గిగ్ వర్కర్స్ కు ఒక శుభవార్త...
x

గిగ్ వర్కర్స్ కు ఒక శుభవార్త...

ప్రభుత్వంలో ఉద్యోగాలు తగ్గిపోయి, వ్యవసాయంలో సంక్షోభం ఏర్పడి, పారిశ్రామిక రంగం కుదేలైన దశలో రాష్ట్ర యువతకు గిగ్ వర్క్ ఉపాధి అయిపోయింది...


Click the Play button to hear this message in audio format

నగరాలలో ఇప్పుడు కొందరికి ఆకలేస్తే అన్నం కోసం అమ్మను నోరు తెరిచి అడగడం లేదు. వంటింట్లోకీ వెళ్ళడం లేదు. డ్రాయింగ్ రూమ్ లోనో, హాల్ లోనో కూర్చుని మొబైల్ చేతి‌లోకి తీసుకుని ఏదో ఒక App ఓపెన్ చేసి భోజనం ఆర్డర్ చేసేస్తున్నారు. 20 నిమిషాలలో వేడి వేడి భోజనం రెడీ. నిత్యావసర సరుకులైనా, మందులైనా, కట్టుకునే బట్టలైనా, వాడుకునే ఇతర ఏ వినియోగ వస్తువైనా కాలు బయటకు పెట్టకుండా, మార్కెట్‌కు వెళ్ళకుండా App తోనే అన్ని పనులనూ కానిచ్చేస్తున్నారు. ఇంటికి కావలసిన అన్ని రకాల సర్వీసులు కూడా App తోనే పొందుతున్నారు. బయటకి వెళ్లాలంటే, స్వంత వాహనం లేకపోయినా, ఇంటి ముందు నుంచి బైక్, కారు బుక్ చేసుకుని వెళ్లిపోతున్నారు. ధనిక, మధ్యతరగతి ప్రజలకు నిత్య జీవితాన్ని సులువు చేసి, ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకూ డోర్ డెలివరీ సేవలతో వీళ్ళు మనఇంటి తలుపు తడుతున్నారు? సాధారణ అర్ధంలో, వాళ్ళు మనకు పరిచయస్థులు, బంధువులు, స్నేహితులు కారు. కానీ, వాళ్లిప్పుడు మన నిత్య జీవితంలో భాగమై పోయారు.

ఎండా, వానా, చలీ అనుకోకుండా రద్దీ ట్రాఫిక్‌లో వేగవంతమైన బైక్ ప్రయాణంతో ఎక్కే గడపా, దిగే గడపా‌గా జీవనోపాధి ఎంచుకున్న వీళ్ళు ఎవరసలు? మన జీవితంలో ఎలా భాగమయ్యారు? వాళ్ళ జీవితాలేమిటి ? వాళ్ళ ఆదాయాలేమిటి? వాళ్లకున్న సమస్యలేమిటి? వారి కున్న హక్కులేమిటి ? మనం ఎప్పుడైనా ఆలోచించామా ?

సాధారణంగా వీళ్ళను గిగ్, ప్లాట్ ఫారం కార్మికులంటారు. అమెరికా, యూరప్ లలో "gig" అంటే, డిక్షనరీ అర్థం ప్రకారం, చిన్న స్వతంత్ర పని లేదా ఒప్పంద ఆధారిత ఉద్యోగం. నిజానికి భారత దేశంలో app ఆధారితంగా జరుగుతున్న పనులను అంతా తక్కువ కాలానికి,తాత్కాలిక ప్రాతిపదికన ఎవరూ ఎంచుకోవడం లేదు. ఎక్కువమంది ఈ కార్మికులు రోజుకు 12 నుండీ 14 గంటల పాటు పని చేస్తున్నారు. కొన్ని app ఆధారిత కంపనీలు, “రోజుకు 14 గంటలు పని చేయండి, కేవలం 6 గంటలు నిద్రపోండి, నెలకు 50,000 సంపాదించండి” లాంటి వాణిజ్య ప్రకటనలను అధికారికంగానే విడుదల చేస్తున్నాయి. వీరి విషయంలో 8 గంటల పని దినం అనేది అసలు లేకుండా పోయింది. కొంతమంది మాత్రం ఇతర ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ, అదనపు ఆదాయం కోసం రోజూకు 5-6 గంటలు ఈ app ఆధారితంగా పని చేసుకుంటున్నారు.

