పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్- అమెరికా కలిసి హతమార్చడంతో అంటుకున్న దావాగ్ని ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టింది. ఇరాన్ తనకున్న మొత్తం ఆయుధ బలాన్ని గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్ లపైకి గురిపెట్టి ప్రయోగిస్తోంది. అలాగే తన చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్ పైకి మిస్సైల్సు, డ్రోన్లను ఉపయోగిస్తోంది.
అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడును ఆపడం లేదు. టెహ్రాన్ లోని కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తిరుగుబాటుదారులకు అనుకూలంగా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మరోసారి మత నాయకుల చేతుల్లోకి వెళ్లకూడదనే లక్ష్యం దానిలో స్పష్టంగా కనపడుతోంది.
ప్రతీకారం తీర్చుకుంటాం..
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిపై ఇరాన్ నాయకత్వం తీవ్ర ప్రతిజ్ఞలు చేసింది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్, యూఎస్ఏను హెచ్చరించాయి. ప్రపంచ దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ మృతి చెందినట్లు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ దేశపు అధికారిక వార్తా ఛానెల్ కూడా ఖమేనీ మృతిని నిర్ధారించింది.
‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలోనే అత్యంత భయంకరమైన దాడి ఆపరేషన్ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని ఐఆర్జీసీ ఒక టెలిగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది. గల్ప్ ప్రాంతంలోని ఆక్రమిత ప్రాంతాలు, అమెరికన్ ఉగ్రవాద స్థావరాలను ఆ దేశం ఉగ్రవాద స్థావరాలుగా అభివర్ణించింది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించారు. సుప్రీం లీడర్ ఇంటిలో ఉన్న ఇతర ముఖ్య నాయకులు కూడా అసువులు బాశారు.
ఇరాన్ ను పాలించండి..
ఇజ్రాయెల్- అమెరికా ప్రారంభించిన ఒక పెద్ద దాడిలో ఖమేనీ మరణించారని, ఇరానియన్లు తమ భవిష్యత్ ను తిరిగి తెచ్చుకోవడానికి గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ అన్నారు. ‘‘చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు’’ అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో రాశాడు. ఇది వారం పాటు కొనసాగుతుందని కూడా హెచ్చరించారు. ట్రంప్ పాలనలోకి వచ్చిన గత ఎనిమిది నెలల్లో ఇరాన్ పై రెండో దాడి ఇది.
కరాచీలో అమెరికా సైన్యం కాల్పులు..
ఖమేనీ హత్య తరువాత పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయిన కరాచీలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. షియా వర్గం ప్రజలు కరాచీలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై దాడులకు దిగారు. దీనితో పాక్ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అమెరికా సైన్యం పాక్ పౌరులపైకి కాల్పులు జరిపింది. ఇందులో దాదాపు 12 మంది పాక్ పౌరులు మరణించారు. అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు.
కాన్సులేట్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రదర్శనకారులు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. జనాన్ని అదుపుచేయడానికి పోలీసులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కాల్పులు, అల్లర్ల సమయంలో మైకోలాచీ రోడ్డు సమీపంలో ఆరుగురు మరణించారు.
సింధ్ అంతర్గత వ్యవహరాల మంత్రి జియావుల్ హసన్ లాంగర్ మాట్లాడుతూ.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఎవరూ అనుమతించరని చెప్పారు. సున్నితమైన ప్రదేశాలలో భద్రత పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.