ప్రముఖ గాయని ఆశాభోస్లేకు గుండెపోటు
x
ఆశా భోస్లే

ప్రముఖ గాయని ఆశాభోస్లేకు గుండెపోటు

బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్


Click the Play button to hear this message in audio format

ప్రముఖ గాయని ఆశాభోస్లే ఛాతీ ఇన్ఫెక్షన్, గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. నిన్న సాయంత్రం నీరసంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముంబాయిలోని ఒక ఆస్పత్రిలో చేర్పించినట్లు ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ప్రస్తుతం ఆమె వయస్సు 92 ఏళ్లు.

ఈ లెజెండరీ సింగర్ ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భోస్లే ఆరోగ్య వివరాలను జానై ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

"మా అమ్మమ్మ, ఆశా భోస్లే తీవ్రమైన నీరసం, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. దయచేసి మా గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. అమ్మమ్మ ఆరోగ్యం త్వరగా కుదుటపడుతుందని ఆశిస్తున్నాము. మేము మీకు సానుకూల సమాచారాన్ని అందిస్తాము" అని ఆమె రాశారు.

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించారు. ఆమె ప్రేమ గీతాల నుంచి గజల్స్, ఉత్సాహభరితమైన పాటల వరకు ఎన్నో మరపురాని గీతాలను ఆలపించారు. ఆమె అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో 'అభి నా జావో చోడ్ కర్', 'ఇన్ ఆంఖోన్ కి మస్తీ', 'దిల్ చీజ్ క్యా హై', 'పియా తు అబ్ తో ఆజా', 'దునియా మే లోగోన్ కో', 'జారా సే ఝూమ్ లూన్ మైన్' మొదలైనవి ఉన్నాయి.
భోంస్లే వివిధ భారతీయ భాషలలో 12,000 పాటలు ఆలపించారు. మీనా కుమారి, మధుబాల, జీనత్ అమన్ నుంచి కాజోల్, ఊర్మిళ మటోండ్కర్, పద్మిని, వైజయంతిమాల వంటి దక్షిణాది నటులకు గాత్రదానం చేశారు.
2023లో, ఆమె తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌లో 'ASHA@90: Live in concert' అనే ప్రత్యేక కచేరీలో ప్రదర్శన ఇచ్చింది. భోంస్లే లెజెండరీ సింగర్ దివంగత లతా మంగేష్కర్ చెల్లెలు.
Read More
Next Story