అబ్రహమ్ కూటమి vs ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్  మధ్య యుద్ధం అనివార్యమా?
x

అబ్రహమ్ కూటమి vs ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మధ్య యుద్ధం అనివార్యమా?

పశ్చిమాసియా లో పది నెలల క్రితం మొదలైన ఇజ్రాయెల్- గాజా యుద్ధం క్రమక్రమంగా విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్ రాజకీయ విభాగం అగ్రనేత ఇస్మాయిల్ హానియా..


పశ్చిమాసియాలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా హమాస్ రాజకీయ అధినేత ఇస్మాయిల్ హానియా ను ఇరాన్ లో మట్టుబెట్టడంతో ఆ దేశం అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.

ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ ప్రమాణ స్వీకారం కోసం అతిథిగా విచ్చేసిన వ్యక్తిని హత్యకు గురికావడంతో అంతర్జాతీయంగా ఇరాన్ అవమానభారం ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా కమాండర్ ఫాద్ షుక్ర్ ను వైమానిక దాడిలో హతమార్చడం, అంతకుముందు గాజాలో చేసిన వైమానిక దాడిలో మరో హమాస్ కమాండర్ మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రకటించడంతో పశ్చిమాసియా లో యుద్ధం విస్తరిస్తుందా అనే భయం మొదలైంది.