ప్లాట్ ఫారం అంటే, ఏదో ఒక app ఆధారంగా పని చేయడం.ఇప్పటికే తెలంగాణ లో app ఆధారిత ప్రధాన కంపనీలు 10 కి పైగా ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ రంగంలో స్విగ్గి, జొమాటో, రైడ్ షేరింగ్ రంగంలో ఓలా, ఊబర్, రాపిడో , పోర్టర్, ఇతర e –కామర్స్ , గ్రాసరి డెలివరీ రంగంలో అమెజాన్,బిగ్ బాస్కెట్,బ్లింక్ ఇట్,ఫ్లిప్ కార్ట్, మంత్ర, ఇతర సర్వీసుల రంగంలో అర్బన్ కంపనీ లాంటి పెద్ద కంపనీలు ఉన్నాయి. హైదరాబాద్ కే పరిమితం కాకుండా , కొన్ని కంపనీలు, కొన్ని 2 టైర్ సిటీలకు కూడా తమ బిజినెస్ సేవలను విస్తరించాయి.

app ఆధారిత ప్లాట్ ఫారం లను సృష్టించిన కంపనీ యాజమాన్యాలు , ఈ app ఆధారితంగా పని చేసే వారిని తమ కంపనీలో పని చేసే కార్మికులుగా గుర్తించవు. కేవలం వారిని పార్టనర్స్ గా భావిస్తాయి. తమ app ను ప్లాట్ ఫారం గా వాడుకున్నందుకు , వారి నుండీ ప్రతి బిల్లులో కనీసం 30 శాతం వసూలు చేస్తాయి. కొన్ని కంపనీలు, ప్రతి బిల్లులో కమిషన్ తీసుకోకుండా, రోజు వారీగా సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని తీసుకుంటాయి. తమ app ఆధారిత కార్మికులకు వినియోగదారులు ఇచ్చే ర్యాంకింగ్ ను బట్టి, వారికి బిజినెస్ ఇస్తాయి.

స్వంత డబ్బుల తోనో, అప్పు తీసుకునో వేలూ,లక్షలూ ఖర్చు పెట్టి, వాహనాలను సమకూర్చుకుని, app డౌన్ చేసుకుని, స్వతంత్ర్య జీవనపాధిని ఎంచుకుందామంటే, అక్కడికి వెళ్ళాక కానీ చాలామంది కార్మికులకు తెలియడం లేదు. తాము ఒక చక్ర వ్యూహం లోకి వచ్చామని. వారికి నిర్ధిష్ట వేతనాలు ఉండవు. నిర్ధిష్ట పని గంటలు ఉండవు. ఏదైనా అపద వస్తే సాంఘిక బధ్రత ఉండదు. జీవిత బీమా , ప్రమాద బీమా ఉండవు. నాలుగు చక్రాల వాహనం నడిపే వాళ్ళకు తెలంగాణలో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వరు. ఒక రకంగా ఈ రకమైన పనిలో చేరడమంటే, పరుగు పందెంలో పాల్గొనడమే. ఆగిపోతే నిత్య జీవితం నడవదు. వాహనాల కోసం చేసిన రుణాలు తీరవు. చదువుకుండామంటే సమయం దొరకదు. మనిషికి తగినంత విశ్రాంతి తీసుకుందామంటే, కుటుంబానికి తగినంత ఆదాయం రాదు. ఒక జోన్ లో తమ ధగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులు , మరో జోన్ కు ట్రాన్స్ ఫర్ కోరుకుంటే, ఈ కంపనీలు అంత త్వరగా అనుమతించడం లేదు.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి, వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడి, పారిశ్రామిక రంగం కూడా కుదేలైన దశలో, ముందుకు వచ్చిన ఈ ప్లాట్ ఫారం రంగంలో పని చేసుకోవడం తప్ప రాష్ట్ర యువతకు మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అన్ని కులాలకు, మతాలకు చెందిన యువకులు, యువతులు, విద్యార్ధులు కూడా ఈ రంగంలో ఉపాధి కోసం పరుగు లెత్తుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండీ వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఈ రంగంలో పనులు పొందుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇలా app ఆధారిత పనులు చేసుకుంటున్న వారి సంఖ్య 4,20,000 వరకూ ఉంటుందని ఒక అంచనా.

