సిరినోములో ఎడారి గురించి గోదాదేవి ఏం చెప్పారు?
x
తిరుప్పావై, పాశురం 4, ( Harini, Warli Trabal Art, Facebook)

సిరినోములో ఎడారి గురించి గోదాదేవి ఏం చెప్పారు?

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ చెబుతున్న తిరుప్పావై విశేషాలు. పాశురం : 4



ఎడారిని ఎవరు సస్యశ్యామం చేసేదెవరు? పంటపొలమనే పక్షపాతం లేకుండా అంతటా సమంగా వర్షాన్ని ఇచ్చిన వాడు మేఘుడు అంటే మేఘం కురిపించేవాడు. ఇంతకు ముందు రైతు గురించి విక్రముడు అని చెప్పిన తిరుప్పావై లో గోదాదేవి వర్షం గురించి పద్యం రచించారు. అక్కడ ఆళి మళైకణ్ణా అన్న పద్య పాదంలో వర్షం వివరించారు. వర్ష నిర్వాహకుడా అంటే వర్షం కురిపించే మేఘుడు అంటారు. అది పాపాత్ములుండే చోటని తక్కువ పుణ్యాత్ములున్నారని ఎక్కువ అని కాకుండా అంతటా సమానంగా కురుస్తూనే ఉంటాడు. మరో తమిళ పదం ‘‘ఒన్ఱునీకైకరవేల్’’ అంటే నీకై ఏమీ దాచుకోకుండా, పుణ్యుల చోటు, పాపులున్నచోటని, ఎడారి అనీ పంటపొలమనే పక్షపాతం లేకుండా అంతటా సమంగా వర్షాన్ని కురిపించు. గర్జించు. నీ గర్జనలు విని లోకం సంతోషించాలి అంటున్నాడు. ఆర్ తు ఏఱి.. గర్జించి మిన్నంది..ఆకాశమంతా వ్యాపించు. వూళి ముదల్వనుర్వంబోల్ =చేతనాచేతన పదార్థములకు కారణభూతుడైన సర్వేశ్వరుడి మేని వలెనే, మేయ్ కరత్తు = మేఘమువంటి మేనిఛాయగల తమ నాయకుని వలె మేఘము అని పోల్చుతున్నారు.

క్షార జలధి నావరించి అలల జలము పీల్చి గగనమెక్కి

జగత్కారకుడు, కాల స్వరూపుడు నల్లనయ్య రంగురాసి

గంభీర జలదము, మహనీయ సుందర బాహుదండుడైన

పద్మనాభు కుడిచేతి సుదర్శన చక్రంపు మెరుపు మెరిసి

స్థిరమైఎడమ దక్షిణావర్త పాంచజన్యంపు పిడుగులుమిసి,

ఆలసించక విష్ణు శార్ఞమ్మువిడిచిన శరపరంపరల విసిరి

పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు పర్జన్యదేవుమ్రొక్కి

మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు లేమలార.

తాగే నీళ్లు ఇచ్చేది సముద్రమే

గంభీరమైన సముద్రంలో మధ్యకు వెళ్లి, ఆ సముద్ర జలాన్ని త్రాగి, గర్జించి, ఆకాశమంతటా వ్యాపించి, సర్వజగత్కారణ భూతుడైన శ్రీమన్నారాయణుని నీల మేఘ విగ్రహమువలె శ్యామల మూర్తియై, ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరసి, ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి, శార్జ్గ్ మనే ధనుస్సు విడిచే బాణముల ములుకుల వర్షం వలె వర్షించు. లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మేమంతా సంతోషంతో మార్గశీర్ష స్నానము చేసేట్టు గా వర్షాన్ని కురిపించు.

మేఘమే ఆచార్యుడు

మేఘమును ఆచార్యుడితో పోలుస్తున్నారు. భగవంతుడికన్న ఆచార్యుడికే ఎక్కువదయ. మేఘం సముద్రంలోని ఉప్పునీటిని త్రాగి, తీయని జలాన్ని కురిపిస్తుంది. కఠినమైన శృతి సాగర జలాలను ద్రావి, వాటిని సులభంగా అర్థమయ్యే రీతిలో మార్చి బోధించే ఆచార్యుడూ అంతే. భగవద్గుణాలను సుబోధకంగా బోధించే వాడే అసలైన ఆచార్యుడు. ఆయన రెండు గుణాలు బోధించాలట. ఒకటి: భగవంతుడు మనచే ఆశ్రయించుటకు అందుబాటులో నుండువాడే అని మనకు తోచి ఆశ్రయించడానికి వీలుకల్పించే గుణములు. రెండు: ఆశ్రయించిన వారి కార్యములను చేయగలవాడు భగవంతుడు అనేట్లు స్ఫురింప చేసే గుణములు.

