ఒక ఉపాధ్యాయుని జీవిత ప్రయాణం
x

ఒక ఉపాధ్యాయుని జీవిత ప్రయాణం

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తీవ్ర మార్పులు ఉపాధ్యాయులతోనే జరిగాయి

కేవలం ఉపాధ్యాయ వృత్తి గురించి మాత్రమే రాస్తే పాక్షికమవుతుంది. వృత్తి చేపట్టడానికి ముందు వెన్నుదన్నుగా నిలిచిన జీవితాన్ని తడిమితేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన జీవితాన్ని కొండ అద్దం అద్దమందు కొంచమైన చూపరాదా అన్నట్టు ఇక్కడ రేఖామాత్రంగా ఉల్లేఖిస్తాను.

సాహిత్య మిత్రుడు ఉపాధ్యాయుడు గత మే నెల చివరలో మా ఇంటికి వచ్చి ఈ జూన్ నెల 30న పదవి విరమణ చేస్తున్నానని చెప్పాడు.

అతని శ్రమ పట్టుదల మాత్రమే కాకుండా డ్రాప్ అవుట్ అయిన విద్యార్థిగా చాలా సంవత్సరాల తర్వాత తిరిగి తన చదువును కొనసాగించిన తీరు, ఉద్యోగ సాధన, ఉద్యోగ నియామకం మరియు రిటైర్మెంట్ నా కళ్ళ ముందు ఒకసారి గిర్రున తిరిగసాగాయి. అతను అంచలంచెలుగా ఎదిగి వచ్చిన బతుకు చిత్రం విభిన్నంగా విలక్షణంగా ఉండడం వలన , తర్వాతి తరం యువకులకు అతని జీవిత వికాసం ఒక కరదీపికగా ఉపయోగపడుతుందనే యోచనతో ఆయన గురించి రాయడానికి పూనుకున్నాను .

1960వ దశకం చివరలో అన్ని కులవృత్తులు జీర్ణ దశకు చేరుకుంటున్నన దశలో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించిన వాడే మద్దికుంట లక్ష్మణ్. కుల వృత్తులు వెంటిలేటర్ మీదికి చేరిన వాతావరణంలో అన్ని కుటుంబాలు లాగే లక్ష్మణ్ వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ బతకలేక మహారాష్ట్ర లోని పర్బని జిల్లాకు పలస పోయాడు. ఐదవ తరగతి మధ్యలో ఆపివేసిన పిల్లవాడు తన తండ్రీతల్లి వెంట నడిచాడు. సరిగ్గా భాష తెలియని ప్రజలతో తెలియని ఊరిలో మొరగని కుక్కలా చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ అరుస్తూ గ్లాసు కల్లును 10 పైసలకు అమ్మేవాడు. అక్కడ కూడా కల్లు (మామ్ల) కాంట్రాక్టులో సరిగ్గా నడవక నష్టం రావడం వలన తిరిగి గొల్లపెల్లికి కుటుంబం చేరింది. అనంతరం స్కూల్లో చేరిన లక్ష్మణ్ చదువు ఏడో తరగతి పూర్తి కావడంతోనే అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఆయన నాన్న హఠాత్తుగా చనిపోవడం వలన సమీపంలో ఉన్న బండ లింగంపల్లి గ్రామంలో సారా దుకాణంలో 70 రూపాయలకు జీతం ఉన్నాడు. అది కూడా సరిగ్గా కుదరక పోవడంతో, మిత్రుల సహాయంతో గొల్లపల్లి బస్టాండ్ వద్ద ఒక పాన్ షాప్ డబ్బా పెట్టాడు. మిత్రులు ఉద్దెర పెట్టడం వల్ల పాన్ షాప్ దివాలా తీసి మూతపడింది. చివరకు సత్యనారాయణ స్వామి ఎంబిబిఎస్ డాక్టర్ వాళ్ళ ఊర్లో ప్రైవేటు ఆసుపత్రి పెట్టడం వలన ఆయన వద్ద వైద్యం నేర్చుకోవడానికి కాంపౌండర్ గా చేరాడు. తర్వాత అలా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ గా గొల్లపల్లి బొప్పాపూర్ జంట గ్రామాలలో ప్రాక్టీస్ చేశాడు.

లక్ష్మణ్ అప్పటికే అంతో ఇంతో సాహిత్య వాసన కలిగి ఉండడం వలన పత్రికలలో వచ్చిన వ్యాసాలను, పుస్తకాలను చదివేవాడు. మా నలిమెల భాస్కర్ ఎండాకాలం సెలవుల్లో వాళ్ళ ఊరు నారాయణపూర్ కు వచ్చాడు. సావిత్రి కి కాల్షియం ఇంజక్షన్ ఈయడానికి అక్కడ ఎవరూ సాహసించకపోవడంతో , లక్ష్మణ్ దగ్గరికి ఇంజక్షన్ ఇవ్వమని పోయాడు. అలా అలా రాకపోకల ఆ పరిచయం భాస్కర్ కు లక్ష్మణ్ మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరిచింది.

