
‘ప్రజాస్వామ్యానికి కోర్టులు ప్రతీక’
జోన్-2 భవనాల నిర్మాణాలను 2027కల్లా పూర్తి చేయబోతున్నట్లు హామీఇచ్చారు
సమాజానికి, ప్రజాస్వామ్యానికి కోర్టులు ప్రతీకలుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం హైకోర్టు భవనాల రెండో ఫేజ్ భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. ఈ సందర్భంగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తో కలిసి రేవంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో పాటు అనేకమంది సుప్రింకోర్టు, హైకోర్టు జడ్జీలతో పాటు న్యాయవ్యవస్ధలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు తెలంగాణ హైకోర్టు భవనాల నిర్మాణానికి శంకుస్ధాపన చేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జీవితంలో ఒక్కసారే వచ్చే అరుదైన అవకాశంగా తెలిపారు. సాధారణ పౌరుడికి న్యాయం జరగాలంటే కోర్టే చివరి ఆశగా వర్ణించారు.
రాబోయే 100 ఏళ్ళు పేదలు, బలహీనులు, అణగారినవర్గాల ప్రజలు న్యాయమందిరానికి వచ్చి తమ వేదనను వినిపించుకునే స్ధలం అన్నారు. అన్నీ వ్యవస్ధలు పరస్పర గౌరవంతో సహకారంతో పనిచేయాలని రేవంత్ సూచించారు. తమ ప్రభుత్వం న్యాయవ్యవస్ధకు అత్యున్నత గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్ధకు అత్యుత్తమ సౌకర్యాలు అందించటాన్ని తమ ప్రభుత్వం బాధ్యతగా చూస్తున్నదని తెలిపారు. ఈ ప్రాజెక్టుకోసం రాజేంద్రనగర్ లో ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించిందని గుర్తుచేశారు. జోన్-1లో భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, జోన్-2 భవనాల నిర్మాణాలను 2027కల్లా పూర్తి చేయబోతున్నట్లు హామీఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టుల కోసం నివాస సముదాయాల ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రింకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎస్ వీ భట్టి, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ పీఎస్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

