
‘యూరియా కార్డ్తో కాంగ్రెస్ కొత్త నాటకం’
యూరియా యాప్ అయిపోయింది ఇప్పుడు కార్డ్ అంటోందంటూ కాంగ్రెస్పై కేటీఆర్ విమర్శనాస్త్రాలు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. యూరియా విషయంలో కాంగ్రెస్ రోజుకో నాటకం ఆడుతోందన్నారు. యూరియా యాప్ అంటూ మొన్నటి వరకు కబుర్లు చెప్పిన కాంగ్రెస్. ఇప్పుడు కొత్తగా యూరియా కార్డ్ అంటోందని చురకలంటించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం ఆ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణా రావుకు కూడా లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో.. రాదో తెలియదు నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అదిలాబాద్ లో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు అందరికీ తెలుసు. అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడు. అవకాశవాదంతో కాంగ్రెస్ లోకి పోయిన నాయకుడు జూపల్లి. మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచాము. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో.. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదు. ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ.. చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్’’ అని విమర్శించారు.
‘‘చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒకటే ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పాలమూరును పట్టించుకోవడం లేదు. తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రి తోని మాకు నీటి పాఠాలు అవసరం లేదుజ’’ అని అన్నారు.
‘‘రేవంత్ రెడ్డికి బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని. నదుల గురించి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నీటి పాఠాలు చెప్తా అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలి. రేపు రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. వ్యవసాయ దారులకు ఇచ్చే అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపివేసింది. మేము 11 సార్లు రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సారి ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈరోజు యూరియా గురించి అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. షాపుల్లో లేని యూరియాను మొబైల్ యాప్స్ తో ఇస్తామని చెప్తుంది. కొత్తగా యూరియా కార్డ్ అంటూ నాటకం మొదలుపెట్టింది’’ అని చురకలంటించారు.
‘‘రైతన్నలకు యూరియా దొరకక లైన్లో నిలబడి యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చెప్పులు లైన్లో పెట్టి కుటుంబమంతా ఒక్క బస్తా యూరియా కోసం నిలబడుతున్నది. గ్యారంటీ కార్డులకే దిక్కులేదు.. కొత్తగా యూరియా కార్డు ఇచ్చి కాంగ్రెస్ ఏం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రారంభమయ్యాయి. గతంలో మా ప్రభుత్వం లో యూరియా కోసం కుస్తీ లేదు.. విత్తనాల కోసం పోటీ లేదు.. కరెంటు కష్టాలు లేవు.. క్రాప్ హాలిడేలు లేవు’’ అని స్పష్టం చేశారు.

