
మసూద్ అజార్ సోదరుడి అనుమానాస్పద మృతి
జైష్ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న తాహిర్
పాకిస్తాన్ లో భారత వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదుల అనుమానాస్పద మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జైష్ ఏ మహ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు అయిన తాహిర్ అన్వర్ పాకిస్తాన్ లో మరణించారు. ఆయన మరణానికి గల కారణంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
తాహిర్ అన్వర్కు జైష్-ఎ-మొహమ్మద్తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చాలా సంవత్సరాలుగా ఆ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన మరణాన్ని ఆ సంస్థ అధికారిక ఛానెల్ ధృవీకరించింది.
బహవల్పూర్లోని జామియా మసీద్ ఉస్మాన్ వాలీలో సోమవారం రాత్రి ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆ ఛానెల్ పేర్కొంది. ఆయన అనారోగ్యానికి గురై మరణించారా లేక ఇంకేదైన జరిగిందా అనేక స్పష్టత ఉగ్రవాద సంస్థ తెలపకపోవడంతో అన్ నోన్ గన్ మెన్ ప్రమేయం ఉందనే ఊహగానాలు ముసురుకుంటున్నాయి.
జైష్-ఎ-మొహమ్మద్ ఏదో ఒక చిన్న ఉగ్రవాద సంస్థ కాదు. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 19 మంది సైనికులను బలిగొన్న ఉరి దాడి, 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన 2019 పుల్వామా దాడితో సహా భారత్ లో జరిగిన అనేక ప్రధాన దాడులతో ఈ సంస్థకు సంబంధం ఉంది.
పాకిస్తాన్లోని జైష్ లక్ష్యాలపై భారత దళాలు దాడులు నిర్వహించాయి. వీటిలో బహవల్పూర్లోని దాని ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఇక్కడ అజహర్ కుటుంబానికి చెందిన పలువురు సన్నిహిత బంధువులు మరణించారు. గత సంవత్సరం సెప్టెంబరులో, జైష్ మొదటిసారిగా ఈ నష్టాలను పరోక్షంగా అంగీకరించింది.
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జరిగిన దాడుల్లో బహవల్పూర్ కూడా లక్ష్యంగా ఉంది. దాడిలో అజహర్ కుటుంబ సభ్యులు మరణించారని ఆ సంస్థకు చెందిన ఒక సీనియర్ కమాండర్ అంగీకరించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించినందుకు భారత్ ప్రతీకారంగా ఈ దాడులు జరిపింది.
భారత దాడులతో అనేక ఉగ్రవాద స్థావరాలు శిథిలావస్థకు చేరాయి. బహవల్పూర్లోని జామియా మసీద్ సుభాన్ అల్లా ప్రాంగణం తీవ్రంగా దెబ్బతింది. మరణించిన వారిలో మసూద్ అజహర్ సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, ఒక మేనకోడలు అతని కుటుంబానికి చెందిన పిల్లలతో సహా సుమారు 10 మంది బంధువులు ఉన్నారు. ఈ దాడిలో అతని సహాయకులలో చాలామంది కూడా మరణించారు.
Next Story

