
ఈ ఏడాది మామిడి సీజన్: ధర ఎక్కువ తీపి తక్కువ
అకాల వర్షాలు తెగుళ్ల బారిన పడి నిండా మునిగిన మామిడి రైతులు
పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది. అందుకే దీనిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. మన భారతదేశంలో చాలా రకాల మామిడి వంగడాలు / రకాలు వివిధ ప్రాంతాలలో సాగవుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ పంటను సాగు చేస్తున్నారు. ప్రపంచంలోనే మామిడిని పండించడంలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతుంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. మామిడి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో సాగు చేస్తున్నారు. మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి.
కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాపించి, చెట్టు అభివృద్ధి చెంది చాలా కాలం ఫలాన్నిస్తాయి. సంవత్సరంలో ఒకసారి వచ్చే మధురమైన పంట మామిడి పంట. వేసవిలో మామిడి పచ్చడి, ఊరగాయలు, మాగాయ, మామిడి పులిహోర మామిడి పండ్లు పండ్ల రసాలు తినడానికి ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సంవత్సరం కాపు సంతృప్తికరంగా లేదు, జనవరి ఫిబ్రవరి నెలల నుండి విపరీతమైన ఎండలు ఉండడంతో పూత నిలవలేదు. కాపు పూర్తిగా పలుచగా ఉంది. మామిడి చెట్టు శిలీంధ్రాలు, బాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ తో సహా అనేక వ్యాధుల బారిన పడ్డాయి . ఆంత్రాక్నోస్, బూజు తెగులు, డైబ్యాక్ మామిడి పంటలు దెబ్బతీసింది. ఈ వ్యాధులు ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం వేర్లు వంటి చెట్టు వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి.
కొన్ని చోట్ల కాపు లేదు. గత నెల రోజులుగా హోల్ సేల్ మార్కెట్ ధర 900 నుండి 1800 వరకు బాక్స్ కు ఉండటంతో సామాన్యుడికి అందుబాటులో లేని ధర. దళారీలు నెల కిందట తక్కువ ధరకు చెట్లు కొని ఎక్కువ ధరకు మార్కెటు కు తరలిస్తున్నారు. అకాల వర్షాలతో ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో మామిడి పండ్లు నేలమట్టమయ్యాయి. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో మామిడి పండు రుచి ఉండటం లేదు. మార్కెట్ కు వచ్చిన మామిడి కుత్రిమ పద్ధతిలో మాగ పెడుతున్నారు. కార్బైడ్, స్ప్రే చేయడం, అసిటిలిన్ ద్రావణంలో అద్దడంతో పండు మాధుర్యం కోల్పోయింది. కొన్ని చోట్ల పంట దెబ్బతీసింది, కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలు ఏడు వందల నుంచి వెయ్యి వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడు వందల చెట్లకు రెండు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది.
రైతులకు పెట్టుబడి లేక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది. గత దశాబ్ద కాలంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్ హౌస్ లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు కానీ ఎక్కడా మార్కెట్ సౌకర్యం, సరకు నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర, రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. వేరుశెనగ వేసుకుంటే గిట్టుబాటు లేదని పత్తికి మారి, పత్తికి గిట్టుబాటు లేదని, టమోటా, టమోటా నుండి మిర్చీ మిర్చీ నుండి ఫల సంప్రదాయం కి మారినా నష్టాలు మిన్నంటుతున్నాయి. దేనికి మారిన అదృష్టం మారక అప్పుల ఊబిలో కొట్టుకు పోతున్నారు.
అది తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా రైతు గోస ఒక్కటే. అకాల వర్షాలకు పిందెలు, కాయలు రాలిపోయి చాలా చోట్ల ఇరవై కిలోల బాక్స్ మార్కెట్ ధర రెండు వేలు మార్కెట్ ధర. సహజంగా ఇంట్లో పండడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే ఎక్కువ కాయలు కుళ్లిపోతున్నాయి సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పళ్ళను పూర్తిగా పండకుండానే చెట్టు నుంచి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు . సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా పళ్ళను మగ్గ పెట్టడానికి ఎథ్రెల్ స్ప్రే చేయడం గానీ, వాటిని ఎథ్రెల్ ద్రవంలో ముంచడం గానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్ లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలు వస్తాయి.
దీనికి ప్రత్యామ్నాయంగా, పళ్ళను మగ్గబెట్టి గోదాములలో ఇథిలీన్ గ్యాస్ ఉపయోగిస్తారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పళ్ళను మగ్గించడానికి ప్లాస్టిక్ టెంట్లలో ఇథలీన్ గ్యాస్ ను వదిలి పళ్ళను పండబెట్టడం రూపోందించారు. ఇతర ఉద్యాన పంటలలో లాగానే, మామిడిని కూడా చాలా రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ప్రధానమైనవి తేనెమంచు పురుగు, టెంక పురుగులు, వండు ఈగ, పిండిపురుగులు. ఈ ప్రధాన పురుగుల వలన కలిగే నష్టం అపారం. ఎన్ని ఎత్తులు వేసి మార్కెట్టుకు కాయలు తరలించినా ఆరుగాలం శ్రమించిన రైతుకు దక్కేది శూన్యం, దళారులకు భోజ్యం. తక్షణం రైతులను ఆదుకొని రెండు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు నిర్దిష్ట ప్రణాళికతో సత్వరమే మార్కెటు, నిల్వ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి ఫలాన్ని ఇచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు.