కాబూల్: ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి
x
పాకిస్తాన్ వైమానిక దాడితో మంటల్లో కాలిపోతున్న ఆస్పత్రి భవనం

కాబూల్: ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి

400 మంది రోగులు మృతి, తీవ్రంగా గాయపడిన 250 మంది


Click the Play button to hear this message in audio format

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నగరంలో మత్తుమందు బాధితులకు చికిత్స అందించే ఆస్ఫత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి జరపడమే ఇందుకు కారణం.

ఈ దాడిలో ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో దాదాపు 400 మంది రోగులు మృత్యువాత పడినట్లు కాబూల్ ఉప ప్రభుత్వ అధికార ప్రతినిధి ప్రకటించారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో ఆసుపత్రిలోని చాలా భాగాలు ధ్వంసమయ్యాయని హమ్దుల్లా ఫిట్రత్ 'X' లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇప్పటివరకు మృతుల సంఖ్య 400గా ఉందని, మరో 250 మంది గాయపడినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు. భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు, మృతుల మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఫిట్రత్ చెప్పారు.

అయితే పాకిస్తాన్ మాత్రం తాము ఈ వైమానిక దాడి చేయలేదని వెల్లడించింది. సోమవారం కాబూల్‌లో, తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో జరిపిన ఇతర దాడులలో ఏ పౌర ప్రాంతాలపైనా దాడి జరగలేదని పేర్కొంది. అయితే ఆఫ్ఘన్ మాత్రం దీనిని ఖండించింది. పాకిస్తానే ఈ దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ దాడులలో మొదట 200 మందికి పైగా మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్, X లో పోస్ట్ చేయబడిన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ మృతుల సంఖ్యను ప్రకటించారు. ఆసుపత్రిలోని అన్ని భాగాలు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి, జబియుల్లా ముజాహిద్ కూడా ఈ వీడియో ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. ఒక భవనం శిథిలాల మధ్య మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్న దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానెళ్లు ప్రసారం చేశాయి. పాకిస్తాన్ దాడులతో ఇరుదేశాల మధ్య ఉన్న డ్యూరాండ్ లైన్ వెంట కూడా తాలిబన్లు, పాక్ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మరణించినట్లు సమాచారం.
దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న అత్యంత ఘోరమైన పోరాటం మూడవ వారంలోకి ప్రవేశించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి, మొషారఫ్ జైదీ, కాబూల్‌లో ఏ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు.
"ఆఫ్ఘన్ తాలిబన్ల సాంకేతిక పరికరాల నిల్వ, మందుగుండు సామగ్రి నిల్వలతో సహా సైనిక స్థావరాలు, ఉగ్రవాద మద్దతు మౌలిక సదుపాయాలను", అలాగే కాబూల్, నంగర్హార్‌లోని ఆఫ్ఘనిస్తాన్ ఆధారిత పాకిస్తానీ మిలిటెంట్లను కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పేర్కొంది.
ఈ సౌకర్యాలను అమాయక పాకిస్తానీ పౌరులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. "ఎటువంటి పౌర నష్టం జరగకుండా చూసుకోవడానికి పాకిస్తాన్ ఈ లక్ష్యాలను కచ్చితంగా, జాగ్రత్తగా చేపట్టింది" అని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణమే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ పాలకులకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపునిచ్చిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన పాకిస్తానీ తాలిబన్‌కు, అలాగే దేశవ్యాప్తంగా పాకిస్తానీ భద్రతా దళాలను, పౌరులను తరచుగా లక్ష్యంగా చేసుకునే నిషేధిత బలూచ్ వేర్పాటువాద బృందాలకు, ఇతర మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం తరచుగా ఆరోపిస్తుంది.
కాబూల్ ఈ ఆరోపణను ఖండిస్తూ వస్తోంది. అంతకుముందు, సోమవారం ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన కాల్పులలో ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. రాత్రిపూట పాకిస్థాన్ నుంచి ప్రయోగించిన మోర్టార్ షెల్స్ ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గ్రామాలపై పడి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయని ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి ముస్తఘ్‌ఫర్ గుర్బాజ్ తెలిపారు.
ఆదివారం, వాయువ్య బజౌర్ జిల్లాలోని ఒక ఇంటిపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రయోగించిన మోర్టార్ పడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని, 5 ఏళ్ల బాలుడితో సహా మరో ఇద్దరు గాయపడ్డారని పాకిస్థాన్ తెలిపింది. ఆదివారం దాడి జరిగిన సరిహద్దు వెంబడి ఉన్న ఆఫ్ఘన్ స్థావరాలను సోమవారం సైన్యం లక్ష్యంగా చేసుకుందని నివాసితులు, అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ పోస్టులు, ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ ఈ వాదనలను ఆఫ్ఘన్ ఖండిస్తూ వస్తోంది.
ఇస్లామాబాద్ ఈ పరిస్థితిని "బహిరంగ యుద్ధం"గా అభివర్ణించింది. ఈ సరిహద్దు ఘర్షణలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్తాన్ పలు వైమానిక దాడులు చేసింది. గత వారం పాకిస్తాన్‌లో పలువురు పౌరులను గాయపరిచిన డ్రోన్‌లను మోహరించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వం "రెడ్ లైన్" దాటిందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు.
ఆ దాడులకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ వైమానిక దళం వారాంతంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లో ఉన్న పరికరాల నిల్వ కేంద్రాలు, "సాంకేతిక సహాయ మౌలిక సదుపాయాలపై" దాడి చేసింది. వీటిని పాకిస్తాన్ లోపల దాడుల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఖాళీగా ఉన్న ఒక భద్రతా స్థావరం, స్వల్పంగా దెబ్బతిన్న ఒక మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంతో సహా రెండు ప్రదేశాలపై పాకిస్తాన్ దాడి చేసిందని కాబూల్ తెలిపింది.
కాబూల్‌లో, ఆఫ్ఘనిస్తాన్ పరిపాలనా ఉప ప్రధాన మంత్రి అబ్దుల్ సలాం హనాఫీ మాట్లాడుతూ, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం ఆఫ్ఘన్ పౌరులందరి కర్తవ్యం అని అన్నారు. రాజకీయ విశ్లేషకులు, మీడియా ప్రముఖులతో జరిగిన సమావేశంలో హనాఫీ మాట్లాడుతూ, ఇటీవల పాకిస్తాన్ దాడులలో పౌరులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్‌పై రుద్దబడిందని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి దాడులు ప్రారంభించడంతో ఫిబ్రవరి చివరిలో పోరాటం మొదలైంది. అంతకుముందు జరిగిన పోరాటంలో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, అనుమానిత మిలిటెంట్లు మరణించిన తర్వాత, అక్టోబర్‌లో ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఈ ఘర్షణలు భంగం కలిగించాయి. తమ సైన్యం 684 మంది ఆఫ్ఘన్ తాలిబన్ బలగాలను హతమార్చిందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌతుల్లా తరార్ ఆదివారం తెలిపారు.
అయితే, ఈ వాదనను ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించింది, మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఇతర అధికారులు, ఆఫ్ఘనిస్తాన్ 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను హతమార్చిందని చెప్పారు.
Read More
Next Story