
కుంభమేళా..ఓ మేళాకాదు!!
కుంభమేళా ముగింపు మీద కవిత...
-డాక్టర్ గోపికృష్ణ
కుంభమేళాకు వెళ్ళొచ్చి
ఇంట్లోకి అడుగుపెట్టగానే
అమ్మ ఆదుర్దాగా అడిగింది..
ఇబ్బందులేమీ పడలేదుగా అని!
నాన్న నన్ను పరామర్శించాడు
ప్రయాణం బాగా జరిగిందిందాని!
మా ఆవిడ విసుక్కొంటూ అంది
ఎన్నిసార్లుచేసినా ఫోనెందుకెత్తవని!
కుర్రాడైన కొడుకు నవ్వుతూఅన్నాడు
మోనాలీసా కనిపించిందా అని!
పడుకొన్న బామ్మ లేచి అడిగింది
సంగమతీర్థం నాకోసం తెచ్చావాని!
విషాదమేమిటంటే ఒక్కరూఅడగలేదు..
ఎందరు మహానుభావులను కలిశావని!
ఏంత భక్తిసాగరాన్ని చవిచూశావని!
గంగాయమునలు ఆదరించాయని!
మహదేవుడి దర్శనమైందా అని!
అవును...
కుంభమేళాఅంటే పుణ్యకాలంలో
పవిత్ర త్రివేణీ సంగమంలో
మూడు మునకలెయ్యడమేకాదు..
భక్తజన సముద్రంలో ఈదులాడి
భవసాగరాన్ని ఈదేందుకు
పుణ్యశక్తిని సంపాదించుకోవడం!
కుంభమేళా అంటే వందేళ్ళ వేడుకని
దేశమంతా ప్రయాగ పైకి
మూకుమ్మడిగా దండెత్తడం కాదు..
సంగమస్నానంతో పునీతులమై
చేసినతప్పులు మళ్ళీ చేయమని
భక్తితో పునరంకితులం కావడం!
హర హర మహాదేవ్!!
(డాక్టర్ గోపికృష్ణ, అమృత హాస్పిటల్, మదనపల్లె)