
బారామతి విమాన ప్రమాదం చిక్కుల్లో తెలుగుదేశం పార్టీ
విమాన యజమాని విఆర్ ఎస్ వెంచర్స్ కు టిడిపితో సంబంధాలున్నాయా? ఎన్ సిసి అనుమానాలు
జనవరి 28న మహారాష్ట్ర బరామతిలో జరిగిన లియర్జెట్ 45 విమాన ప్రమాదం తెలుగుదేశం పార్టీని చిక్కుల్లోకి నెడుతూ ఉంది. ఈ విమానం నడిపిన సంస్థ విఆర్ ఎస్ వెంచ్చర్స్ (VRS Ventures)తెలుగు దేశం పార్టీ అధినేత కుటుంబానికి చెందిన మరొక సంస్థతో ఆర్థిక సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ వారం రోజులు టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. మొదట కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడి క్యాబినెట్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇపుడు విఆర్ ఎస్ వెంచర్స్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబానికి సంబంధాలున్నాయని, దీని మీద దర్యాప్తు జరగాలని అంటున్నారు. శనివారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణ చేశారు. వివరాలు:
లియర్ జెట్ 45 యజమాని అయిన విఆర్ ఎస్ వెంచర్స్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని ఆయన తాజాగా విమర్శనాస్త్రం విసిరారు. అంతకు ముందు కేంద్ర విమానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని క్యాబినెట్ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. విమాన ప్రమాదం గురించి రోహిత్ ఇలా మీడియా ముందు శనివారం నాడు ఆసక్తికరమయిన విషయాలు వెల్లడించడం ఇదే మూడో సారి.
ఎన్ ఎసిపి (శరద్ పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్
విమాన ప్రమాదం విచారణ ముందుకు సాగకపోవడం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వెంటనే ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని ఆయన శనివారం ప్రధానికి ఒక లేఖ రాశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని కూడా ఆయన కోరారు.
" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన ఒక పైనాన్స్ కంపెనీ విఎస్ ఆర్ వెంచర్స్ కు నిధులు సమకూర్చింది. సంస్థ డైరెక్టర్ కుటుంబానికి చెందిన ఒక వివాహ వేడుకలో కూడా వారు పాల్గొన్నారు. ప్రమాదానికి కారణమయిన విమానసంస్థకు, తెలుగు దేశం అధినేత కుటుంబానికి సంబంధాలున్నపుడు, ఆ పార్టీకే చెందిన వ్యక్తి విమాన శాఖ మంత్రిగా ఉంటే, ప్రమాదం మీద స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారణ ఎలా కొనసాగుతుంది," అని రోహిత్ పవార్ ప్రశ్నించారు.
ఎన్ డియే కూటమి లో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారా లేక ఎన్ డిఎ కు మిత్రుడైన అజిత్ పవార్ కుటుంబానికి న్యాయం చేస్తారా అనేది బిజెపి తేల్చుకోవాలని ఆయన కోరారు.
జనవరి 28న జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు.
విమానం ప్రమాదం గురించి పెద్ద చర్యలు లేకపొవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ కంపెనీ యజమాని వీఎస్ఆర్ వెంచర్స్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రోహిత్ ఆరోపించారు.
ప్రమాదం మీద దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి కెఆర్ నాయుడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
రోహిత్ మహారాష్ట్రలోని కర్జాత్-జామ్ ఖేడ్ (Karjat-Jamkhed constituency) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన పార్టీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు.

