కొన్ని పుస్తకాలు నన్ను కన్నీటి పర్యంతం చేశాయి...
x

కొన్ని పుస్తకాలు నన్ను కన్నీటి పర్యంతం చేశాయి...

గ్రంధాలు చదివిన సోయితో నేను కవిగా రచయితగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నా నంటున్న జూకంటి జగన్నాథం


-జూకంటి జగన్నాథం

నన్ను నడిపించిన పఠనా స్థలాలు -- సాహిత్య పాఠ్యపుస్తకాలు


ఏటేటా నిర్వహించే హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వాహకులు గత సంవత్సరం 2024 డిసెంబర్ 23 సాయంత్రం నన్ను మీకు నచ్చిన మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం గురించి మాట్లాడమని కోరినారు . అంతేగాక ఈ సందర్భంగా నన్ను కవిగా రచయితగా తీర్చిదిద్దిన జీవన యాత్ర లో సాహిత్య పఠనా స్థలాలను కూడా చెప్పాలని సంకల్పించాను. బాల్య యవ్వనాలలో ఉద్యోగం వచ్చేంతవరకు నా జీవితం నెయ్యి ఒక బుక్కగా పెరుగు మరో బుక్కగా సాగినది కాదు.ఈ విషయం గురించి ఎక్కడ ప్రారంభించాలి ఎలా చెప్పాలి అని అనేక మల్ల గుల్లాలు పడ్డాను. ఆ దిశగా పరి పరి విధాల యోచించి ఒక వ్యాస రూపాన్ని ఇచ్చాను.

దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత ఒక సామాజిక బాధ్యత ఉన్న కవిగా రచయితగా కన్ను తెరిచిన వాడిని నేను.నేను సిరిసిల్ల పౌర గ్రంధాలయం మరియు సినారే అంతేవాసి హనుమాజిపేట నివాసి కనపర్తి సార్ యొక్క ఇంటి గ్రంథాలు మరియు జక్కని వెంకట రాజం సార్ తెప్పించే నెలనెలా వార ప్రత్యేక సంచికలు నా పఠనా స్థలాలు. అంతే కాకుండా మిక్కిలి ప్రభావితం చేసిన నిజాం వెంకటేశం సార్ సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా తెచ్చి ఇచ్చే అప్పటికే పేరు ప్రఖ్యాతి గల కవులు రచయితల పుస్తకాలు ఇలా ఎన్నెన్నో గ్రంధాలు చదివిన సోయితో నేను కవిగా రచయితగా గత ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్నా ఎన్నడూ ఇలాంటి అంశం గురించి మాట్లాడవలసి వస్తుందనుకోలేదు.