ఈ కార్మికులది స్వతంత్ర జీవితం అని ఎంత ఊదర గొట్టినా, ఈ కార్మికుల జీవితాలు ప్లాట్ ఫారం సృష్టించిన కంపనీల చేతుల్లో ఆస్వతంత్ర్యంగా మారిపోయాయి. ఏదో ఒక సాకుతో కంపనీలు కార్మికుల ID కార్డులను మాత్రం బ్లాక్ చేస్తుంటాయి. ఇటీవల ఒక app ఆధారిత కంపనీలో పని చేస్తున్న ఒక మహిళ, తమ ఇంట్లో వ్యక్తి చనిపోయిన కారణంగా ఆ రోజు సర్వీస్ పనులకు వెళ్లలేనని ఫోన్ చేసి చెప్పినా, వీడియో కాల్ చేసి మృత దేహాన్ని చూపించినా కూడా ఆ కంపనీ అమానవీయంగా ఆమె ID కార్డ్ ను బ్లాక్ చేసింది.

చిన్న చిన్న తప్పులకు కూడా కంపనీలు , కార్మికుల ID లను బ్లాక్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా బైక్ రైడర్స్ , తమ సర్వీస్ లో భాగంగా ఎప్పుడైనా యాక్సిడెంట్ కు గురైతే, తమ కేమీ సంబంధం లేదని చెప్పడానికి, ఆ కార్మికుల ID లను బ్లాక్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కనీస ఆదాయం కోసం ఎక్కువ గంటల పాటు పని చేయడం వల్ల, కార్మికుల ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. ఇంత పని చేసినా, డెలివరీ కార్మికులు 15 నుండీ 18,000 సంపాదిస్తే, లేదా రైడ్ షేరింగ్ కార్మికులు 20 నుండీ 25,000 సంపాదించడం గగనంగా మారిపోయింది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు,బండి మెయింటెనెన్స్,, ట్రాఫిక్ చాలానా లు కట్టాక, కంపనీకి కమిషన్ చెల్లించాక, ఈ కార్మికులకు మిగిలేది చాలా తక్కువ. నిజానికి వేరికి నిర్ధిష్ట వేతనాలు లేవు. నెలకు కనీస ఆదాయానికి గ్యారంటీ లేదు.

తెలంగాణ రాష్ట్రం లోకి ఓలా, ఊబర్ లాంటి కంపనీలు వచ్చి పదేళ్ళు దాటిపోతున్నా, ఇప్పటికీ, కిలో మీటర్ కు 10-11 రూపాయలకు మించి దొరకడం లేదు. కంపనీలు వినియోగదారుల నుండీ సర్ ఛార్జీలు వసూలు చేసినా , ఎక్కువలో ఎక్కువ కిలో మీటర్ కు 14 రూపాయలకు మించి దొరకడం లేదు. నిజానికి హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రీ పెయిడ్ టాక్సీలకు కిలో మీటర్ కు 21 రూపాయలు చెల్లించేలా జీవో ఉంది. కానీ విమానాశ్రయానికి బయట, ఆ ఛార్జీలు కార్మికులకు లభించడం లేదు. అందుకే బాయ్ కాట్ ఎయిర్ పోర్ట్, బాయకట్ ఏసీ లాంటి నినాదాలతో కార్మికులు ఉద్యమాలు కూడా సాగించారు.

