‘భారత్ మాపై ముందుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించింది’
x

‘భారత్ మాపై ముందుగా బ్రహ్మోస్‌ను ప్రయోగించింది’

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..


Click the Play button to hear this message in audio format

బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ ముందస్తు దాడి చేసి రావల్‌పిండీలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురీద్ ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేసిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఆరోపించారు. అజర్‌బైజాన్‌లోని లాచిన్‌లో జరిగిన పాకిస్తాన్-టర్కీ-అజర్‌బైజాన్ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని తమ సైన్యం.. మే 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనల తర్వాత భారత్‌పై దాడికి ప్లాన్ చేసిందని, ఆ లోగానే భారత్‌తో ముందస్తు దాడికి పాల్పడిందని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)లో భాగంగా భారత్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిలను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై ప్రయోగించింది. ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్‌ దాడులు మొదలుపెట్టింది. పాక్ సరిహద్దు జిల్లాలోని జనావాసాలపై షెల్లింగ్‌కు పాల్పడింది. డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని వైమానిక రక్షణ వ్యవస్థలు S-400, ఆకాశ్ వాటిని ధీటుగా అడ్డుకున్నాయి.

చర్చలకు సిద్ధమన్న షరీఫ్..

భారత్ సాయుధ బలగాల చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ ఒక మెట్టు దిగొచ్చింది. చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కశ్మీర్, సింధూ జలాల వివాదం, వాణిజ్యపర విషయాలపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ ప్రకటించారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపై తప్ప, మిగతా విషయాల గురించి మాట్లాడేందుకు భారత్ అంగీకరించలేదు.

ఉగ్రవాదుల ఆటకట్టించిన ఆపరేషన్ సిందూర్‌..

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను ఉగ్రమూకలు కాల్చిచంపిన తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో జైషే మొహమ్మద్ (జెఎం) అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు వారితో సన్నిహితంగా ఉన్న మరో నలుగురు ఉన్నారు. బహవల్‌పూర్‌లోని జైషే మర్కజ్ సుభాన్ అల్లా, టెహ్రా కలాన్‌లోని సర్జల్ క్యాంప్, కోట్లిలోని మర్కజ్ అబ్బాస్, ముజఫరాబాద్‌లోని సయ్యద్నా బిలాల్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.

Read More
Next Story