తిప్పలన్నీతీర్చే తిప్పతీగ సేద్యం
x

తిప్పలన్నీతీర్చే తిప్పతీగ సేద్యం

అతడి పోలమే ఒక ఔషధశాల


మామూలుగా రైతులు కాకర,చిక్కుడు, బీర,పొట్ల పాదులను పెంచడానికి పందిర్లు వేస్తారు. కానీ ఈ రైతు మాత్రం కొన్ని అరుదైన మొక్కల కోసం మాత్రమే పొలంలో పందిర్లు వేయాలనుకున్నాడు. సాధారణ సేద్యంతో పాటు. ప్రతీ రైతు కనీసం పావు ఎకరంలో అయినా అలాంటి పంటలు పండించాలంటాడు.పొలం లేక పోతే కనీసం మిద్దెమీదైనా నాలుగు మొక్కలు పెంచాలంటాడు.

ఏమిటా మొక్కల గొప్పతనం ? అతడి లక్ష్యం నెరవేరిందా?

ఒక ఉదయం పూట తన పొలంలో అతడు పెంచుతున్న తీగ జాతి మొక్కలు నేల మీద పాకడం వల్ల మట్టి కొట్టుకు పోయి ఆకులు కుళ్లిపోవడం చూసి చలించిపోయాడు.

పరిష్కారం కోసం ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాడు. మొక్కలను కాపాడుకునేందుకు పందిర్లు వేసుకోవడానికి రాయితీలు కావాలని అడిగాడు.

బీరకాయలు, పొట్లకాయల వంటి తీగలకు పందిర్లు ఇస్తాం కానీ నువ్వు పెంచే మొక్కలకు సాధ్యం కాదని, రూల్స్‌ ఒప్పుకోవని వారు అన్నారు.

ఇంతకీ అతను పందిర్లమీద పెంచాలనుకున్న మొక్కలు ఏంటో తెలుసా?

అమృత వల్లి. దానినే తిప్పతీగ అని కూడా అంటారు.

రైతులంతా వరి, చెరుకు పండించి , శరీరాల్లో కార్బొహైడ్రేట్‌లు పెంచుతుంటే, వాటివల్ల వచ్చే షుగర్‌,బీపీలను అదుపు చేసే ఔషధ గుణాలున్న మొక్కలను అతడు పెంచాలనుకున్నాడు. తొలి ప్రయత్నంలో అలా విఫలం అయ్యాడు ఆ బడుగు రైతు. రాయితీ అందక పోయినా నిరుత్సాహ పడక, తన లక్ష్యం ఆపకుండా ముందుకే సాగాడు

పందిర్ల మీద ఔషధ మొక్క!

ఆ రైతు పేరు పరిమే మరియ దాసు.

నూజివీడు మండలం, రాట్నాల గూడెం ( కృష్ణా జిల్లా) కు చెందిన ఈ రైతుకు ప్రాచీన వైద్య విధానాల మీద మక్కువ. మామూలు పంటలతో పాటు, ఔషధ మొక్కల ప్రాధాన్యత కూడా రైతులకు తెలియ చేయాలనే భావనతో మందు మొక్కల పెంపకం ప్రారంభించాలనుకున్నాడు కానీ అతడికి సెంటు భూమి కూడా లేదు. ఆయుర్వేదం పై ఆసక్తిని చంపుకోలేక 60 సెంట్ల భూమిని 2017లో కౌలుకు తీసుకొని తిప్ప తీగ పాదులను సేంద్రియ పద్ధతిలో పెంచడం మొదలు పెట్టాడు.

పందిర్లపై తిప్ప తీగ పెంచుతున్న పరిమే మరియదాసు

నేల మీద పాకించడం వల్ల చాలా మొక్కలు చని పోయాయి. ఉద్యాన శాఖ రాయితీ కోసం చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో సొంతంగా కర్రలతో పందిర్లు నిర్మించి తిప్పతీగ సాగు చేస్తున్నాడు.

ఆయుర్వేదంలో విలువైన మొక్క

తిప్పతీగకు ఆయుర్వేదంలో విశిష్ట స్ధానం ఉంది. దీని శాస్త్రీయ నామం టీనొస్పొరా కోర్డి ఫోలియా.( Tinospora cordifolia ) అమృత వల్లి అని కూడా పిలుస్తారు.


అన్ని సీజన్‌లలో పచ్చగా ఎదుగుతూ, ఇతర చెట్ల ఆసరాతో అల్లుకు పోయే మొక్క ఇది. ఆకులు బచ్చలి, మనీప్లాంట్‌ని పోలి ఉంటాయి. కొన్ని గ్రామాల్లో, అడవుల్లో ఎక్కువగా ఎదుగుతుంది.

అరుదైన ఔషధగుణాలున్న ఈ మొక్క క్రమంగా అంతరించి పోవడం దాసును కలవరపరిచింది. అందుకే దీనిని అన్ని పంటలు లాగే సంప్రదాయ సాగుబడిలోకి తీసుకు వచ్చి కాపాడాలనుకున్నాడు. తిప్పతీగ మొక్కలను సేకరించి, రెండు గజాల దూరం చొప్పున 60 సెంట్లకు 720 మొక్కలు నాటాడు. నేలమీద కంటే పందిరి పైకి పాకిస్తే దిగుబడి ఎక్కువ వస్తుందంటాడు దాసు.

