బాక్సాపీస్ ను షేక్ చేశాడా? కథ ఎలా ఉంది.. రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతుందా? పుష్ఫ -2 రివ్యూలో చూద్దాం.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణాలు వచ్చేసాయి. థియేటర్లోకి దర్జాగా, కావాల్సినంత ఎలివేషన్స్ ఇస్తూ పుష్ప దిగాడు. అసలు పాట్నా ప్రమోషన్ ఈవెంట్ సక్సెస్ తోనే పుష్ప రూల్ చేయటం మొదలెట్టారనే చెప్పాలి. ‘పుష్ప 2’కి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో ఎంత హైప్ ఉందో ఆ ఈవెంట్ తో అర్థమైపోయింది.
పాట్నాలో మొదలైన ప్రమోషన్స్ తో ఓ జైత్రయాత్రలా ఈ సినిమా హైప్ క్రియేట్ చేసి దేశమంతటా పాకేసింది. ఆ తరవాత ఈవెంట్లన్నీ సూపర్ హిట్టయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో దుమ్ము రేపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే టిక్కెట్ రేట్లే సామాన్యుడుని భయపెట్టాయి. ఈ నేపధ్యంలో చేసిన ప్రమోషన్స్ తగ్గట్లు సినిమా ఉందా లేదా అని సగటు ప్రేక్షకుడుతో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. ఉందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటి..
పార్ట్ వన్ లో ఒక సాదా సీదా కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫీయాలో నెంబర్ వన్ స్దాయికి ఎదిగి, సిండికేట్ లీడర్ గా ఎదగటంతో ఈ ‘పుష్ప 2’మొదలువుతుంది. శ్రీవల్లీ(రష్మిక) తో హ్యాపీగా లైప్ లీడ్ చేస్తున్న అతను ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహారెడ్డిని కలిసేందుకు వెళ్తాడు. భార్య శ్రీవల్లీ కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించి భంగపడతాడు..‘స్మగ్లర్తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరించటంతో ఇగో దెబ్బతింటుంది.
దానికి తోడు సీఎం .. శ్రీవల్లీని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్. తనకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, వ్యాపారానికి సహకరించే ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) డబ్బు విసిరి ముఖ్యమంత్రిని చేస్తాడు. అయితే ఇది కేంద్రమంత్రి ప్రతాప్రెడ్డి(జగపతి బాబు)కి నచ్చదు. అతను పుష్పను కంట్రోల్ లో పెట్టాలని అనుకుంటాడు. మరోవైపు పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు.
ఇక పార్ట్ వన్ లో పెండిగ్ గా ఉన్న భన్వర్ సింగ్ షెకావత్ (పహ్లాద్ ఫాజిల్) పుష్పపై పగ తీర్చుకోడానికి ఎదురుచూస్తాడు. అతని వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టాలనుకుంటే ముఖ్యమంత్రి సిద్దప్ప నాయుడు(రావు రమేష్) రాజీ చేయటానికి ప్రయత్నించి సారీ చెప్పిస్తాడు. కానీ సారి చెప్పినట్లే చెప్పిన పుష్ప ...తనదైన శైలిలో భన్వర్ సింగ్ షెకావత్ ఇగో ని దెబ్బ తీస్తాడు. దాంతో భన్వర్ సింగ్ షెకావత్... పుష్పని మళ్లీ కూలిగా మారుస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
వీటిన్నటితో పాటు తనను తప్పించి సిండికేట్ లీడర్గా ఎదిగిన పుష్పరాజ్ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ) ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూంటారు? వీటితో పాటు పుష్ప రాజ్ జీవితంలో పర్శనల్ కాంప్లింక్ట్ ఉంటుంది. తన కుటుంబానికి చేరువ కావాలని ప్రయత్నిస్తూంటాడు. అందుకు సవతి అన్న అజయ్ అడ్డుపడుతూంటాడు. అప్పుడు ఏమైంది, చివరకు పుష్పరాజ్ సామ్రాజ్యం ఏమైంది, పుష్ప 3 పార్ట్ కు లీడ్ ఏమిచ్చారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది..
ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ప్రారంభించిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్తో నడిపించారు. సినిమా కమర్షియల్ గా హై రేంజిలో ఉంది. మూడు గంటల పదిహేను నిముషాలు అయినా ఇబ్బంది పెట్టని నేరేషన్ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రతీ పదినిముషాలకు ఓ హై ఉండేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవటం కలిసి వచ్చింది.