గాజాలో హమాస్ ఇంతలా చెలరేగడానికి దానికి అండగా ఉన్న ఇరాన్ కారణమని ప్రపంచానికి తెలుసు. ఇది ఎప్పటికి ముగియని రావణ కాష్ఠంలా కొనసాగుతోంది. ఇప్పుడు హామాస్ అగ్రనేత హత్యతో ఇక ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం తప్పదా అని ప్రపంచ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వివాదం అబ్రహం అలయన్స్ vs యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మధ్య పోెరు ఉధృతం అవుతుందా అని ప్రశ్నలు ఆందోళనలు మొదలయ్యాయి.
అబ్రహం కూటమి..
అబ్రహం కూటమి అంటే ఏమిటి? ఇరాన్ టెర్రర్‌ను ఎదుర్కోవడానికి 'అబ్రహం అలయన్స్' అనే ప్రాంతీయ కూటమిని స్థాపించాలనే ఆలోచనను తీసుకొచ్చింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ కొత్త ప్రాంతీయ సంకీర్ణం తప్పనిసరిగా ఇరాన్‌కు వ్యతిరేకం. అబ్రహం అనే పేరు అబ్రహం ఒప్పందాల నుంచి వచ్చింది, ఇవి ఇజ్రాయెల్- అనేక అరబ్ దేశాల మధ్య ట్రంప్ పరిపాలన సమయంలో కుదిరిన ఒప్పందాలు. ఈ ఒప్పందాలు మధ్యప్రాచ్య దౌత్యంలో "ముఖ్యమైన మైలురాయి"గా పరిగణించబడ్డాయి.
ఈ ఒప్పందాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సూడాన్, మొరాకో వంటి అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ అధికారిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి దారితీసింది. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్‌తో శాంతిని నెలకొల్పుకునే దేశాలన్నీ ఈ కూటమిలో చేరాలని ఆహ్వానించాలని నెతన్యాహు అన్నారు.
నెతన్యాహు ప్రకారం, ఇరాన్ తీవ్రవాద భావజాలం అమెరికా, ఇజ్రాయెల్ అరబ్ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. "ఇది నాగరికతల ఘర్షణ కాదు. ఇది అనాగరికత నాగరికత మధ్య ఘర్షణ" అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి-ఇరాన్ ప్రాక్సీల నెట్‌వర్క్? ఇజ్రాయెల్‌ను "జియోనిస్ట్ ఎంటిటీ"గా అభివర్ణించే ఇరాన్ అధికారికంగా దానిని నాశనం చేయడానికి కట్టుబడి ఉంది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి, ఇరాన్ ప్రాక్సీ సాయుధ సమూహాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా పశ్చిమాసియా అంతటా తన పట్టును విస్తరించింది.
దీనిని సమిష్టిగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఈ నెట్‌వర్క్‌లో లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని వివిధ మిలీషియా, సిరియా, గాజాలోని మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. ఈ ప్రాక్సీలు ఈ ప్రాంతంలో ఇరాన్ వ్యూహాత్మక ప్రయోజనాలను పెంచడంలో సహాయపడుతున్నాయి. ఇవి ప్రధానంగా US ప్రభావాన్ని తగ్గించడం ఇజ్రాయెల్‌ను తుడిచిపెట్టడంపై దృష్టి సారించాయి.
"యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్" మూలాలు 1979 నాటి ఇరానియన్ విప్లవంలో దాగి ఉన్నాయి. ఇది రాడికల్ షియా ముస్లిం మతాధికారులను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చింది. సౌదీ అరేబియా వంటి సున్నీ-మెజారిటీ దేశాలు ఎక్కువగా ఆధిపత్యం వహించే ప్రాంతంలో దాని రాజకీయ, సైనిక ప్రభావాన్ని విస్తరించడానికి, ఇరాన్ కొత్త పాలన విభాగం రాష్ట్రేతర వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది.
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ సమూహాలు
ఇరాన్ నేతృత్వంలోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో భాగమైన సమూహాలు ఎవరు? పాలస్తీనా భూభాగాలలో, ఇరాన్ హమాస్ వంటి మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలను పెంచుకుంది. ఇది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై, భయంకరమైన దాడికి దారితీసింది.
ఈ సమూహాలకు ఇరాన్ నుంచి ఆర్థిక, సైనిక మద్దతు లభిస్తుంది. ముస్లిం బ్రదర్‌హుడ్ ఉద్యమంలో మూలాలను ఆకళింపు చేసుకున్న హమాస్, ఇంతిఫాదా అని పిలువబడే మొదటి పాలస్తీనా తిరుగుబాటు తర్వాత 1987లో స్థాపించబడింది. ఈ బృందం 2007 నుంచి గాజా స్ట్రిప్‌ను పరిపాలిస్తోంది.
హిజ్బుల్లాహ్
ఇరాన్ మద్దతుతో 1980ల ప్రారంభంలో స్థాపించబడిన హిజ్బుల్లా, మధ్యప్రాచ్యంలో ఇరాన్ మొదటి ముఖ్యమైన ప్రాక్సీ. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిధులు, ఆయుధాలతో, హిజ్బుల్లా, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లోని శక్తివంతమైన సమూహం.
ఇరాన్ షియా ఇస్లామిస్ట్ భావజాలాన్ని అనుసరిస్తుంది. దాని నియామకాలు లెబనాన్ షియా ముస్లిం జనాభా నుంచి అధికంగా ఉంది. నిజానికి 1982లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలతో పోరాడేందుకు ఏర్పడిన హిజ్బుల్లా ఇప్పుడు బలీయమైన సైనిక, రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంది, కనీసం 130,000 రాకెట్లు, క్షిపణుల ఆయుధాగారాన్ని కలిగి ఉంది. అంతర్యుద్ధానంతర ఆయుధాలను నిలుపుకున్న ఏకైక విభాగం ఇదే. లెబనీస్ సైన్యం కంటే పెద్ద ఆయుధాగారం దీనికి ఉందని నమ్మూతారు.
