
విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఆ నవల ఆధారంగానేనా?
'రణబలి' వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజం!
తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు నవలల ఆధారంగా అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ పూర్తిగా కనుమరుగైపోయింది. కేవలం కమర్షియల్ హంగామా వెంటే పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఒక సాహసోపేతమైన అడుగు టాలీవుడ్లో పడబోతోందని వినపడుతోంది. ఒక అవార్డు విన్నింగ్ నవల ఆధారంగా, ఓ క్రేజీ స్టార్ హీరో సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. అదే నిజమైతే, తెలుగు సినిమా మళ్ళీ సాహిత్యంతో జతకట్టి కొత్త పుంతలు తొక్కడం ఖాయం! ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. ఇంతకీ ఆ నవల ఏంటి
అక్షరం నుంచి దృశ్యం వరకు: 'శప్త భూమి' ఆవశ్యకత
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణ స్వామి రాసిన 'శప్త భూమి' నవల ఆధారంగా విజయ్ దేవరకొండ - రాహుల్ సాంకృత్యాయన్ సినిమా రూపొందుతోందని సమాచారం.
కథా నేపథ్యం: ఇది 18వ శతాబ్దపు రాయలసీమ (అనంతపురం పరిసర ప్రాంతాలు) పాలెగాళ్ళ కథ. కరవు కాటకాలు, వలసలు, జానపద గాథలు మరియు నాటి రాజకీయ కుతంత్రాల సమాహారం ఈ 'శప్త భూమి'.
మ్యాజిక్ రియలిజం: పురాణాల తరహాలో కథ వెనక్కి ముందుకు నడుస్తూ, చదువరులను మంత్రముగ్ధులను చేసే 'మ్యాజిక్ రియలిజం' టెక్నిక్ ఈ నవల ప్రత్యేకత. ఒక రకంగా చెప్పాలంటే, ఆయా ఊర్లే ఈ కథలో పాత్రధారులుగా నిలుస్తాయి. అదే కథను సినిమాటెక్ గా మార్చి విజయ్ దేవరకొండ చేస్తున్నాడని వినపడుతోంది.
విజయ్ దేవరకొండ ‘రణబలి’గా వస్తున్నాడు!
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'టాక్సీవాలా' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రణబలి’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ ఇందులో ఒక వీరయోధుడి పాత్రలో, మునుపెన్నడూ చూడని లుక్లో కనిపించబోతున్నారట.
అఫీషియల్ గా చెప్పటం లేదు
ఫలానా నవల ఆధారంగా తమ సినిమా చేస్తున్నామని ఇప్పటిదాకా టీమ్ ప్రకటించలేదు. దాంతో ఈ వార్త కేవలం ఊహాగానంగా మారుతుందా లేక నిజంగానే శప్తభూమి ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఫ్యాన్స్కు కంబ్యాక్ ట్రీట్!
ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్త నిరాశలో ఉన్న రౌడీ ఫ్యాన్స్కు 'రణబలి' సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను రిపబ్లిక్ డే కానుకగా సోమవారం అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక హీరోయిన్.
సినిమా అంటే కేవలం నాలుగు ఫైట్లు, ఆరు పాటలు మాత్రమే కాదు.. ఒక ప్రాంతపు చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే అద్దం అని నిరూపించడానికి ‘రణబలి’ సిద్ధమవుతోంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, మరిన్ని తెలుగు నవలలు వెండితెర రూపం దాల్చడానికి మార్గం సుగమం అవుతుంది. సాహిత్యానికి, సినిమాకు మధ్య ఉన్న ఈ వారధి మళ్ళీ గట్టిగా నిర్మించబడాలని కోరుకుందాం!

