
16 మంది బెలూచ్ రెబెల్స్ మృతి, కొనసాగుతున్న ఆపరేషన్
104 మంది ప్రయాణిికులను రక్షించిన భద్రతా దళాలు
పాకిస్తాన్ లోని పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న రైలును బలూచ్ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రైలు బలూచిస్థాన్ లోని బొలాన్ కనుమ దగ్గరకు వెళ్లగానే తిరుగుబాటుదారులు రైలును తమ అదుపులోకి తీసుకున్నారు.
అయితే పాకిస్తాన్ ఆర్మీ తరువాత ప్రారంభించిన ఆపరేషన్ లో కనీసం 16 మంది తిరుగుబాటుదారులను మట్టుబెట్టి 104 మంది ప్రయాణీకులను రక్షించినట్లు సమాచారం అందుతోంది.
పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కొంతమంది సైనికులను తిరుగుబాటుదారులు దగ్గర్లోని కొండ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు, భద్రతా దళాలు వారిని వెంబడించినప్పటికీ విజయం సాధించలేకపోయారని తెలిసింది.
చిన్న చిన్న గ్రూపులుగా బలూచ్ లు..
బలూచ్ రెబెల్స్ గ్రూపులతో జరుగుతున్న పోరాటంలో మహిళలు, పిల్లలు సహ 104 మందిని రక్షించామని ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ అధికారులు మీడియాకు తెలిపారు. ‘‘చీకటిలో తప్పించుకోవడానికి తిరుగుబాటుదారులు చిన్నచిన్న గ్రూపులుగా ఏర్పడ్డాయని, కానీ బొలాన్ కనుమను తాము చుట్టుముట్టామని మిగిలిన ప్రయాణీకులను త్వరలో రక్షిస్తాము’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
రైలు ఉన్న సొరంగం ప్రాంతంలో ఉన్న జిల్లా పోలీస్ అధికారి రాణా ముహ్మద్ దిలావర్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, అయితే ఉగ్రవాదులు, కొంతమంది మహిళలు, పిల్లలను బందీలుగా తీసుకుంటున్నట్లు నివేదికలు వచ్చాయని తెలిపారు. రైలులో ఐదుగురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు.
కొనసాగుతున్న ఆపరేషన్..
‘‘ఇప్పటికి కొనసాగుతున్న ఆపరేషన్ లో 16 మంది ఉగ్రవాదులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.’’ అని ఒక అధికారి పోలీసులకు తెలిపారు. రైలు నుంచి మిగిలిన ప్రయాణీకులను రక్షించే వరకూ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటి వరకూ రక్షించిన వారిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరిని మరొక రైలులో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని కాచ్చి జిల్లాలోని మాక్ కు పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
బలూచ్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు ముందుగా 80 మంది ప్రయాణికులను రక్షించగలిగాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు.
సొరంగంలో ఆగిన రైలు..
తొమ్మిది బోగీలలో దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తోంది. గుడాలర్ - పిరు కున్రి పర్వత ప్రాంతాల సమీపంలోని సొరంగంలో సాయుధ వ్యక్తులు దానిని అడ్డగించారు. ఈ దాడికి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించింది.
అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వనప్పటికీ రైల్వే అధికారులు సొరంగంలో రైలు ఆగి ఉందని, కఠిన ప్రాంతంలోకి భద్రతా దళాలు చేరుకున్నాయని రిండ్ చెప్పారు.
పెషావర్, క్వెట్టాలో అత్యవసర డెస్క్ లు..
బలూచ్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేసిన తరువాత సొరంగం దగ్గర తీవ్ర కాల్పులు, పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్ మీడియా వార్తలు ప్రసారం చేసింది. పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలుపై తీవ్రమైన కాల్పులు జరిగాయని నివేదికల మధ్య తాము సహాయక బృందాలను పంపినట్లు రిండ్ చెప్పారు.
పెషావర్- క్వెట్టా రైల్వే స్టేషన్ లో పాకిస్తాన్ రైల్వేలు అత్యవసర డెస్క్ లను ఏర్పాటు చేశాయి. దాడి గురించి సమాచారం కోసం బంధువులు, స్నేహితులు రైల్వే స్టేషన్ కు వస్తున్నారు.
పాకిస్తాన్ రైల్వేలు క్వెట్టా నుంచి పెషావర్ కు సేవలు నిలిపివేసిన నెలన్నర తరువాత తిరిగి కొత్తగా ప్రారంభం అయిన తరువాత వెంటనే బలూచ్ రెబెల్స్ దాడులు చేశాయి.
నాలుగు నెలల్లో రెండో అతిపెద్ద దాడి..
గత ఏడాది నవంబర్ లో క్వెట్టా రైల్వే స్టేషన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతి చెందారు. 62 మంది గాయపడ్డారు. ఆ తరువాత రైలు సేవలు నిలిచిపోయాయి.
పెషావర్ రైల్వే స్టేషన్ సీనియర్ అధికారి తారీఖ్ మహమూద్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు.
Next Story