
సైనికులే లక్ష్యంగా పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి
అమరులైన 13 మంది బాంబు నిర్వీర్యదళం సభ్యులు
పాకిస్తాన్ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని శనివారం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 13 మంది భద్రతా సిబ్బంది మరణించారు.
మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర వజీరిస్తాన్ లోని ఖడ్డి ప్రాంతంలో ఈ ఉదయం బాంబు నిర్వీర్యం విభాగానికి చెందిన వాహనం ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
పేలుడు పదార్థాలు నింపిన వాహానాన్ని ఒక ఆత్మాహుతి బాంబర్ ఢీ కొట్టడంతో భారీ పేలుడు సంభవించిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన 24 మందిలో మహిళలు, పిల్లలు సహ 14 మంది సాధారణ పౌరులు ఉన్నారు.
వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో సైనిక కాన్వాయ్ ఉన్నందున ఆ ప్రాంతంలో కర్ప్యూ విధించారు.
పేలుడు తరువాత భద్రతా దళాలు సహయక కార్యక్రమాలు ప్రారంభించాయి. హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన విభాగం ఉసుద్ అల్ హర్బ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది.
ఇటీవల నెలల్లో వజీరిస్తాన్ లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద ఘటన ఇదే అని భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఇది ప్రాంతంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది.