తిరుపతి దగ్గిర పచ్చదనాల రాశి పెమ్మగుట్టకు ట్రెక్
x

తిరుపతి దగ్గిర పచ్చదనాల రాశి పెమ్మగుట్టకు ట్రెక్

ఆ కొండ మీద ప్రేమతో గల్లా రామచంద్రనాయుడు 2006 లో కొండను దత్తత తీసుకొని ఎంతో శ్రద్ధతో , కొన్ని వేల మొక్కలు నాటించి ఆ చిట్టడవి పచ్చ దనాన్ని యెన్నో రేట్లు పెంచారు.



ఇంత కాలంగా మేం చేస్తున్న ట్రెకింగ్ లు ఒక ఎత్తు. ఈ రోజు ట్రెక్ ఒక ఎత్తు. ఇది చాలా ప్రత్యేకం. రెండేండ్ల కిందటి మాట. ఒక సారి మాజీ మంత్రి శ్రీమతి గల్లా అరుణ కుమారి గారి నుంచి ఒక ట్రెకింగ్ ఆహ్వానం వచ్చింది. మొదటి నుండి మా ట్రెకింగ్ లను గమనిస్తూ పరిశీలిస్తూ ఉన్న ఆమె ఒక రోజు, “అన్నా మా వూరిలో మేము దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన అడవి ఉంది. శేషాచలం అడవులన్నీ మీరు తిరుగుతున్నారు. మా ఊరి అడవికి కూడా మీరు ట్రెకింగ్ కి రండి,” అని ఆహ్వానించారు. దానిఫలితమే ఈ ట్రెకింగ్. ఈ ఆహ్వానం ఆమె సంస్కారానికి, ప్రకృతి పట్ల ఆమెకు ఉన్న అభిమానానికి నిదర్శనం.

మేము మొత్తం డెబ్భై మంది ట్రెకింగ్ కి వస్తున్నామని తెలియజేయగానే గల్లా రామచంద్రనాయుడు గారు , యెంతో శ్రద్ధ తీసుకొని వారం రోజుల ముందు నుండే, వారు దత్తత తీసుకున్న పెమ్మ గుట్ట అటవీ ప్రాంతాన్ని మేము వెళ్లడానికి అనువుగా దారి యేర్పాటు చేయడం, ఇతర యేర్పాట్లు చేయించి పెట్టటమే కాకుండా, మేమందరము రావడానికి తిరుపతి నుండి బస్సును కూడా యేర్పాటు చేశారు.

ఇదే పెమ్మగుట్ట




మా ట్రెకింగ్ సభ్యులం అందరం బస్సులో, కార్లలో ఆదివారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి గల్లా రామచంద్ర నాయుడు గారి స్వగ్రామమైన పేటమిట్ట గ్రామానికి చేరుకున్నము. ఆ గ్రామంలోనే ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా యెదిగి, నేడు వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి ఒక సామ్రాజ్యన్ని స్థాపించిన ఆయన ప్రస్థానం, నేటి యువతకి ఆదర్శనీయం.




పేటమిట్ట చిన్న గ్రామమే అయినా, ప్రాధమిక వైద్య కేంద్రం, మంచి పాఠశాల, చక్కని డ్రైనేజీ వ్యవస్థ, ఆధునీకరిoచిన చెరువుతో కళకళలాడుతోoది, అక్కడి వాతావరణానికి మా వాళ్లు ఆశ్చర్య పోయారు. పేటమిట్ట చేరుకోగానే గల్లా దంపతులు మాకు సాదర స్వాగతం పలికి, వారి ఇంటిలో నే మాకు అల్పాహారం యేర్పాటు చేశారు. తర్వాత, గల్లా దంపతులు ఇష్టాగోష్టి గా మాట్లాడుతూ పెమ్మగుట్ట కొండతో వారికి వున్న అనుబంధాన్ని, ఎన్నో జ్ఞాపకాలను, అనుభూతులను పంచుకున్నారు.




ముఖ్యంగా రామచంద్ర నాయుడు గారు, వారి చిన్న తనంలో ఆవులను తోలుకొని గుట్ట మీదకు వెళ్లే వారట, కొండ చుట్టూ తిరిగే వారంట, గుట్ట మీద వుండే పెద్ద బండను ఎక్కి ఆడుకొనే వారంట. ఆ కొండతో వారికున్న ఈ అనుబందాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. ఆ కొండ మీద ప్రేమతో 2006 వ సంవత్సరము ఆ కొండను దత్తత తీసుకొని ఎంతో శ్రద్ధతో , కొన్ని వేల మొక్కలు నాటించి ఆ అడవి పచ్చ దనాన్ని యెన్నో రేట్లు పెంచారు. ఇలా వారి అనుభూతులన్ని చెప్పి మమ్మల్ని ఉత్సాహ పరిచారు.