నేను సాహిత్య జిజ్ఞాసతో రోజు పొద్దున్న పనికి పోయి వచ్చి సాయంత్రం పుస్తకం తెచ్చుకొని మా మానేరు వాగులో చదివే వాడిని. నాకన్నా ముందు తరాలు విద్యార్థులకు మా ఊరిలో గౌరవనీయులు సన్నిహితులు వైద్య ఉమాశంకర్ వకీల్ గారి బంగ్లా నా పఠనా స్థలాలుగా ఉండేది. నాతోపాటు అనేకమంది విద్యార్థుల యొక్క వారి వారి అభిరుచుల మేరకు వ్యక్తిత్వ వికాసం స్పష్టంగా రూపుదిద్దుకోవడానికి ఆలవాలంగా ఒక విధంగా సరస్వతి నిలయంగా ఎల్లవేళలా బాసించేది. అలాగే బీజ ప్రాయంలో ఉన్న జిజ్ఞాసను ,నన్నూ సాహిత్య కారునిగా తీర్చిదిద్దినది మా తంగళ్ళపల్లి లో విభిన్నంగా విలక్షణంగా ఒక ఈఫిల్ టవర్ గా ఉండే లంకంత ఎత్తైన రెండు అంతస్తుల బంగ్లా అది. వాళ్ల తండ్రి వీరప్ప వకీల్ ఆరోజుల్లో మూడు రెవెన్యూ చట్టాల గ్రంధాలు రచించారు. అయన రాసిన రెవిన్యూ గ్రంథాలు ఆ కాలంలో తయారైన రెవెన్యూ చట్టాలలో జమాబందిగా ప్రక్షిప్తతం చేయబడఢమే కాకుండా అనేక ముఖ్య విషయాలను అట్టి చట్టంలో ప్రముఖంగా పొందుపరిచారు. పిదప కాలంలో వీరప్ప వకీల్ ఎల్లారెడ్డిపేట మక్తా తహసిల్దారుగా పనిచేశారు. ఏకైక కొడుకు ఉమాశంకర్ గారి అమ్మ బుచ్చమ్మను బంగ్లమ్మ అని అందరూ పిలిచేవారు.ఉమాశంకర్ లాయర్ గారి శ్రీమతి భారతమ్మ ఊరందరూ చిన్నమ్మ అని సంభోదించేవారు. ప్రతి సంవత్సరం రాసే మా ఉమాశంకర్ గారి డైరీలు ఆనాటి మా ఊరి సమకాలీన సమాజం యొక్క ఆర్థిక రాజకీయ కుటుంబ సంబంధాలను గురించి నమోదు చేసేవారు. అందుబాటులో ఆ డైరీలు అందుబాటులో ఉంటే వాటిలోని ముఖ్యమైన అధ్యాయాలను ఎంపిక చేసి అచ్చు వేస్తే మిక్కిలి ప్రభావంతంగా ఉంటుంది .వారి కుమారులకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సూచన చేస్తున్నాను.

నాకు నా సాహిత్య జీవితంలో మరిచిపోలేని ఒక మాగేసిన మామిడి పండు లాంటి మధురమైన జ్ఞాపకం యాది. నాతో పాటు ఇంకా వారి మేన బామ్మర్ది హద్దునూరి నాగేంద్రంతో పాటు వారి పిల్లలు వరప్రసాద్ శివప్రసాద్ హరి ప్రసాద్ లకు కూడా ఆ గృహము ఎందరో ఉన్నతిని తీర్చిదిద్దిన కేంద్రం గేహము కూడా . వారి బంగ్లా నాకు ఆశ్రయము కల్పించడమే కాకుండా నా 50 ఏళ్ల కవిత్వ యాత్రలో ప్రధాన పాత్ర పోషించినది. అత్యంత మిక్కిలి భూమిక వహించినది. అప్పట్లో చదివిన.కొన్ని పుస్తకాలు నన్ను కన్నీటి పర్యంతం చేస్తే మరికొన్ని పుస్తకాలు అనేక ప్రశ్నలు నా ముందు నిలిపినాయి.

ఇంకా చెప్పాలంటే నా సాహిత్య మార్గ దర్శనంలో ముఖ్యమైన నిర్దేశకులు జక్కని వేంకటరాజం మరియు నిజాం వెంకటేశం సార్లు అయితే అందరికన్నా మిక్కిలి సాహితీ సోపతి గాడు నలిమెల భాస్కర్ సహచర కవులు మిక్కిలి ఆత్మీయ సహచర సాహితీ మిత్రులు జింబో, పిఎస్ రవీంద్ర, నందిగం కృష్ణారావులను ఇక్కడ ఈ సందర్భంగా తలుచుకోవడం నాకు అత్యంత ఇష్టం .

