
కపిలేశ్వరాలయంలో ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వేడుకలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో ఫిబ్రవరి 15న మహాశివరాత్రి వేడుకలు ఘనంగా. ప్రత్యేక దర్శనాలు, రథోత్సవం, నంది వాహనసేవ ఏర్పాట్లు పూర్తి.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.
ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 16న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన సోమవారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు

