ఏర్లు అడవులు కొండలు అడ్డొచ్చినా ఆగని ములుగు డాక్టర్లు
x
గిరిజనులకు వైద్యం అందించేందుకు పెద్ద వాగు దాటుతున్న వైద్య బృందం

ఏర్లు అడవులు కొండలు అడ్డొచ్చినా ఆగని ములుగు డాక్టర్లు

వర్షాకాలంలో 40 గిరిజన గ్రామాలు,61 గూడేలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.అయినా వాగులు, వంకలు, గుట్టలను దాటి వెళ్లి డాక్టర్లు గిరిజనులకు వైద్యం అందించారు.


ములుగు జిల్లాలోని అటవీ ప్రాంత గిరిజన గ్రామాలు, కొండలు, గుట్టల నడుమ దట్టమైన అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల గూడాల్లో వర్షాకాలం రావడంతో మూడు నెలల పాటు వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అడవులు...వాటి చుట్టూ ప్రవహిస్తున్న వాగులు, కొండలు, గుట్టలపై ఉన్న గిరిజన గూడాల్లో నివాసముంటున్న గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.





- ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్, కన్నాయిగూడెం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల్లోని 101 గిరిజనగ్రామాలకు రాకపోకలు తెగిపోతాయి. కనీసం ఆయా గ్రామాలకు వెళ్లాలంటే పలు వాగులు దాటి కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
- దట్టమైన అటవీప్రాంతం కావడంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తిచెంది పలు సీజనల్ రోగాలు, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో గిరిజనులు ఈ జ్వరాలతో వణుకుతున్నా, వారికి సత్వర వైద్యం సకాలంలో అందడం లేదు. దీంతో తరచూ రోగాలతో గిరిజనులు మరణిస్తూనే ఉన్నారు.మలేరియా జ్వర పీడితులకు సత్వర వైద్యం అందక అది మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. అధికారికంగా నమోదు కాకున్నా మలేరియా మహమ్మారి గిరిజనాన్ని బలిగొంటూనే ఉంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్, కన్నాయిగూడెం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల్లో వాగులు, వంకలు చాలా ఎక్కువ. కొండలు, గుట్టలపై నుంచి వస్తున్న వర్షపునీటితో పాటు అధిక వర్షాలు కురుస్తున్న అటవీ గ్రామాల చుట్టూ వరదనీరు వాగులై పొంగిప్రవహిస్తున్నాయి. ములుగు అటవీ ప్రాంతంలో బొగ్గువాగు, దయ్యాలవాగు, పెచ్ వాగు, గుండ్లవాగు, జంపన్న వాగు, చిన్న వాగు ...ఇలా పలు వాగులు వర్షాకాలం మూడు నెలలపాటు విస్తారంగా వరదనీటి గలగలలతో ప్రవహిస్తున్నాయి.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఆ గిరిజన గూడాలు
అటవీ గ్రామాలు, గిరిజన గూడాల చుట్టూ ఉన్న పలు వాగులు ఈ వర్సాకాలంలో పొంగి ప్రవహిస్తుండటంతో ఏటూరునాగారం మండలం అయిలాపూర్,రాగిబంధం, లింగాపూర్, తాడ్వాయి మండలం పోచాపూర్, బందాల, అల్లిగూడెం, నర్సాపూర్, బొల్లేపల్లి, ములుగు, తాడ్వాయి మండలాల్లోని నీలాలతోగు, దుపట్ల, రోలేబండ, మద్దిమడుగు, బండ్లపహాడ్, మర్రి చింతలపాడు, గోవిందరావుపేట మండలంలోని మామిడితోట, కన్నాయిగూడెం, జారుబండ, మంగపేట మండలం రేగుల గూడెం, కన్నాయిగూడెంలోని 61 గొత్తికోయల గూడాల్లో వందలాది మంది గిరిజనులు నివాసముంటున్నారు. ఈ గిరిజనులకు మూడు నెలల పాటు వర్షాల వల్ల వాగులు పొంగటం వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు.

వాగు దాటి అడవి గుండా నడచి వస్తున్న ములుగు వైద్యుల బృందం

ములుగు జల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య సాహసయాత్ర
ములుగు జిల్లా అటవీ గ్రామాల్లో ఈ ఏడాది 21 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మేల్కొన్న ములుగు జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అల్లెపు అప్పయ్య ప్రాణాలకు తెగించి మూడు పెద్ద వాగులు దాటి 16 కిలోమీటర్ల దూరం నడిచి మూడు గుట్టలు ఎక్కి దిగి... ఆదివాసీ గూడేం అయిన
వాజేడు మండలం పెనుగోలు గిరిజన గ్రామానికి తన వైద్య బృందంతో వెళ్లి జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందించారు. డీఎం అండ్ హెచ్ఓ అప్పయ్య తన బృందంలో వాజేడు వైద్యాధికారి కొమరం మధుకర్. పెనుగోలు హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్, ఆశావర్కర్ లను వెంట తీసుకువెళ్లారు.