మా ఊరు తంగళ్ళపల్లి మానేరు ఇవతలి వైపు ఉంటే, అవుతలి ఒడ్డుకు సిరిసిల్ల ఉంటది. మధ్య వాగు మాత్రమే అడ్డంగా ఉన్నది . మానేరు వాగు ఇసుకలో పైసలు ఏరుకోవడం వలన ఇసుక నీరు పోయి వృద్ధాశ్రమం లోని తల్లిలా దిగులుగా కేవలం బొందల గడ్డగా మారింది. ఆ రోజుల్లో అంటే 1970 వ దశకం చివరలో మా ఇంట్లో కరెంటు ఉండేది కాదు. గ్యాస్ నూనె ఎక్కదీపం వెలుతురులో ఒకే
దఫా ఎన్నెన్నో పుస్తకాలు కళ్లలో వత్తులు వేసుకొని చదివాను. మంచి చెడ్డ పుస్తకాలు అనేకం చదివి అందులో నుంచి మంచి సాహిత్య పుస్తకాలను ఎన్నిక చేసుకోవాల్సి వచ్చేది . ఒకానొక సందర్భంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి చెందిన మిత్రుడు చెప్పగా ఆ ఊరికి సైకిల్ మీద పోయి పుస్తకం తెచ్చుకొని అధ్యయనం చేసిన రోజులూ ఉన్నాయి. ఎక్క దీపం పొగ ముక్కులోకి పోయిన నల్లని మసిని తుడుచుకొని ఆబగా చదువుకున్న కాలం అది.

ఇప్పుడు 50 ఏళ్ల వెనక్కి తిరిగి చూసుకుంటే, నా సాహిత్య వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దికోవడానికి చేయూత అందించిన వారిని తలుచుకోవాల్సిందే. అప్పుడు పత్రికలు విజయవాడ నుండి వస్తుండేది. ఆంధ్రప్రభ ఆదివారం సంచికలు మరియు సోమవారం సాహిత్య పేజీలు సిరిసిల్ల పెద్ద మోరి పక్కన ఉండే మోచీ మల్లయ్య డబ్బా చూరుకు నాకోసం చెక్కి ఉంచేవాడు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆదివారం సోమవారం సాహిత్య సంచికలు బ్రదర్స్ టైలర్ నరసయ్య షాప్ లో ఎక్కడో ఒకచోట నాకోసం దాచి పెట్టేవాడు. బస్టాండులో పేపర్లు అమ్మే లక్ష్మీ రాజం వేప చెట్టు కింద డబ్బా దగ్గర కొంచెం కొంచెం చూసి చూడనట్టు చదువుకోనిచ్చేవాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క
పైస కూడా నా జేబులో లేని రోజుల్లో నా సాహిత్య వ్యక్తిత్వ వికాసం దారిలో మైలురాళ్లలాటి సామాన్యులు చాలామంది యాది చేసుకోవలసి ఉంటుంది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత వాళ్ల కాళ్లకు మొక్కుదామంటే వాళ్లలో కొందరు ఇప్పుడు శాశ్వతంగా లేరు . వాళ్ళ జ్ఞాపకాలు తడిగా ప్రతిరోజు ఇప్పటికీ నన్ను పట్టి కుదిపి వేస్తూవుంటున్నాయి.

