
డేంజర్ జోన్ లో హైదరాబాద్! ఐఐటీ కాన్పూర్ వార్నింగ్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక్కడి ప్రజలు పీల్చే గాలిలో విషపూరిత వాయువులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని ఐఐటీ కాన్పూర్ చేపట్టిన తాజా అధ్యయనం హెచ్చరించింది.
ముఖ్యంగా నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతాలు కాలుష్యానికి కేంద్ర బిందువులుగా మారుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. శివార్లలో పరిశ్రమలు, సిటీలో వాహనాల నుంచి దారుణంగా సల్ఫర్ డయాక్సైడ్ (SO2) విడుదల అవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో రోజుకు సగటున 10,701 కిలోల SO2 గాలిలోకి విడుదలవుతుండగా, అందులో 91 శాతం కేవలం వాహనాల వల్లే జరుగుతోంది. అయితే, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అక్కడ ప్రతిరోజూ 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతోంది. ఇందులో 92 శాతం వాటా పరిశ్రమలదే.
ఈ వాయువు శ్వాసనాళాల్లో మంట, ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలంలో ఆస్తమా వంటి తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం వల్ల ఎక్కువ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

