
నిజాం సార్ తో నా సాహిత్య ప్రయాణం--13
నా నుంచి నా వరకు :13 (కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు)
అది 1974 సంవత్సరం అనుకుంటాను. దసరా పండుగ రోజు రానే వచ్చింది. దసరా రోజు కాబట్టి ఇంట్లో భక్ష్యాలు తిని సాయంత్రం నాలుగు గంటల వరకు నిజాం సార్ ను కలవాలనే ఆత్రుతతో మానేరు వాగులో పైకి నడిచి మండేపెల్లి బండ్ల బాటలో ముందుకు వెళ్లి జక్కని వెంకట్రాజం సార్ ఇంటికి చేరాను. నేను పోగానే వెంకటేశం ఇప్పుడే తిని వాళ్ళ ఇంటికి పోయిండు .ఇంకా చేరిండో లేదో చూద్దామని సార్ సైకిల్ పైన వేగంగా వెళ్ళాము. అనుకున్నట్టుగానే సారు తొవ్వలో కలిశాడు. అప్పటికే అప్పుడప్పుడు నీ గురించి వెంకట రాజం గతంలో చెప్పేవాడనీ. ఈరోజు నన్ను కలవడానికి రమ్మన్నానని వస్తావని చెప్పిండు అంటూ నిజాం సారు ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు.
అప్పుడు నాకు 19 ఏళ్ల వయసు ఉన్నది. అక్కడే నిలబెట్టి నన్ను ఇప్పటివరకు ఏమేమి చదివావని వివరాలు అడిగాడు. నేను అడిగిన వాటికి టకటకా జవాబులు చెప్పాను. అప్పుడు నువ్వు శ్రీశ్రీ, నారాయణ బాబు, తిలకి ఆరుద్ర రావిశాస్త్రి కథలను న వలను, కవిత్వాన్ని చదివినవా అని అడిగాడు. నేను ముక్తసరిగా లేదని చెప్పాను. అప్పుడు సారు చేతిలో ఉన్న నూతలపాటి గంగాధరం కవిత్వం పుస్తకం "చీకటిలోంచి...' చదువుమని ఇచ్చాడు.
నేను తిరిగి వచ్చినప్పుడు మరిన్ని పుస్తకాలు తీసుకచ్చి ఇస్తానని చెప్పాడు. అప్పుడు నిజాం సార్ పెద్దపెల్లిలో కరెంటు సబ్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తుండేవాడు. మళ్లీ ఒకటో తారీకు వస్తాను. మా ఇంటికి రమ్మని చెప్పాడు. సరి కొత్త వాసన వేస్తున్న పుస్తకాన్ని వాగులో కూర్చొని చదివాను. డాల్టన్ ప్రెస్ మద్రాస్ వారు ప్రింట్ చేయగా అందమైన బాపు బొమ్మలతో ముందు ఎప్పుడూ చూడని నూతన కవిత్వం పుస్తకాన్ని అపురూపంగా 21దినం దాటని చిన్నపిల్లను సంకలో ఎత్తుకున్నంత సంతోషం కలిగింది.
వెంకటేశం సార్ చెప్పిన శ్రీ శ్రీ సాహిత్య సంపుటాలు లైబ్రరీలో చూశాను. వాటిని ఒక్కొక్కటిగా తెచ్చుకొని చదువుకున్నాను. నేనెప్పుడూ చూడని ఒక కొత్త కవిత్వ లోకం కళ్ళ ముందు కదలాడింది. ఆరుద్ర సినీవాలీ, సమగ్ర ఆంధ్ర సంపుటాలు మరియు దిగంబర కవుల కవిత్వం తీరని దాహంతో శ్రద్ధతో చదువుకున్నాను.వెంకటేశం సార్ తిరిగి సిరిసిల్లకు వచ్చేసరికి కొత్త ఉత్సాహంతో ఏవేవో చెప్పాలని కుతూహలంతో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశాను.
తర్వాత నెల మొదటి ఆదివారం వెంకటేశం సార్ ఉద్యోగం చేస్తున్న పెద్దపల్లి నుంచి సిరిసిల్లలో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వెంకటేశం సారు గతంలో ఇచ్చిన చీకటిలోంచి... నూతలపాటి గంగాధరం కవిత్వం పుస్తకాన్ని పదిలంగా అప్ప చెప్పాను. దానిలోని కవిత్వం గురించి సారు ఏవేవో అడిగాడు నాకు తెలిసిన తోచిన నాకు అందిన విషయాలు చెప్పాను. సారు తిరిగి నూతలపాటి గంగాధరం మరో పుస్తకం వెలుతురులోకి... ఇచ్చాడు. ఈసారి వచ్చేటప్పుడు జగన్నాథం నేను మరికొన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు. అమ్మ చాయ్ పోస్తే తాగి ఇంటికి వచ్చాను.
అదే సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో వెంకటేశం సార్ శ్రీ శ్రీ మహాప్రస్థానం, మరో ప్రస్థానం, చారిత్రక భౌతిక వాదం, రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాదం చేసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చాడు. తెల్లారి మార్కెట్లో ఎండాకాలం సెలవులలో ఖాళీగా ఉన్న ఉమా శంకర్ వకీల్ ఇంట్లో మహాప్రస్థానంలోని కొన్ని కవితలు చదివి వినిపించి, సోదాహరణంగా వివరించాడు .