ఆచార్యుడిచ్చేది జ్ఞానమే. అదనంగా తెలిసింది ఆచరించడం అంటే మెరుపు. శంఖమువంటి ధ్వని అంటే ఆచార్యుని వేదఘోష. ఆజిమజక్కణ్ణా = భగవద్గుణానుభవాన్ని వర్షించే ఆచార్యుడా. ఒన్ఱునీకైకరవేల్ = భగవంతుని ఆశ్రయింపజేయునట్టి ఆచార్యసార్వభౌమా. ఆజ్ యుళ్ పుక్కుముగున్దుకొడు =ఉభయ వేదాంత సాగరముల అట్టడుగుదాకా మునిగి వాని అర్థవిశేషములను గ్రహించి, అర్తు =గర్జించి, తిరుగోష్టియూర్ గోపుమెక్కి రామానుజుడు గర్జించినట్టు, పాజ్ యన్తోళుళై పఱ్పనాభన్ కైల్= పద్మనాభుని చేతిచక్రమై భగవత్ విరోధులను త్రుంచి వేసేది, రామానుజుడు కుదృష్టి మతములను అణగద్రొక్కినట్టు. వలంబురిపోల్ = పాంచజన్యమువలె జ్ఞానబోధ ద్వారా వైష్ణవ మతవ్యాప్తిచేస్తాడు. తాజాదే శార్ ఙ్గమ్ ఉదైత్త =శ్రీరాముని బాణముల వర్షముచేత శిష్టరక్షణ జరిగినట్టు ఆచార్యుని కారుణ్యవర్షముచేత చేతనులు స్వరూప జ్ఞానము సాధించి ఉజ్జీవింతురు. నాఙ్గలుమ్ మార్గళినీరాడ = ఆచార్యాభిమానమునందే నీరాడుట. పర్జన్యదేవుని అడగగానే భగవద్భక్తులకు సాయం చేసే సదవకాశం లభించినందుకు సంతోషించి వెంటనే మన్నించాడట. ఆచార్యుడు కూడా అడిగిన వెంటనే జ్ఞాన వర్షం కురిపిస్తాడు.

మార్గశీర్ష స్నానము

చక్రమువలె మెరసి, శంఖమువలె ఉరిమి, శార్జ్గ్ మనే విడిచే బాణముల వర్షం లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మార్గశీర్ష స్నానము చేసేట్టు గా వర్షాన్ని కురిపించు.

దీన్ని స్నాన వ్రతం అనీ అంటారు. వారి స్నానానికి జలం సమృద్ధిగా ఉండాలి. గోపికలు కృష్ణభగవానుడే 'ఉపాయము, ఆయనే ఫలము' అని నిశ్చయించుకొన్నారు. ఇతరములయిన ఏ ఫలితాలను వారు ఆశ్రయింపరు, వారిది అనన్య భక్తి.

భగవంతుడు సర్వేశ్వరుడు. ఆయనే అందరినీ వివిధ అధికారాలలో నియమించారు. బ్రహ్మను సృష్టికార్యానికి, శివుడిని లయకార్యానికి, అష్టదిక్పాలకులను తదితర కార్యాలకు నియుక్తులను చేశారు. సర్వేశ్వరుని ఆశ్రయిస్తే ఆ భగవానుడు నియమింన దేవతలందరూ భక్తులను అనుసరిస్తారు.

ఒకసారి కూరత్తాళ్వార్ ను ‘అన్యదేవతలను చూసినపుడు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు?’ అని అడిగితే ‘మీరు శాస్త్ర విరుద్ధంగా అడుగుతున్నారు. మిమ్మల్ని చూసి అన్యదేవతలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని అడగాలి’ అని సమాధానం చెప్పారట.

పరమాత్మనాశ్రయించిన వారివద్ద, భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ కూడా వారికి ఆజ్ఞావశవర్తులై ఉంటారట.

మరి కొన్ని పదాలు, గోదాదేవి ఈ వివరాలు ఇచ్చారు. పాళి యందోళుడై = విశాలమైన బాహువులకలవాడు. రాముని బాహుబలంతో లోకమంతా సురక్షితమైంది. నాభియందున్న బ్రహ్మను తొట్టెలోయుంచి నారాయణుడు భుజాలతోకాపాడినాడట. పఱ్పనాభన్ కైయిల్ ఆజ్ పోల్ మిన్ని = పద్మనాభుని చేతిలో చక్రంవలె మెరిసి, మేఘం కురియాలనికోరుతున్నారు. వలమ్బురిపోల్ శ్రీ కృష్ణుని పాంచజన్యం కురుక్షేత్రంలో పాండవపక్షంలో హర్షం కురిపించినట్టు, నిన్దురిన్దు= నిలిచి గర్జించాలట. తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్ ఙ్గముదైత్త శరమళైపోల్ వింటినుండి చిమ్మిన శరముల వలె రామబాణ వర్షము కురిపించాలి. నాఙ్గళుమ్ మగిళిన్దు మార్గళ నీరాడ =మేం సంతోషించి మార్గళి స్నానంచేసేట్టు అంటున్నారు.


Read More
Next Story