మార్కెట్‌లో 4 వేల ధర

‘‘ ఒక చెట్టుకు కనీసం పది కిలోల దిగుబడి వస్తుంది. పదికిలోల తిప్పతీగ నుండి 200 గ్రాముల తిప్ప సత్తు వస్తుంది. 30 వేల పెట్టుబడి అయింది. ఖర్చులన్నీ పోను లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. కిలో తిప్ప సత్తు మార్కెట్‌లో 4 వేల ధర పలుకుతుంది. వర్షం పడినా పడక పోయినా ఈ సాగు కు ఇబ్బంది లేదు.ఎక్కడైనా పెరుగుతుంది. సేంద్రియ ఎరువు వాడితే కాండం బలంగా ఉంటుంది.ఈ తిప్ప తీగను కత్తిరించి పశువులకు ఆహారంగా ఇవ్వడం వల్ల వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి అధిక పాలను ఇస్తాయి.పశుసంపద పెరుగుతుంది. ’’ అన్నారు దాసు.

మనుషుల్లో సత్తువ పెంచే తిప్పసత్తు !

‘‘ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మూలికల్లో ముఖ్యమైనది తిప్పతీగ. మన శరీరంలోని చాలా తిప్పలను తగ్గిస్తుంది. తిప్పతీగలో అంటువ్యాధులను అధిగమించే సహజ సామర్థ్యం ఉంటుంది. అలాగే పేగుల ఆరోగ్యానికి ఇది చాలామంచిది.

తిప్ప తీగ అకు ఆయుర్వేదంలో బాగా ఉపయోగపడుతుంది. కాండం నుండి వచ్చిన గుజ్జును నిలువ చేసుకొని మందుగా ఉపయోగించుకోవచ్చు. తిప్పతీగ కాండాలను ముక్కలు చేసుకొని అల్లం పేస్ట్‌ లాగా నూరుకొని ఆ మిశ్రమానికి నీటిని కలిపి వడకట్టితే, తెల్లని పేస్ట్‌ లాంటి పదార్ధం వస్తుంది. దానినే తిప్పసత్తు అంటారు. రోజూ పది గ్రాములు చొప్పున 3 పూటలా తీసుకోవాలి. సుగర్‌, బీపీ అదుపులో ఉంచుతుంది.’ అంటాడు దాసు.

వైద్యుడిగా డిగ్రీలు లేక పోయినా ఆయుర్వేద గ్రంధాలు చదివి వన మూలికల మీద అవగాహన పెంచుకొని ఏ మొక్కలు ఏ సమస్యలను నివారిస్తాయో తెలుసుకున్నాడు, ఈ రైతు.

వ్యాధుల నివారణలో తిరుగులేని తిప్ప తీగ

‘ తిప్పతీగ శరీరానికి సహజమైన రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, తగ్గింపునకు కూడా తిప్పతీగ బాగా పనిచేస్తుంది. కీళ్లనొప్పులు, కీళ్లలో మంట తగ్గుతాయి. బోలు ఎముకల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఎముక మాతృక యొక్క ఖనిజీకరణను కూడా మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విష వ్యర్థాలను నిర్విషీకరణ చేయడానికి కాలేయానికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. దీర్ఘకాలిక దగ్గు వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ శ్లేష్మ పొరను శాంతింపజేస్తుంది, ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్‌, శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది.’ అని వివరించాడు మరియదాసు. ఇవన్నీ ఆయర్వేద పుస్తకాలు చదివి,నిపుణులతో మాట్లాడి తెలుసుకున్నాక, ఇంత విలువైన పంటను పండిరచడం చాలా ముఖ్యం అని భావించాను అని అన్నారు.

తిప్పతీగతో పాటు పొడపత్రి పెంచుతున్న మరియదాసు

అర ఎకరంలో ఔషధ మొక్కలు

తన పొలంలో తిప్ప తీగపాదులు మాత్రమే పెంచి ఊరుకోకుండా, అపార ఔషధ గుణాలున్న నేల వేము , పొడపత్రి, సరస్వతి మొక్కలను కూడా పెంచుతున్నాడు. అయిదు ఎకరాలున్న రైతులు మిగతా పంటలు తో పాటు, కనీసం అర ఎకరంలో నైనా ఇలాంటి ఔషధ మొక్కలు పెంచితే మనకు సగం వ్యాధులు తగ్గిపోతాయి. ఈ పంటల పై ప్రతీ రైతు అవగాహన పెంచుకోవాలి. సలహాలు కావాల్సిన వారికి శిక్షణ ఇస్తున్నాడు. ఆయుర్వేద వైద్యులకు ఉచితంగా మొక్కలను అంద చేస్తు...మన ఆరోగ్యం మన పొలంలోనే ఉందని రైతులను చైతన్య పరుస్తున్నాడు.

Read More
Next Story