బిల్ కిస్ బానో కేసు ఏంటి?   సుప్రీకోర్టు ఏం చెప్పింది?
x

బిల్ కిస్ బానో కేసు ఏంటి? సుప్రీకోర్టు ఏం చెప్పింది?

బిల్కిన్ బానో కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా చేయాలని విజయవాడ ‘సంగమం’ డిమాండ్.



ఈ రోజు భారత సుప్రీంకోర్టు బిల్ కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టడం పట్ల విజయవాడ ‘సంగమం’ హర్షం వ్యక్తం చేసింది. రెండు వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్గు ఆదేశాలీయడం సరైన చర్య గా సంగం వర్ణించింది. సంగమం అనేది. వివిధ సాంస్కృతిక సంస్థల వేదిక.

సంగమం విజయవాడ కో కన్వీర్ సి. ఉమా మహేశ్వరరావు ఈ సందర్బంగా విడుదల చేసినట ప్రకటన ఇది.

న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల సుప్రీంకోర్టు బెంచ్, 2002 నాటి గుజరాత్ లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమిషన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒకానొక సుప్రీంకోర్టు బెంచ్ యావత్ జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమిషన్ యధాలాపపు (Sterio type) నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండ సాకుతో, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో, ప్రపంచ మానవాళి సిగ్గుపడేలా అమాయక ముస్లిం ప్రజానీకంపై ఘోరమైన హత్యాకాండ, మహిళలపై అత్యాచారాలు రోజుల తరబడి జరిగాయి. అలాంటి దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి మూడవ తేదీన అహ్మదాబాద్ కు దగ్గరలోని రంధిక్ పూర్ అనే గ్రామం విడిచి పోతున్న వారిలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్ కిస్ బానో అనే 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా 7గురు కుటుంబ సభ్యులను హత్య గావించారు.

ఆ సంవత్సరం నుండి ఆ కేసు పలు మలుపులు తీసుకుంది. సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపటానికి వీలులేదని మహారాష్ట్రలో దానిని సాగించగా దాని బొంబాయి ట్రయల్ కోర్టు 11 మంది ముద్దాయిలకు 2008లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది . 2017లో బొంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్ కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసులో ముద్దాయిలకు మరణశిక్ష విధించ దగినప్పటికీ దానిని యావత్ జీవకారాగార శిక్షగా మార్పు చేశారు.

కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్ల శిక్షకాలం తరువాత వారికి రెమిషన్ అవకాశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి కేసు విచారణ జరిగిన, శిక్ష విధించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రెమిషన్ గురించిన సిఫారసు చేసే అవకాశం ఉన్నది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ సిఫారసు చేసింది. ఆ విధంగా భయంకర నేరానికి పాల్పడిన 11మంది ముద్దాయిలకు 75 ఏళ్ల స్వాతంత్ర అమృతకాలం అని పేరుపొందిన 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం లభించింది. వారిని గుజరాత్ రాష్ట్ర బిజెపి నాయకులు దండలతో అభినందనలతో స్వాగత సత్కారాలు నిర్వహించారు. విజయోత్సవాలు జరిపారు.

దేశం దేశమంతా సిగ్గుపడేట్లు చేసిన ఈ సంఘటనను ప్రశ్నిస్తూ బిల్ కీస్ బానో తిరిగి సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. అంతేగాక సిపిఐఎం కు చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాలు, ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన కెప్టెన్ లక్ష్మీ కుమార్తె, అయిన సుభాషిణి అలీ , లక్నో విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రూప్ రేఖ వర్మ, అలాగే జర్నలిస్ట్ రేవతి లాల్ ఇంకా ఇటీవల పార్లమెంటు నుండి బహిష్కృతురాలైన మహువ మొయిత్ర లాంటివారు కూడా ఈ కేసులో ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని వేశారు.

ఈరోజు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు, తనకు లేని అధికారాలను ఉపయోగించుకుని బిల్ కిస్ కేసులో ముద్దాయిలకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని తప్పు పట్టిన దృష్ట్యా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలి.

2019 వ సంవత్సరంలో బాబ్రీ మసీద్ కూల్చివేత విషయంలో ఎవరూ నేరస్తులు కారు, లేరు అంటూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తికి కీలకమైన ఆర్టికల్ 370ని భారత పార్లమెంటు రద్దు చేయటాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు... పక్షపాతంగా వ్యవహరించిందని. నిష్పక్షపాతులు అభిప్రాయపడ్డారు.

అలాంటిది నేడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను పూర్తిగా ఖండిస్తూ తీర్పునివ్వడం హర్షించదగ్గ విషయంగా సంగమం విజయవాడ భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల తన హర్షాన్ని ప్రకటిస్తోంది. మరొక్కసారి గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ రాజీనామా చేయాలనే డిమాండ్ ను గుర్తు చేస్తోంది.


8/1/2024

Read More
Next Story