రామచంద్ర నాయుడు గారు పెమ్మమిట్టను దత్తత తీసుకున్నాక, దానిని ఒక సామాజిక అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దినారు. అడవి మొదట్లో ఉసిరి చెట్లు స్వాగతం పలుకుతాయి. రకరకాల చెట్లతో అడవి దట్టంగా వుంది, గుట్ట దారి మొత్తం బండ రాళ్లతో, గుండు రాళ్లతో పూర్తిగా ఎక్కుడు గానే వుంది. ముఖ్యంగా చెప్పుకోవలసినది ఈ గుట్టకి అదే మొదటి ట్రెకింగ్. గ్రామస్తులు వాళ్ళ అవసరాల కోసం వెళ్లడమే కానీ, ఇలా ఒక సమూహముగా ట్రెకింగ్ వెళ్లడం గుట్ట కు కూడా కొత్త అనుభూతే.




గుట్టలెక్కడానికి, కొండలెక్కడానికి, లోయల్లోకి దిగడానికి బాటా అలవాటైన మేము నలభై నిమిషాల్లో ఎక్కగాలిగాము. కొత్త వారికి గంటన్నర పైగా పట్టింది. ఆపసోపాలు పడుతూ ఎక్కినా చివరికి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. గుట్ట మీద అందరం సంతోష పడిపోయాము.

గుట్ట పై నుండి చూస్తే ఒక అద్భుతమయిన ప్రకృతి దృశ్యం కనబడుతుంది. నాలుగు వైపులా కనుచూపు మేరా పరుచుకున్న పచ్చదనమే, మధ్య మధ్యలో చెరువులు, చిన్న చిన్న కొండలు చాలా ఆహ్లాదముగా వుంది వాతావరణం. మనకు దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రదేశం ఉందా అనిపించింది. ఈ సౌందర్యం ఆస్వాదిస్తునందుకు.అనుకోకుండా ఇలాంటి అవకాశం దక్కినందుకు చాలా ఆనందించాము. గుట్ట మీద నీటి చెలమ, బోద పొదలు, ఎక్కుడు రాళ్లు అన్నీ కలియ తిరిగి వచ్చి ప్రతి ఒక్కరం చాలా అనందించాం.




అడవులు, జలపాతాలు, ప్రకృతి బాట పట్టడం వలన మనకు తెలియని ప్రపంచం, మనకు తెలియని రహస్యములు చెబుతుందని కులం, మతం, ప్రాంతం, ఆర్థిక వ్యత్యాసాలు లేని సమాజాన్ని నిర్మించుకోవడానికి ఈ నడక దారులు ఉపకరిస్తాయి. ఈ విసయాన్ని చెబుతూ ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరూ అవునని అంటూ వుంటే చాలా సంతోషమనిపించింది.

వచ్చిన వారందరికి ట్రెకింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పి, గుట్ట అంతా కలియక తిరుగుతూ దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము.




ఊరు చేరుకోగానే గల్లా దంపతులు ఏర్పాటు చేసిన అద్భుతమైన , గొప్ప రుచికరమైన విందు భోజనాలు మా అలసటను నిమిషాల్లో తీర్చేసింది. అక్కడే వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీరుతున్నదిను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించి, తరగతి గదులను చూపించి చాలా విజ్ఞానాన్ని పంచి పెట్టారు





తర్వాత అక్కడి కి దగ్గరలోనే ఉన్న పాటూరి రాజ గోపాల్ నాయుడు గారి ఊరు ‘దిగువ మాఘం’ ప్రయాణం అయినాము. నేను వామ పక్ష రాజకీయాల్లో మునిగితేలుతున్న రోజుల నుండి రాజగోపాల్ నాయుడు గారు నాకు తెలుసు, గొప్ప రచయిత, సంస్కరణ అభిలాషి, నిగర్వి, అంతకు మించి గొప్ప సంస్కారుడు. నా ఉపన్యాసాలు వినడానికి అదే పనిగా తిరుపతి కొనేటికట్టకు వచ్చేవారు. అప్పటికి, మా వయస్సు, జ్ఞానంలో ఎంత తేడా? అయినా మేము ఏదో సామాజిక మార్పును ఆశిస్తున్నామని మంచి స్ప్రుహ తో వున్న సం స్కారి వారు. ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు . నా "రాయలసీమ ముఖ చిత్రం " పుస్తకాన్ని వారి మరణానికి ముందు ఆవిష్కరించిన మహనీయుడు. వారి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించి, కాలి నడకన వారు తిరిగిన రోజులను గుర్తు చేసుకుంటూ...ఈ పాదచారులం గొప్ప అనుభూతులను మనసులో పదిల పరుచుకొని తిరుపతి కి తిరుగు ప్రయాణం అయ్యాం.




వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ వినోద, విజ్ఞానదాయకమైన ట్రెకింగ్ గా మరపురానిదిగా మిగిలి పోయింది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.



Read More
Next Story