
సృష్టి IVF కేసు: రూ.29కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
హైదరాబాద్లో వెలుగుచూసిన సరోగసీ, శిశు అక్రమ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు వేగం. పేద కుటుంబాల నుంచి శిశువులను సేకరించిన నెట్వర్క్ బయటపడింది.
సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ నమ్రతకు చెందిన 50 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ సుమారు రూ.29.76కోట్లు ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు చెప్పారు. ఈ కేసు పాచిపల్లి నమ్రత అలియాస్ అట్లూరి నమ్రత నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్న సరోగసీ రాకెట్కు సంబంధించినదిగా అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో సృష్టి సరోగసి సెంటర్పై పలు కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగానే ఈ కేసులో మనీలాండరింగ్ కోణం కూడా ఉన్నట్లు భావించి ఈడీ రంగంలోకి దిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. సృష్టి ఐవీఎఫ్ పేరుతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా డాక్టర్ నమ్రతకు చెందిన రూ.29.76కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
అసలు కేసు ఏంటేంటే !
దర్యాప్తులో భాగంగా నమ్రత తన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో నడిచే క్లినిక్ ద్వారా సంతానం లేని దంపతులకు శిశువులను అందిస్తున్నట్లు గుర్తించారు. సరోగసీ ప్రక్రియను నిజమైనదిగా చూపించేందుకు దంపతుల గామీట్స్ సేకరించి సరోగేట్ తల్లిలో ప్రతిరోపణ చేస్తున్నట్లు చూపించేవారని ఈడీ గుర్తించింది.
అయితే వాస్తవానికి పుట్టిన శిశువులను పేద, బలహీన వర్గాల కుటుంబాల నుంచి సేకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. గర్భాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్న మహిళలను గుర్తించేందుకు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో కూడిన నెట్వర్క్ పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు ఆశ చూపించి పుట్టిన వెంటనే శిశువును అప్పగించేందుకు వారిని ప్రలోభపెట్టినట్లు సమాచారం.
ఆడపిల్లకు రూ.3.5 లక్షలు, అబ్బాయికి రూ.4.5 లక్షలు
ఈ వ్యవహారంలో పుట్టిన శిశువులకు ధర కూడా నిర్ణయించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆడపిల్లకు సుమారు రూ.3.5 లక్షలు, అబ్బాయి శిశువుకు రూ.4.5 లక్షలు చెల్లించినట్లు ఈడీ వెల్లడించింది. సికింద్రాబాద్లో ఉన్న ఆమె ఆస్పత్రి లైసెన్స్ను అధికారులు రద్దు చేసిన తరువాత ప్రసవాలను Visakhapatnam లోని ఆస్పత్రిలో నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అనంతరం మున్సిపల్ అధికారులకు పంపిన జనన వివరాల్లో అసలు తల్లిదండ్రుల పేర్ల స్థానంలో శిశువులను పొందిన దంపతుల పేర్లు నమోదు చేసినట్లు తెలిసింది.
2014 నుంచి అక్రమ కార్యకలాపాలు
ఈ అక్రమ సరోగసీ రాకెట్ 2014 నుంచే కొనసాగుతున్నట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఆమెపై పలు కేసులు నమోదైనప్పటికీ, అలాగే వైద్య లైసెన్స్ సస్పెండ్ అయిన తరువాత కూడా ఈ కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా నమ్రత, ఆమె కుమారుల పేర్లపై ఉన్న భూములు, ఫ్లాట్లు, ఆస్పత్రి సహా మొత్తం 50 ఆస్తులను గుర్తించారు. అధికారికంగా జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.29.76 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.
ఈ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 12న ఈడీ నమ్రతను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె న్యాయస్థాన ఆదేశాల మేరకు న్యాయ పరిరక్షణ కస్టడీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

