
తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా త్రిశూలస్నానం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.
ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం నిర్వహించారు. కపిలేశ్వరస్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోధ్వాససం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.
హరిబ్రహ్మాదులకే లభ్యం గాని పవిత్రపాదపద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షసభక్తుడు రావణుడు. తపస్సంపన్నుడైన రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతుడయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీకపిలేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తారు.

