
‘‘అమెరికా టెక్ కంపెనీలే మా లక్ష్యం’’
అన్ని సంస్థలే లక్ష్యంగా దాడులు చేస్తామన్నా ఐఆర్జీసీ
ఇరాన్ పై అమెరికా - ఇజ్రాయెల్ చేసిన దాడులకు సాయపడిన అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా దాడులు చేస్తామని ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) హెచ్చరించింది. ఈ అమెరికన్ కంపెనీలు "గూఢచర్య సేవలు అందించడం ద్వారా ఇరాన్ లోపల అమెరికా-ఇజ్రాయెల్ కార్యకలాపాలకు చురుకుగా సహకరించాయి" అని IRGC ఆరోపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ నివేదించింది.
మంగళవారం (మార్చి 31) ఒక ప్రకటనలో, IRGC ఆ టెక్ కంపెనీలను ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. "ఏప్రిల్ 1న ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రతీకార దాడులు" వినాశకరంగా ఉంటాయని హెచ్చరించింది.
ఈ ప్రతీకార దాడులలో ఈ కంపెనీల ప్రాంతీయ కార్యాలయాలు "నాశనం" చేస్తామని కూడా అది స్పష్టం చేసింది. ఇరాన్ హిట్ లిస్ట్లోని అమెరికన్ కంపెనీల జాబితాలో టెక్ దిగ్గజాలైన ఆపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఉన్నాయి.
హెచ్పి, ఇంటెల్, ఐబిఎం, సిస్కో వంటి కీలకమైన హార్డ్వేర్, మౌలిక సదుపాయాల ప్రదాతలతో పాటు, టెస్లా, ఎన్విడియా, ఒరాకిల్, జెపి మోర్గాన్, బోయింగ్ వంటి ఇతర ప్రపంచ దిగ్గజాలు కూడా తమ హిట్ లిస్ట్లో ఉన్నాయని ఐఆర్జిసి తెలిపింది.
ప్రెస్ టీవీ నివేదిక ప్రకారం, ఐఆర్జిసి ఈ సంస్థలను "యునైటెడ్ స్టేట్స్ యుద్ధోన్మాద ప్రభుత్వంతో సంబంధం ఉన్న గూఢచర్య సంస్థలు"గా అభివర్ణించింది. ఇరాన్ లోపల అమెరికా- ఇజ్రాయెల్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను రూపొందించడంలో లక్ష్యాలను గుర్తించడంలో అమెరికా సంస్థ "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) సేవలే ప్రధాన అంశాలుగా ఉన్నాయి" అని ఐఆర్జిసి ఆరోపించింది.
ఐఆర్జిసి తరలింపు హెచ్చరిక..
"ఈ ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా, ఇకపై, ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న ప్రధాన సంస్థలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించబడతాయి," అని ఆ ప్రకటనలో పేర్కొంది. "ఈ సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని మేము సలహా ఇస్తున్నాము. ఈ ప్రాంతంలోని అన్ని దేశాలలో ఈ ఉగ్రవాద కంపెనీలకు ఒక కిలోమీటరు పరిధిలోని నివాసితులు కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరడమైనది," అని ఐఆర్జిసి హెచ్చరించింది.
పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రతీకార చర్యలు
ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి, టెహ్రాన్ "కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ"గా అభివర్ణిస్తున్న దాడులలో పలువురు సీనియర్ ఇరాన్ రాజకీయ, సైనిక ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులతో పాటు హత్యకు గురయ్యారని ప్రెస్ టీవీ పేర్కొంది.
ఇరాన్ పదేపదే "దాడులలో ప్రభావవంతమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది" ఇది ప్రైవేట్ రంగ సంస్థలను కూడా చేర్చిన విస్తృత పరిధిని సూచిస్తుంది. తమ మునుపటి దౌత్యపరమైన హెచ్చరికలను పట్టించుకోలేదని టెహ్రాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతను పెంచే వ్యాఖ్యలు వచ్చాయి.
ఇరాన్ నిరసనలు చేస్తున్నప్పటికీ వాషింగ్టన్- టెల్ అవీవ్లోని దాని మిత్రపక్షాలు "ఉగ్రవాద కార్యకలాపాలు" కొనసాగిస్తున్నాయని ఐఆర్జిసి పేర్కొంది. ఈ మంగళవారం జరిగిన ఒక లక్షిత దాడిలో పలువురు ఇరాన్ జాతీయులు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అమెరికా సైన్యం ప్రతిస్పందిస్తుంది..
ఆపిల్, గూగుల్ వంటి అమెరికన్ సంస్థలపై వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా, ఎలాంటి ఉద్రిక్తత పెరిగినా ఎదుర్కోవడానికి అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. "ఇరాన్ జరిపే ఎలాంటి దాడులనైనా అరికట్టడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది. గతంలోనూ సిద్ధంగానే ఉండేది. ఆ ఉగ్రవాద పాలన జరిపే బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడులు 90 శాతం తగ్గడమే దీనికి నిదర్శనం" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వైట్ హౌస్ అధికారి రాయిటర్స్తో అన్నారు.
Next Story