మధ్యలో వదిలేసిన చదువును తిరిగి ప్రైవేటుగా పదవ తరగతి పరీక్ష రాయడానికి ఉపయోగపడింది. ఆ క్రమంలోనే 1985 ప్రాంతంలో లక్ష్మణ్ తో నా ఆత్మీయ మిత్రుడు నలిమెల భాస్కర్ ద్వారా పరిచయం ఏర్పడింది . మా భాస్కర్ కవి స్వతహాగా టీచర్ కావడం వలన ఆయన మార్గదర్శకత్వంలో ప్రేరణతో లక్ష్మణ్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైపోవడమే కాకుండా హనుమకొండ ప్రభుత్వ కళాశాలలో బిఎడ్ చదువు పూర్తి చేశాడు. అప్పటికే లక్ష్మణ్ కు లక్ష్మీతో పెళ్లి అయి,ఇద్దరు పిల్లలు కలిగి వున్నాడు. అప్పుడు సిరిసిల్లలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్న భాస్కర్ ఇంట్లో ఉండి పట్టుదలతో దీక్షతో చదివి 1995 జూన్ 16న డీఎస్సీ రాసి సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ గా నియామకం పొంది సిరిసిల్ల పక్కన తాడూరు గ్రామం హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు.

జీవితంలోని అనేక ఎత్తుపల్లాలను, కష్టసుఖాలను, చూసిన లక్ష్మణ్ పట్టుదలతో శ్రమించి ఉపాధ్యాయుడుగా నియామకం పొందాడు.. ఉపాధ్యాయునిగా మొదటి వేతనం ఏక మొత్తం 1500 రూపాయలు మాత్రమే ఉండేది. సిరిసిల్లలో నేను లక్ష్మణ్ కిరాయి ఇళ్లలో పక్క పక్కన ఉండేవాళ్ళం. మాకు 10 ఇండ్ల అవతల నలిమెల భాస్కర్ నివాసం ఉండేవాడు. మేము ముగ్గురం సాయంత్రం కలిసి అనేక సాహిత్య అంశాలతో పాటు, చదివిన పుస్తకాల పైన సమాజం స్థితిగతుల పైన వాటి ప్రభావాలపైన వ్యక్తుల ప్రలోభాలపైన స్వార్థాల పైన చర్చించుకునే వాళ్ళం.

మనుషులను కలవడం ముఖ్యం బావాలు కలగబోసుకోవడం అంతకంటే ముఖ్యం . అది ఎంతవరకు వచ్చింది అంటే ప్రతి దినం సాయంత్రం గాంధీ చౌక్ లోని లక్ష్మీ విలాస్ లోని స్తంభం వెనుక ఓ మూలకు ఒక టేబుల్ నాలుగు కుర్చీలు మా కోసం యజమాని ఖాళీగా పెట్టేవాళ్ళు. మేము కలివిడిగా మాట్లాడుకునే వాళ్ళం. సమయం తెలిసేది కాదు. ఈ మధ్యకాలంలో రెండు మూడు ఛాయ్ లు మాకు తెలియకుండానే తాగేవాళ్ళం.

లక్ష్మణ్ జీతం కుటుంబ రోజువారీ ఖర్చులకు సరిపోవడం లేదని , తాను పనిచేస్తున్న పాఠశాల ఉన్న తాడూరు గ్రామంలోనే నివాసమేర్పరుచుకున్నాడు. అనంతరం వేతనం స్కేలు వచ్చింది.

ఈమధ్య కాలంలో భాస్కర్ కరీంనగర్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నేను స్థానిక సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్లలో పని చేయడం వలన ఎలాంటి బదిలీలు లేకపోవడం వలన ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. ఈ మధ్య లక్ష్మణ్ ధర్మారం నుంచి రాజన్నపేట ఉన్నత పాఠశాలకు చివరి కి ఆవునూరు గ్రామం లో హైస్కూల్ లో పదవీ విరమణ వరకు పి.జి. హెచ్. ఎం.గా పనిచేశాడు.

ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగం చేయడం కన్నా ఎక్కువగా అధికారులకు నుంచి వచ్చే మెసేజ్లకు నివేదికలు పంపడానికి సరిపోతుంది. ఉపాధ్యాయ మిత్రులు బాధపడుతుంటారు. పోనీ ఇంత చేసి పంపిస్తే విద్యా రంగంలో వాటి ప్రయోజనం ఏమైనా జరుగుతుందంటే ఏమి లేకపోవడం విచారకరం .

గత చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తీవ్ర మార్పులు ఉపాధ్యాయులతోనే జరిగాయి. అత్యాధునిక సాంకేతికత విప్లవం వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలలో ఫాసిజం మరొకసారి ఆవరిస్తున్న పోకడల ప్రమాదాలు రోజుకింత పెచ్చరిల్లిపోతున్నాయి.

ఇటువంటి అప్పుడు ఏ మార్పు అయినా ఉపాధ్యాయుల ద్వారానే జరుగుతుందనే నమ్మకం విశ్వాసం ఇంకా సడలిపోకుండా దృఢంగా ఈ సమాజానికి ఉన్నది. ఆ మార్పు ఏ విధంగా ఎలా జరుగుతుందో అనే ఆశతో నాతోపాటు ఆలోచన పరులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు.

(ఈనెల 30న ఉపాధ్యాయుడిగా రిటైర్ కాబోతున్న మద్దికుంట లక్ష్మణ్ కు ...)

Read More
Next Story