గత దశాబ్ధ కాలంలో పెట్రోల్,డీజిల్ ధరలు రెట్టింపు అయిన దశలో కూడా మార్కెట్ ను పూర్తిగా తమలో తాము పోటీలు పడుతూ, మొత్తం రవాణా రంగ మార్కెట్ ను తమ చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంతో, కంపనీలు కార్మికులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా కిలో మీటర్ ఛార్జీలు పెంచకుండా దోచుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రంగం ఓపెన్ అయిన మొదటి దశలో కంపనీలు, ఒక డ్రైవర్ , ఇతర డ్రైవర్స్ ని కంపనీకి పరిచయం చేయడం, తమ కంపెనీకే కట్టుబడి ఉండడం లాంటి సందర్భాలలో ఎక్కువ ఇన్సెంటివ్ లు చెల్లించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఎక్కువ కంపనీలు రంగంలోకి వచ్చాక, లక్షలాది వాహనాలు ఈ రంగంలోకి వచ్చాక, ఇప్పుడు అన్ని కంపనీలు కూడ బలుక్కుని కార్మికులకు ఆ ఇన్సెంటివ్ లను చెల్లించడం మానేశాయి. సాయంత్రం 5 నుండీ రాత్రి 11 వరకూ తమ app ఓపెన్ చేసి ఉండే కార్మికులకు మాత్రమే కొన్ని కంపనీలు కొన్ని సార్లు ఇన్సెంటివ్ లు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది.

కార్మికుల శ్రమ మీద లాభాలు దండుకోవడం తప్ప , కార్మికుల సంక్షేమం కోసం ఏ ప్లాట్ ఫారం కంపనీ ఆలోచించడం లేదు. పైగా ఈ కంపనీలపై ఇప్పటి వరకూ ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు. వీటిలో నేరుగా జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పటి వరకూ అధికారం లేదు. కొన్ని app కంపెనీలకు కనీసం హైదరాబాద్ లో ఆఫీసు కూడా లేదు . తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్న కార్మికుల సమాచారం కూడా ప్రభుత్వం తో పంచుకోవడానికి సిద్దంగా లేవు.

ఇప్పటి వరకూ తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఈ కార్మికులది. వెళ్ళి కార్మిక శాఖకు చెప్పుకుందామంటే వీళ్ళు కార్మికులు కాదని కంపనీలు అంటాయి. IT రంగ అధికారులకు చెప్పుకుందామంటే వీళ్ళు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాదు కదా, వెళ్ళి పొమ్మంటారు. ట్రాన్స్ పోర్ట్ అధికారులకు చెప్పుకుందామంటే, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కార్మికులు కాదని వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు.

కంపనీలు వీళ్ళను కార్మికులుగా గుర్తించవు కాబట్టి, ఇతర రంగాల కార్మికుల కోసం దశాబ్ధాలుగా పని చేస్తున్న కార్మిక సంఘాలు కూడా వీరిని కూడా కార్మికులుగా గుర్తించి, వారి ప్రత్యేక సమస్యలపై పని చేయడం లేదు. వారి కోసం సంఘాలు కూడా నిర్మాణం చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మన చుట్టు పక్కల ఉండే అనేకమంది యువత, విద్యార్ధులు ఈ app ఆధారిత కార్మికులుగా పని చేస్తూ కనపడుతున్నా, వీళ్ళతో ఎలా పని చేయాలో, ఎలా వ్యవహరించాలో, ఇంకా రాజకీయ పార్టీలకు , కార్మిక, ప్రజా సంఘాలకు ఇప్పటికీ అర్థమే కాలేదు.

