
మరోసారి నెత్తురోడిన కశ్మీర్.. కేంద్రం సీరియస్
ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.
జమ్మూకశ్మీర్ మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్రవాదుల తుపాకుల పేలుళ్లు మరోసారి అనంతనాగ్ జిల్లాను కమ్మేశాయి. అనంత్నాగ్ జిల్లా పహల్గంలో పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో మహిళలు కాకుండా పురుషుల టార్గెట్గా ఉగ్రవాదులు దాడులు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఇదే సరైన సమయం అనుకున్న ఉగ్రవాదులు పర్యాటకులపై తమ ప్రతాపం చూపారు. అమాయకులను భయపెట్టి హతమార్చారు. ఈ అంశంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఉగ్రవాదులను గుర్తించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు, కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రదాడి బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈరోజు పరామర్శించనున్నారు.
Live Updates
- 23 April 2025 11:45 AM IST
ఉగ్రదాడి బాధితులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా
ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది. అంతేకాకుండా మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షలు, గాయాలైన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
- 23 April 2025 11:43 AM IST
కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసాక ప్రశాంతంగా ఉందని అన్నారు. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి కశ్మీర్ ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారని ఆరోపించారు. టూరిస్టుల పై దాడి చేయడం దారుణమని, పేరు అడిగి మరీ హిందువులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందని చెప్పారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరని అన్నారు.
- 23 April 2025 11:41 AM IST
శ్రీనగర్లో మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఇండిగో ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్న టికెట్ల రీషెడ్యూలింగ్, క్యాన్సిలేషన్ జరిగితే వాటి టికెట్ ధరల మినహాయింపులు, రిఫండ్లకు సమయాన్ని పొడిగించింది. అంతేకాకుండా ఈరోజు ఇండిగో రెండు ప్రత్యేక ఫ్లైట్లను నడపనున్నట్లు చెప్పింది.
- 23 April 2025 10:19 AM IST
కశ్మీర్లోని పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.