‘యుద్ధం తప్ప మరో మార్గం లేదు’
x

‘యుద్ధం తప్ప మరో మార్గం లేదు’

‘‘సింధూ జలాలను వదలకపోతే అదొక్కట్లే మార్గం’’ - పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ


Click the Play button to hear this message in audio format

పహెల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్‌కు వెళ్లే సింధూజలాలను (Indus Waters Treaty) భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశానికి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే భారత్‌ను నాశనం చేస్తామని పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదివారం (ఆగస్టు 10న) హెచ్చరించారు. ఫ్లోరిడాలోని టంపాలో ప్రవాస పాకిస్థానీయులనుద్దేశించి ప్రసంగించారు. "మనది అణ్వస్త్ర దేశం. మనం పతనమవుతున్నామని అనుకుంటే, మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా పతనం చేస్తాం" అని పేర్కొన్నారు.

భారత్ కౌంటర్..

మునీర్‌ వ్యాఖ్యలపై భారత్‌ వెంటనే స్పందించింది. అమెరికా అండ చూసుకుని అణు బెదిరింపులకు భయపడే స్థితిలో భారత్ లేదని సమాధానమిచ్చింది. దేశ భద్రత కోసం ఏ మాత్రం వెనుకాడబోమని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

‘పాక్‌కు తీవ్ర నష్టం’

కాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా మునీర్‌ను అనుసరించారు. సోమవారం (ఆగస్టు 11న) భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్ జీవనాధారాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి న్యూఢిల్లీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సింధూ జలాలను వదలకపోతే సంఘర్షణ తప్పదన్నారు. సింధ్‌లో జరిగిన ఒక సభలో ఆయన ఈ మాటలన్నారు. సింధు జలాల నిలిపివేత వల్ల 250 మిలియన్ల పాక్ ప్రజానీకం ఆకలితో అలమటించే ప్రమాదం ఉందన్నారు. పాకిస్థాన్‌కు తీవ్రనష్టం కలిగిస్తోన్న భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పాకిస్తానీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సింధు జలాలను వదలకపోతే పాక్‌కు యుద్ధం తప్ప "మరో మార్గం" లేదని భుట్టో హెచ్చరించారు.

Read More
Next Story