కానీ, దశాబ్ధ కాలం క్రితమే ఒక హైదరాబాద్ కుర్రాడు వీళ్ళ గురించి ఆలోచించాడు. మూడేళ్ల పాటు వీరి జీవితాలను లోతుగా పరిశీలించాడు. తాను కూడా ఈ వృత్తిలో భాగంగా జీవనోపాధిని ఎంచుకుని కుటుంబాన్ని పోషించుకుంటూనే, తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ కోసం ఒక సంఘమే పెట్టాడు. ఆ కుర్రాడే షేక్ సలావుద్దీన్. తాను పెట్టిన సంఘమే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్. హిందీలో, తెలుగులో గలగలా మాట్లాడే ఈ కుర్రాడు ఇప్పుడు దేశంలో , రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నాడు. వివిధ రాష్ట్రాలలో వీళ్ళ కోసం నూతనంగా చట్టాలను తేవడానికి ఇతర సామాజిక కార్యకర్తలతో కలసి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తున్నాడు.

మొదటి దశలో కొందరు వ్యక్తుల సహకారంతో, అప్పటి కేంద్ర మంత్రి నితీశ్ గడ్కరీని కలసి, గిగ్ కార్మికుల సమస్యలు వివరించి, వారి సాంఘిక బధ్రత కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని వాదించి, కేంద్ర ప్రభుత్వం 2020 లో తెచ్చిన సాంఘిక బధ్రత కోడ్ లో గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులను కూడా చేర్చేలా ఒప్పించి విజయం సాధించాడు. సరె, ఆ లేబర్ కోడ్ లు ఇప్పటికీ ఇంకా అమలులోకి రాలేదనుకోండి. మరో ప్రయత్నంగా , రాహుల్ గాంధీ సాగించిన భారత్ జోడో యాత్రలో తాను కూడా భాగస్వామిగా చేరి, రాహుల్ గాంధీకి గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సమస్యలు అర్థమయ్యేలా వివరించాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంఒ ఉన్న చోట, ఈ కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. రాహుల్ గాంధీకి యాత్ర పొడవునా, వివిధ రాష్ట్రాలలో కార్మికులను కల్పించి సలావుద్దీన్ చేసిన ఈ ప్రయత్నం రాజస్థాన్ చేరే నాటికి ఒక రూపం దాల్చింది. కేవలం రాజకీయ నాయకులతో లాబీ చేయడమే కాదు, అనేక ఆందోళనలు, ధర్నాలు కూడా చేసి ఈ కార్మికుల సమస్యలను ప్రజల దృష్టికి , ప్రభుత్వాల దృష్టికి 10 వేల మంది సభ్యత్వం కలిగిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫారం వర్కర్స్ యూనియన్ తీసుకు వచ్చింది.

ఈ సందర్భంగా రవాణా,ఆహారం,మరియు కొరియర్ డెలివరీ, లాజిస్టిక్స్, గృహ ఆధారిత సేవలు,వృత్తిపరమైన సేవలు,ఆరోగ్య సంరక్షణ వంటి అన్ని రంగాలలోని గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల హక్కులను రక్షించాలని, ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నమోదు చేసుకునే అవకాశం ఉండాలని, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ID ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వమ్ ఈ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ఈ బోర్డు ద్వారా, కార్మికులు సామాజిక బధ్రత పథకాలను పొందే వీలుండాలని, అగ్రిగేటర్లు, ప్లాట్ ఫారం సంస్థలు,రేటింగ్ లు, కార్మికుల వర్గీకరణకై ,ఉపయోగించే అల్గారిథం మేనేజ్ మెంట్ లో పారదర్శకత ఉండాలని, ఈ సమాచారాన్ని, అగ్రిగేటర్లు సేకరించిన కార్మికుల వ్యక్తిగత సమాచారాన్ని కార్మికులు యాక్సెస్ చేయగలగాలని యూనియన్ కోరుతున్నది.