గురజాడ, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలు చలం రాజేశ్వరి ఓ పువ్వు పూసింది కథలో అనితర సాధ్యమైన విద్యుత్తు కాంతి వాక్యాలు, శ్రీ శ్రీ మహాప్రస్థానం ,గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర రావిశాస్త్రి భూషణం కథలు బుచ్చిబాబు చివరకు మిగిలేది తదితర పస్తకాలు. . రచయిత్రులు పత్రికల్లో సీరియళ్లు రాస్తున్న కాలం . కాళోజి, వరవరరావు, దాశరధి ,సి నారాయణ రెడ్డి, గద్దర్, శివసాగర్ మొదలగువారు కవిత్వంలో వారు పోయిన కొత్త పోకడలు సాహిత్యం లో నెలకొల్పిన తమవైన సొంత మార్గాలు నిర్మించిన విలక్షణమైన పాద ముద్రలు చాలా ఉన్నాయి. గాంధీ జీవిత చరిత్ర నెహ్రు ఇందిరకు రాసిన లేఖలు బుద్ధుడు పూలే అంబేద్కర్ చింతనలు. మొదటి తెలంగాణ సాయుధ వీరులు పుచ్చలపల్లి సుందరయ్య బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణరెడ్డిల జీవిత చరిత్రలు . తరిమెల నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారతదేశం, పౌరాణిక బాగోతాలు హరికథలు పటం కథలు తోలుబొమ్మలాటలు గోత్రాల నరసయ్య మాల్యం ఖాళీ ప్రదేశంలో చుట్టూ రేకుల కంచె వేసి మధ్యలో నాటకాలు ఆడేవారు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కవులు రచయితలు వారి వారి పుస్తకాలు నన్ను నేను సాన పెట్టుకోవడానికి ఎంతో తోడ్పాటును అందించాయి. అత్యంత మిక్కిలి ప్రభావితం చేశాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సామాజిక తాత్విక అధ్యయన గ్రంధాలు మరొక ఎత్తు. మార్క్స్ లెనిన్ ల కమ్యూనిస్టు మేనిఫెస్టో పెట్టుబడిదారీ విధానం అదనపు విలువ కార్మికులు చెమటతో కూడిన శ్రమను యజమానులు లాభనష్టాల తీరుతెన్నులను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చూపిన తీరు నా సాహిత్య ప్రయాణానికి తెలివిడికి చేకూర్పు. నా చీకటి వెలుగుల దారిలో సరికొత్త కాంతులను ప్రసరింప చేశాయి. ఇవీ రేఖామాత్రంగా నా సాహిత్య యాత్రలో అధ్యయనానికి సంబంధించిన విషయాలు.

ఇవి ఇలా ఉండగా తెలిపిన విషయాలు మాత్రమే నన్ను తీర్చిదిద్దాయని అనుకుంటే పొరపాటు అనిపిస్తున్నది వీటికన్నా మిక్కిలి ఇంకా ఇంకా ఏవో ప్రభావితం చేసినయి ఉన్నాయి అనిపిస్తుంది. అనిపించడమే గాక నా గ్రహింపు లోకి వస్తున్నవి. నా చుట్టూ ఉన్న నా స్థలకాలాల సమాజం మనుషులు ఎగుడు దిగుళ్లు ,ఎత్తు పంపులు కన్నీళ్లు కష్టాలు సంతోషాలు దిగులు వలసలు నా సాహిత్య వివేచనకు మిక్కిలి దోహదకారిగా పని చేశాయని ఇప్పుడు అనిపిస్తున్నది . అంతే కాకుండా నా చుట్టూ పక్కల ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలు పోరాటాలు ఆరాటాలు ఆకాంక్షలు లక్ష్యాలు తృణప్రాయంగా ప్రాణాలను ప్రజల కోసం అర్పించే త్యాగాలు నన్ను నా సాహిత్య నిమ్నోన్నతాలలో నిరంతరం నన్ను జాగరూకతతో మెలిగేలా చేశాయి .

తీరా నా ఈ 70వ వయస్సు పడిలో వెనుకకు తిరిగి చూసుకుంటే సమీక్షించుకుంటే పుస్తకాల కన్నా ఎక్కువగా నేను మెచ్చిన నచ్చిన ప్రభావితం చేసిన గ్రంధాల కంటే ఎక్కువగా నిచ్చెన మెట్ల సమాజంలో శ్రమ జీవన సౌందర్యాన్ని నింపుకొన్న తేజవంతమైన మనసులు నన్ను మిక్కిలి అత్యంత ప్రభావితం చేసి నన్ను ఎల్లకాలం సాహిత్య ప్రవాహంగా కొనసాగేలా చేశాయి .నిశ్చయంగా ప్రజలు సమాజమే సాహిత్య పఠనా స్థలాలు పాఠ్యపుస్తకాలే జీవగర్రలు అనిపిస్తున్నది. తోస్తున్నది.


తేది: 20.12.2024, మబ్బుల

జూకంటి జగన్నాథం

సిరిసిల్లా.


Read More
Next Story