హిజ్బుల్లా గత ఏడాది అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్‌తో తరచూ సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్‌కి చెందిన గోలన్ హైట్స్‌పై షుక్ర్ నేతృత్వంలోని ఉగ్రవాదులు దాడి చేయడంతో ఫుట్ బాల్ ఆడుతున్న 12 మంది యూదు చిన్నారులు మృతి చెందారు. దీనిపై ఇజ్రాయెల్ నుంచి కఠినమైన ప్రతీకారం తప్పదని ఆ దేశం ప్రకటించింది. తరవాత టెల్ అవీవ్ చేసిన దాడిలో షుక్ర్ మరణించారు.
హిజ్బూల్లా ఆధునాతన ఆయుధాలు ఇజ్రాయెల్ లోని అన్ని ప్రాంతాలను తాకగలవని హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా తరచుగా ప్రగల్భాలు పలికారు. ఇందులో ఎక్కువ భాగం ఇరాన్, రష్యా సరఫరా చేసింది, ఇందులో మిలియన్ కంటే ఎక్కువ రాకెట్లు, ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలు, ఆత్మహత్య డ్రోన్లు స్వల్ప శ్రేణి మిస్సైల్ లు ఉన్నాయి.
హౌతీలు
యెమెన్‌లోని హౌతీ ఉద్యమం ఇరాన్ సహకారంతో ప్రాంతీయ వివాదంలో కీలక పాత్ర పోషించింది. 1990వ దశకంలో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ, 2014 తర్వాత IRGC నుంచి సైనిక, ఆర్థిక సహాయాన్ని పొంది నెమ్మదిగా ఓ శక్తిగా మారింది. గాజా యుద్ధం తర్వాత, హౌతీలు గల్ఫ్‌లోని వాణిజ్య నౌకలపై అనేక దాడులను ప్రారంభించారు. ఈ లక్ష్యాలు ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఈ చర్యలు యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాల ప్రతీకార దాడులకు దారితీశాయి.
ఇరాక్‌లోని షియా మిలీషియా
ఇరాన్‌తో జతకట్టిన అనేక ఇరాకీ షియా ముస్లిం సమూహాలు యునైటెడ్ స్టేట్స్‌తో శత్రుత్వం వహిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. 2003లో ఇరాక్‌పై US దాడి చేసిన తర్వాత, ఇరాన్ వివిధ షియా మిలీషియాలను స్థాపించడం, మద్దతు ఇవ్వడం ద్వారా తన ప్రభావాన్ని విస్తరించింది. ఈ ప్రముఖ సమూహాలలో కతైబ్ హిజ్బుల్లా, అసాయిబ్ అహ్ల్ అల్-హక్, బదర్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఉన్నాయి. ఈ మిలీషియా తరచుగా US బలగాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంది.
సిరియాలోని బషర్ అల్-అస్సాద్ పాలనతో ఇరాన్ కూటమి 2011లో సిరియన్ అంతర్యుద్ధంలో కీలకపాత్ర పోషించింది. టెహ్రాన్ అసద్ బలగాలను పెంచడానికి సుమారు 80,000 మంది పోరాట సిబ్బందితో సహా గణనీయమైన సైనిక మద్దతును అందించింది.
ఇరాన్, సిరియా ప్రభుత్వానికి మద్దతుగా జైనాబియోన్ బ్రిగేడ్ (పాకిస్తానీ యోధులతో కూడినది) ఫాతేమియోన్ డివిజన్ (ఆఫ్ఘన్ హజారా యోధులతో కూడినది) వంటి వివిధ షియా మిలీషియాలను నిర్వహించి మద్దతు ఇచ్చింది.
ఒక ముఖాముఖి పోరు ఉందా?
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బీరూట్‌లో అన్ని నియమాలను ఉల్లఘించి దాడులు చేయాలని నిర్ణయించుకుంది. ఇస్మాయిల్ హనియెహ్ హత్య ఇరాన్ గడ్డపై జరగడం చాలా ఇబ్బందికి గురిచేసింది. అలాగే, ఇరాన్‌కు, హనియెహ్ మరణం "అవమానకరమైనది" ఎందుకంటే ఇది హై-ప్రొఫైల్ అతిథులను రక్షించడంలో టెహ్రాన్ అసమర్థతను బహిర్గతం చేస్తుంది.
ఇరాన్ గడ్డపై దాడికి సమానమైన ఆపరేషన్ చేయాలని సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించారు. ఇప్పుడు ఈ దాడి ఏ రూపంలో ఉంటుందన్నదే ప్రశ్న. కొన్ని అంతర్జాతీయ వార్తా నివేదికలు ఇరాన్ ఇజ్రాయెల్ మిలిటరీ సైట్లు లేదా మౌలిక సదుపాయాలపై క్షిపణి లేదా సాయుధ డ్రోన్ దాడులను ప్రారంభించవచ్చని సూచించాయి. అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.
ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రాక్సీల ద్వారా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు సూచించారు. ఈ సమూహాలు శిక్షణ పొందినవి, సాయుధమైనవి. ప్రపంచంలో ఎక్కడికైనా చేరుకోగలవు. ఈ సమూహాలు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ లేదా యూదులను లక్ష్యంగా చేసుకోగలవు.
కొంతమంది విశ్లేషకుల ప్రకారం "యాక్సిస్-ఆఫ్-రెసిస్టెన్స్" ద్వారా లక్ష్యంగా చేసుకున్న దాడి ఇజ్రాయెల్ సైనిక సిబ్బంది లేదా పౌరులను చంపే ప్రమాదం ఉందని, ఇది పెద్ద ప్రాంతీయ సంఘర్షణకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీని అర్థం ఇజ్రాయెల్ మరింత దూకుడుగా స్పందిస్తుందని, ఈ టైట్-ఫర్-టాట్ పూర్తిస్థాయి యుద్ధంగా పేలుతుందని నిపుణులు తెలిపారు.
ఇజ్రాయెల్ F35 ఫైటర్ జెట్‌లు అలాగే అగ్రశ్రేణి వైమానిక రక్షణ, ఇతర కొత్త పరికరాల వంటి US-నిర్మిత ఆయుధాలను కలిగి ఉన్న ప్రపంచంలోని అత్యుత్తమ-సన్నద్ధమైన సైన్యాలలో ఒకటిగా ఉంది. ఇది దాని స్వంత ట్యాంకులు, సాయుధ వాహనాలు, వాయు రక్షణ, క్షిపణులు, డ్రోన్‌లను ఉత్పత్తి చేసే బాగా అభివృద్ధి చెందిన దేశీయ ఆయుధ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసింది.
మొత్తం మీద యుద్ధం జరిగితే, దాని సైనిక చర్యలు 2006 నాటి కంటే కఠినంగా, లోతుగా సాగుతాయని హెచ్చరించింది. అక్టోబర్ 7 దాడి నుంచి వాషింగ్టన్ కనీసం $12.5 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది. అలాగే, మధ్యప్రాచ్యంలో అణుశక్తిని కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్. కొందరు నిపుణులు ఇరాన్ నేతృత్వంలోని ప్రతిస్పందన ఆగస్టు 5న జరగవచ్చని కూడా భావిస్తున్నారు.


Read More
Next Story