వరుసగా వారం రోజులలో నేను కొత్త ఉత్సాహంతో చదివాను. అప్పటికి నాకున్న పరిమితమైన జ్ఞానంతో అర్థం ముఖ్యంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివిన పిదప ముందు ఎప్పుడూ చూడని కొత్త వెలుగు దారి తెలుచుకున్నట్టు అయ్యింది. నిజాం సారు మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా తెచ్చి ఇచ్చేవాడు. వీలు కాకుంటే పంపించేవాడు. ఆ రోజుల్లో వచ్చే క్రాంతి విమోచన పక్ష పత్రికతో పాటు అరుణతార, ప్రజాసాహితీ సృజన తదితర మాసపత్రికలను వెంకటేశం సార్ నాకు పరిచయం చేశాడు.
అదే కాలంలో సిరిసిల్ల నిమ్మపల్లి ప్రాంతాలలో బీజప్రాయంగా పోరాటాలు ప్రారంభమయ్యాయి. చుట్టూ గ్రామాలలో భూస్వాములు చేసే అన్యాయాలకు అణచివేతలకు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా గ్రామాలలోని సామాన్య ప్రజలు నిలదీయడం మొదలు పెట్టారు. కొత్త పోరాటాలోంచి కొత్తగా నాయకులు ఎదిగి వీరికి వెన్నుదన్నుగా నిలిచారు.
అంతకుముందే చెప్పిన విధంగా మా అమ్మమ్మ ఊరిలో గడిపిన బాల్య ప్రాయంలో సాంస్కృతిక విత్తనాలు నాలో నాటబడ్డాయి . మా ఊరికి వచ్చిన తరువాత పువ్వుకు తావి అద్దినట్టు సిరిసిల్ల యువ సాహితీ సమితి కవుల పరిచయం కలిగింది. ఆ సంస్థ నిర్వహించే సాహిత్య కార్యక్రమాల ద్వారా ఒక బలమైన సాహిత్య అభిలాష నాలో సాహిత్య బీజాలు భూమిని చీల్చుకొని మొక్కలా మొలిచింది . నిజాం వెంకటేశం సార్ పరిచయంతో ఆయన ఇచ్చే పుస్తకాలు, ఆయన చెప్పే మాటలు నన్ను మిక్కిలి ప్రభావితం చేసింది.
మొత్తానికి మొత్తంగా ఇవన్నీ కలిసి నన్ను కవిగా రూపుదిద్దుకోవడానికి వాతావరణం అనుకూలించినది . ఆ రోజుల్లో వచ్చే అరుణతార ప్రజాసాహితీ పత్రికలలో కవిత్వం రాశాను. సృజనలో అప్పుడప్పుడు నా కవిత్వం ప్రచురించబడేది.ఇలా నాకు కొత్త కొత్త పుస్తకాలు నిజాం సార్ అందించడం నేను చదవడం కలిసినప్పుడు వాటి గురించి చర్చించుకోవడం ద్వారా నా సాహిత్య ప్రపంచం మరింత విశాలమైపోయింది .
ఈ మద్య కాలంలో 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. పత్రికలలో ప్రచురించే వార్తల పైన సెన్సార్ షిప్ విధించి అమలు చేయడం జరిగింది . అనేక మంది మేధావులను ప్రభుత్వ విధానాలపైన వేలెత్తి చూపిన వారిని ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో బంధించారు. 1977 వరకు అంత దాదాపు 21 నెలలు అత్యవసర పరిస్థితి చీకట్లో దేశం మగ్గిపోయినది.
ఉత్తర భారతదేశంలో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అత్యవసర పరిస్థితి తర్వాత ఆ చీకటి కాలంలో జరిగిన అక్రమాల పైన విరివిగా వార్తలు వ్యాసాలు దినపత్రికల్లో వస్తుంఢేవి. నాలాటి వాళ్ళము చదివి కలిసి చర్చించుకునే వాళ్ళం. ఆలోచించుకునే వాళ్ళం. ఆ అణిచివేత నేరుగా నా ఎరుకలోకి రాలేదు కానీ చాలామంది అరెస్టు చేయబడి జైల్లో శిక్ష అనుభవించారు. దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో ఈ అణచివేత ఎక్కువగా జరిగింది. అనంతరం జరిగిన లోకసభ ఎన్నికలలో దీని ప్రభావం వలన ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది. జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.
ఇదే కాలంలో ఒకవైపు నక్సలైట్ల ఉద్యమం గ్రామాలలో యువకుల ద్వారా చాప కింది నీరులా ప్రవేశించింది. ఈ ఉద్యమం వలన గడ్డి పరకల్లాటి బక్కపలుచని మనుషులకు కూడా నోరు వచ్చింది . అక్కడక్కడ అన్యాయం చేసిన భూస్వాములను ప్రశ్నించడం, ఎదిరించడం ప్రారంభమైనది.
మరోవైపు వెంకటేశం సారు తీసుకొచ్చి ఇచ్చే పుస్తకాల వలన సరికొత్త తెలివిడి జ్ఞానం కలిగింది. నా చుట్టూ జరుగుతున్న సామాజిక పోరాటాల వలన నాలో నాకు అంతర్గతంగా అనేక సంఘర్షణలు జరిగేవి. ఏ విషయంపైన రాయాలి. దేన్ని పట్టించుకోవాలి. దేనిని ప్రశ్నించాలి. దేని గురించిన కవిత్వం రాయాలి అనే వాటిపైన అప్పుడప్పుడే నాలో స్పష్టాస్పష్టంగా కలుగుతున్న వాతావరణం ఏర్పడుతున్నది.