నల్లమలలో మన్ననూర్ జంగిల్ : ప్రకృతి ఒడిలో మరిచిపోలేని అడవి యాత్ర
x
నల్లమల అడవిలో ట్రెక్కింగ్ ( ఫోటోలు : టీజీఎఫ్ డీసీ సౌజన్యంతో)

నల్లమలలో మన్ననూర్ జంగిల్ : ప్రకృతి ఒడిలో మరిచిపోలేని అడవి యాత్ర

పచ్చని అడవులు, జలపాతాలు, పులుల సఫారీ… మన్ననూర్ జంగిల్ రిసార్ట్ ప్రత్యేకత


చుట్టూ కొండలు, గుట్టలు...లోతైన లోయలు...జాలువారుతున్న జలపాతాలు...పచ్చని ఎతైన చెట్లు... చెంగుచెంగున దూకే జింకలు...పులులు, చిరుతల గాండ్రింపులు...ఇదీ నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మన్ననూర్ జంగిల్ రిసార్టు పర్యటనలో కనిపించే ప్రకృతి రమణీయ దృశ్యాలు. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో ఉన్న మన్ననూర్ జంగిల్ రిసార్ట్ పర్యటనలో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మన్ననూర్ జంగిల్ రిసార్ట్ పేరిట డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ అటవీ సందర్శన యాత్రలు నిర్వహిస్తోంది. ఈ అడవి యాత్రలకు ప్రకృతి ప్రేమికులు,పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

తెలంగాణ అటవీ సంపదను కాపాడుతూ అటవీ అందాలను ఆస్వాడించడానికి అటవీశాఖ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. అడవిలో ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ, టైగర్ రిజర్వ్ అనుభవాలను వైల్డ్‌లైఫ్ బయాలజిస్ట్, ఎడ్యుకేషనల్ కమ్ ఎకో టూరిజం ఆఫీసర్ బృందం, గైడ్‌లు పర్యాటకులకు వివరించి చెబుతున్నారు.25 మంది గిరిజనులు గైడ్‌లుగా ట్రెక్కింగ్ ,సఫారీలో పర్యాటకులకు వెన్నంటి నిలుస్తున్నారు.

ఇవీ ఆకర్షణలు

ఫర్హాబాద్ వ్యూ పాయింట్, మల్లెలతీర్థం జలపాతం, అక్కమహాదేవి గుహలు, ప్రతాప్ రుద్ర కోట,ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ సందర్శించదగిన ప్రదేశాలు.మన్ననూర్‌లో పర్యావరణ విద్యా కేంద్రం ప్రకృతి సౌందర్యం, జీవవైవిధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి.

పెరుగుతున్న సందర్శకుల సంఖ్య

నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నమన్ననూర్ జంగిల్ రిసార్ట్ కు సందర్శకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ రిసార్టు సందర్శనను 2018వ సంవత్సరంలో ప్రారంభించారు. నాడు ఎకో టూరిజం పర్యటనకు 27,469 మంది సందర్శకులు వచ్చారు.ఏటేటా పెరుగుతూ 2024-25 సంవత్సరంలో 1,94,067 మంది పర్యాటకులు మన్ననూర్ అడవులను సందర్శించారని అటవీ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు మేనేజరు కె సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

టైగర్ సఫారీ: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో జరిగే అటవీ టైగర్ సఫారీ.చీతల్ జింకలు, అడవి పందులు, నీల్గాయ్, సాంబార్ జింకలు,చిరుతలు, అడవి కుక్కలు (డోల్స్) పులులు నివసిస్తున్నాయి. సందర్శకులకు ఈ అరుదైన వన్యప్రాణులను చూసే అవకాశం లభిస్తుంది.నల్లమల అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో పక్షుల కిలకిలారావాలు, అడవి జీవుల చలనం మధ్య ప్రత్యేకమైన అనుభూతి లభిస్తుంది.మన్ననూర్ జంగిల్ రిసార్ట్‌ లో చెంచు సంప్రదాయ మట్టి గుడిసె, ట్రీ హౌస్, ధ్రువ & సాంబార్ రస్టిక్ మట్టి గృహాలు, ఎరోకాన్ కాటేజీల్లో బస చేయవచ్చని అటవీ శాఖ అధికారి అఖిల్ చెప్పారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ లోని మన్ననూర్ జంగిల్ రిసార్ట్ ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది.ప్రకృతి ఒడిలో అడవి జీవాల మధ్య గడిపే ఈ పర్యటన సందర్శకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తోంది. నల్లమల అటవీ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, పులుల సంరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలను తెలుసుకునే అవకాశం కూడా ఈ యాత్ర కల్పిస్తోంది. అందుకే మన్ననూర్ జంగిల్ రిసార్ట్ ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.
Read More
Next Story