ముఖ్యంగా తన ఇగోని సంతృప్తిపరచుకోవటానికి డబ్బు వెదజల్లి రావు రమేష్ ని ముఖ్యమంత్రి చేయటం, అలాగే భన్వర్ సింగ్ షెకావత్ కి సారీ చెప్పినా తన ఇగో చల్లారక రెచ్చగొట్టటం వంటి క్యారక్టరైజేషన్ లో వచ్చే ఎలిమెంట్స్ మాస్ కు బాగా ఎక్కుతాయి. అలాగే సెకండాఫ్ లో గంగమ్మ జాతర ఓ మెస్మరైజింగ్ ఎపిసోడ్. కథకు ఆ జాతర ఎపిసోడ్ కు బాగా ముడిపెట్టారు. క్లైమాక్స్ లో మహిషాసుర మర్దని బిజీఎం వస్తూండగా విలన్ ని ఎటాక్ చేయటం కూడా మంచి హై ఇస్తుంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే సినిమాలో తన కుటుంబంలో తాను కలవటం కోసం పుష్ప తాపత్రయపడే సీన్స్ మనని కట్టిపారేస్తాయి. ఆ పాత్రపై అంతవరూ ఏ మాత్రం నెగిటివిటి ఉన్నా మొత్తం కొట్టుకుపోతుంది. లెక్కలు మాస్టర్ అలా ఎక్కడెక్కడ లెక్కలు సరిచేసుకుంటూ వెళ్ళారు.
ఆ సీన్స్ బాగా పండాయి. చివరలో తన సవతి అన్న కు తనకు మధ్య వచ్చే ఎమోషన్ సీన్ మనని థియేటర్ నుంచి బయిటకు వచ్చినా గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇలాంటివి మాస్ యాక్షన్ సినిమాల్లో సాధారణంగా పెద్దగా ఉండవు కానీ సుకుమార్ తన సినిమాని ఫ్యామిలీలోకి కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. అందుకే అటువైపు సెకండాఫ్ కథను నడిపించారు. ఓవరాల్ గా మాస్టర్ స్క్రీన్ ప్లే రైటింగ్ కనిపిస్తుంది. అయితే సినిమాలో స్ట్రాంగ్ విలన్ లేకపోవటం తో వార్ వన్ సైడ్ గా మిగిలి కొన్ని ఎపిసోడ్స్ విసిగిస్తాయి. ఇక షెకావత్కి, పుష్ప ఇద్దరూ సంజ్ఞలు చేసుకుంటూ సాగే ఎపిసోడ్ వంటివి బోర్ కొట్టిస్తాయి.
ఎవరెలా చేసారు
సినిమాలో అల్లు అర్జున్ కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో, యాటిట్యూడ్ చూపెట్టడంలో చూపించిన ఈజ్ మామూలుగా ఉండదు. అలాగే ఎమోషన్ సీన్స్ లో తన పరిణితి కనిపిస్తుంది. రష్మిక చాలా వరకూ అల్లు అర్జున్ తో పోటీ పడుతూ వచ్చింది.
ఫాహ్లాద్ ఫాజిల్ అయితే మరోసారి స్క్రీన్ ని అదరకొట్టేసాడు..కొన్ని చోట్ల తేలిపోయింది. అజయ్ తన రెగ్యులర్ విలన్ పాత్రలకు డిఫరెంట్ గా కనిపించారు. అనసూయ కథాగమనానికి ఉపయోగపడింది. ‘కిస్సిక్’ పాటతో శ్రీలీల (Sreeleela)అదరకొట్టింది. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ లకు ప్రయారిటీ లేదు.
టెక్నికల్ గా
సుకుమార్ సినిమా అంటే టెక్నికల్ గా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. ఈ సారి అదే జరిగింది. అన్ని క్రాఫ్ట్ లు పోటీపడి మరీ పనిచేసాయి. సుకుమార్ డైరక్షన్ గురించి కొత్తగా చెప్పేదేముంది. దేవిశ్రీ పాటలు ఇప్పటికే మాస్ లోకి వెళ్లిపోయాయి. డైలాగులు సినిమాలో కలిసిపోయాయి.స్లాంగ్ ఫెరఫెక్ట్ గా వర్కవుట్ చేసారు. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో కీలక పాత్ర. కూబా కెమెరా వర్క్ పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.
హైలెట్స్
గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ విశ్వరూపం
ఇంట్రవెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎమోషన్
అల్లు అర్జున్ నటన, రష్మిక మందన్న తో కెమిస్ట్రీ
సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
మైనస్
సినిమాలో స్ట్రాంగ్ విలన్ లేకపోవటం
ఎక్కువ ఎలివేషన్స్ తో స్క్రిప్టుని నింపేయటం
చివరగా...
‘పుష్ప ది రూల్’ రూల్ చేయటం ఖాయం అనిపిస్తుంది. అల్లు అర్జున్ నటనతో పోటీగా మిగతా ఎలిమెంట్స్ అన్ని అమిరాయి. ఒక్క లెంగ్తే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. యాక్షన్ తో పాటు గ్లామర్ ని సమపాళ్లలో డిజైన్ చేసిన ఈ సినిమా తన టార్గెట్ ని రీచ్ అయ్యిందనే చెప్పాలి. సీక్వెల్ గా మొదటి సినిమా కన్నా ఓ మెట్టు ఎక్కువే ఉంది.
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులు
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్
రచన-దర్శకత్వం: సుకుమార్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
విడుదల తేది: డిసెంబర్ 5, 2024
Next Story