కార్మికులు సురక్షితమైన పని వాతావరణాన్ని కలిగి ఉండాలని,కార్యాలయంలో వారి బద్రతకు ఎటువంటి రిస్క్ ఉండకూడదని, అగ్రిగేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కార్యాలయ బధ్రత, ఆరోగ్య ప్రమాణాలను పాటించాలని యూనియన్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం పొందే హక్కు కార్మికులందరికీ ఉండాలని, యాప్ ఆధారిత డ్రైవర్స్ కు ఏక రూప చార్జీల వంటి చర్యల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ బద్రతను నిర్ధారించాలని, ఫిర్యాదులను నివేదించడం, పరిష్కరించడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, దాని ముందుకు వెళ్ళే హక్కు కార్మికులందరికీ ఉండాలని, కార్మికులు ఆన్లైన్ లో, లేదా నిర్దేశిత అధికారి ముందు ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని, కార్మికులు, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 క్రింద పరిష్కారాన్ని పొందగలగాలని యూనియన్ కోరుతున్నది. అగ్రిగేటర్లు చెల్లుబాటయ్యే కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వకుండా, .14 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా కార్మికుడిని తొలగించకూడదని, కార్మికులందరికీ న్యాయమైన పని నిబంధనలు మరియు షరతులు ఉండాలని, అగ్రిగేటర్లు కాంట్రాక్టులో ఏవైనా మార్పులు చేయడానికి కనీసం 14 రోజుల ముందు కార్మికులకు తెలియచేయాలని కూడా యూనియన్ కోరింది.

రాజస్థాన్ లో MKSS సంస్థ బాధ్యులు గా ఉన్న సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో కలసి సలావుద్దీన్, అక్కడి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరిపి, ఒక చట్టాన్ని ఆమోదించేలా చేశారు. దేశం మొత్తంలోనే గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల కోసం వచ్చిన మొదటి చట్టం ఇది.

తాజాగా రాహుల్ గాంధీ సహకారంతో, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఈ కార్మికుల కోసం ఒక ఆర్డినెన్స్ తెచ్చేలా విజయం సాధించారు. తన స్వంత రాష్ట్రం తెలంగాణ లో కూడా ఇతర రాష్ట్రాలకు మించి గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల కోసం ఒక మంచి చట్టం తేవడానికి సలావుద్దీన్, ఇతర సామాజిక కార్యకర్తలతో కలసి చేసిన కృషి కూడా ఒక రూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని రూపొందించి, ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్ లో ఉంచింది.

ఏప్రిల్ చివరి వారంలో చట్టాన్ని ఆమోదించి, మే 1 నుండీ కొత్త చట్టాన్ని అమలు చేయాలనే ప్రయత్నంలో ఉంది. చివరి దశలో యాజమాన్యాలు అడ్డు పడకుండా ఉంటే, చట్టంతో పాటు, ఈ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డు కూడా ఉనికి లోకి వచ్చే అవకాశం ఉంది. లక్షలాది మంది గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడే చట్టం అమలు లోకి రావాలని, 2035 నాటికి app ఆధారిత సేవలను కంపనీలు రాష్ట్రమంతా విస్తరించే నాటికి, ఈ రాష్ట్ర కార్మికులకు ఈ చట్టం పై అవగాహన పెంచాలని, బలంగా కోరుకుంటున్న షేక్ సలావుద్దీన్ లాంటి సామాజిక కార్యకర్తల కల నెరవేరాలని కోరుకుందాం. రాష్ట్రంలో ఉన్న ఇతర కార్మిక సంఘాలు కోల్పోతున్న కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ఈ చట్టాన్ని స్పూర్తిగా తీసుకుంటాయని ఆశిద్ధామ్.

Read More
Next Story