గుట్ట మీదుగా వైద్యుల కాలినడక

ఆదివాసీ డాక్టర్ అప్పయ్య ఆదర్శం
ములుగు మండలంలోని మారుమూల అంకన్న గూడెం గ్రామానికి చెందిన డాక్టర్ అల్లెపు అప్పయ్య కష్టపడి ఎంబీబీఎస్ చదివి ప్రభుత్వ వైద్యుడిగా చేరి ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఎదిగారు. తోటి గిరిజనుల కష్టాలు తెలిసిన డాక్టర్ అప్పయ్య మలుగు జిల్లాకే వైద్యాధికారిగా రావడంతో గిరిజనులకు వర్షాకాలంలో సత్వర వైద్యం అందించి వారిని కాపాడుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వైద్య బృందాలను అప్రమత్తం చేసి మారుమూల గిరిజన, కోయ గూడేలకు వైద్యం అందిస్తున్నారు. గిరిజనులకు ఉత్తమ వైద్యం అందిస్తున్న డాక్టర్ అప్పయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వైద్యుడిగా గుర్తించి ఆయనకు తెలంగాణ ఎక్స్ లెన్స్ అవార్డును ప్రదానం చేసింది.

కర్రల సాయంతో వైద్యుల నడక

గిరిజనులకు వైద్యసేవలు
వైద్య బృందం గ్రామం చుట్టూ మూడు వాగులు దట్టమైన అడవిలో ఉన్న పెనుగోలు గ్రామానికి మంగళవారం బయలుదేరి రాత్రి 7 గంటలకు చేరుకొని రాత్రి బస చేసి గిరిజనులకు వైద్య సేవలు అందించింది. గిరిజన గ్రామంలో రోగాలు, దోమల పట్ల అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరిగి రోగుల రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా గ్రామంలో ఇద్దరికి మలేరియా సోకిందని తేలింది. విషపురుగుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తాము గిరిజనులకు సూచించామని డాక్టర్ అల్లెపు అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వైరల్,సీజనల్ వ్యాధులపై అవగాహన జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలని తాము సూచించామన్నారు. గిరిజనులకు మందులు, దోమతెరలు ఇచ్చి బుధవారం తిరిగివచ్చామని డాక్టర్ అప్పయ్య చెప్పారు. ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య బృందాన్ని వైద్యశాఖ ఉన్నతాధికారులు, స్థానిక మంత్రి సీతక్కలు అభినందించారు.

వర్షంలోనూ గొడుగు పట్టుకొని గిరిజనుల ఇంటింటికి తిరుగుతూ వైద్యం అందిస్తున్న డీఎంఅండ్ హెచ్ఓ అప్పయ్య

అటవీ గిరిజన గ్రామాల్లో మందుల నిల్వలు
అటవీ గిరిజన గ్రామాల్లో ఆశావర్కర్ల వద్ద వివిధ రకాల మందుల నిల్వలు ఉంచారు. మూడు నెలలపాటు గిరిజన గ్రామాల్లో ఎలాంటి విషజ్వరాలు ప్రబలినా చర్యలు తీసుకునేదుకు తాము సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు చెప్పారు.వాగుల్లోని నీరు తాగితే రోగాలు వస్తాయని, నీటిని కాచి వడపోసి తాగాలని తాము సూచించామని వాజేడు వైద్యాధికారి డాక్టర్ కొమరం మధుకర్ చెప్పారు.



గర్భవతులను ప్రాథమిక కేంద్రాలకు తరలింపు

మారుమూల వాగులున్న గిరిజన గ్రామాల్లో ప్రస్థుతం 400 మందికి పైగా మహిళలు గర్భవతులని వైద్యాధికారులు గుర్తించారు. రాకపోకలకు రోడ్డు సౌకర్యం లేని 101 గ్రామాలకు చెందిన గర్భవతులను వారి బంధువులున్న గ్రామాలకు వెళ్లాలని వైద్యులు సూచించారు. బంధువులు లేని గర్భవతులను వారిని సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రాలకు ప్రసవానికి ముందుగానే తరలించి వైద్యుల పరిశీలనలో ఉంచామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య చెప్పారు.




గిరిజనగూడేల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను నియమిస్తాం : జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య

వర్షాకాలంలో మూడు నెలల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని గిరిజన గూడేల్లో అక్కడి చదువుకున్న యువతీ,యువకులను కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా నియమించి వారి వద్ద మందుల స్టాకు ఉంచాలని నిర్ణయించినట్లు డాక్టర్ అప్పయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మలేరియా రాకుండా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు వాంతులు, విరోచనాలు, డయేరియా సోకితే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ గ్రామాల్లో మలేరియాను నివారించేందుకు స్ప్రేయింగ్ ఆపరేషన్ చేపట్టామని, త్వరలో గిరిజనులను 34వేల దోమతెరలను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.


Read More
Next Story