
'బాలీవుడ్ హీ-మ్యాన్' ఇక లేరు..
అనారోగ్యంతో కన్నుమూసిన ధర్మేంద్ర..ముంబైలో నేడు అంత్యక్రియలు..
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు ధర్మేంద్ర(Dharmendra) కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మేంద్ర శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు ఆయనను అక్టోబర్లో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమని ఆస్పత్రికి తీసుకెళ్లామని, ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేమ మాలిని, సన్నీ దేవోల్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
300 చిత్రాలకు పైగా..
పంజాబ్ రాష్ట్రం లూధియానా జిల్లా సహనేవాల్ గ్రామంలో 1935 డిసెంబరు 8న జన్మించిన ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్. 1954లో ప్రకాశ్కౌర్ను తొలుత వివాహమాడారు. సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలినితో ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. 1980లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం.
ఎన్నో అవార్డులు..
బాలీవుడ్ ప్రముఖులు రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్తో కలిసి నటించారు ధర్మేంద్రను ఎన్నో అవార్డులు వరించాయి. కోట్ల సంఖ్యలో అభిమాన గణం ఆయన సొంతం. కొన్ని దశాబ్దాలుగా చిత్రసినిమాలో రాణించిన ధర్మేంద్రకు ‘షోలే’(Sholay) చిత్రం మంచిపేరు తెచ్చిపెట్టింది. చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణతో సత్కరించింది.
రాజకీయాల్లోనూ..
ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొంది 2009 వరకు సేవలందించారు. ఆయన భార్య హేమామాలిని. పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు సన్నీ డయోల్ కూడా గతంలో చురుకైన రాజకీయ నాయకుడే. కాని రాజకీయాల్లో రాణించలేకపోయారు.
1960లో సినీ అరంగేట్రం..
1960లో ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరా’తో నటుడిగా తన కెరీర్ను ప్రారంభించిన ధర్మేంద్ర..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. ‘అన్పధ్’, ‘బందిని’, ‘అనుపమ అండ్ ఆయా సవాన్ జూమ్ కే’ తదితర చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘షోలే’, ‘ధర్మవీర్’, ‘చుప్కే చుప్కే’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘డ్రీమ్ గర్ల్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. చివరిగా షాహిద్ కపూర్, కృతి సనన్ల ‘తేరీ బాతూన్ మైనే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో వెండితెరపై కనిపించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్’ త్వరలో విడుదల కానుంది. ధర్మేంధ్ర మొదటి యాక్షన్ మూవీ ఫూల్ ఔర్ పత్తర్. చక్కటి శరీర సౌష్టవం, ఆకట్టుకునే రూపం..స్టంట్లలో వైరుధ్యం చూపే ధర్మేంద్రకు బాలీవుడ్లో 'బాలీవుడ్ హీ-మ్యాన్'గా పేరుంది.
కడసారి వీడ్కోలు..
ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్లో పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికకే తరలివచ్చి, నివాళులర్పించారు. ధర్మేంద్ర మృతిపట్ల దర్శక, నిర్మాత కరణ్జోహర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఒక శకం ముగిందని అన్నారు. ‘మెగాస్టార్, గొప్ప అందగాడు, ఇండియన్ సినిమా లెజెండ్ వన్ అండ్ ఓన్లీ ధర్మేంద్రజీ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం’ అని పేర్కొన్నారు.
Next Story

