రైతుల పాదయాత్ర.. ఢిల్లీ సరిహద్దులో స్తంభించిన ట్రాఫిక్‌..
x

రైతుల పాదయాత్ర.. ఢిల్లీ సరిహద్దులో స్తంభించిన ట్రాఫిక్‌..

తమ డిమాండ్లను పరిష్కరించాలని ఢిల్లీకి బయల్దేరిన రైతులతో రోడ్లు కిక్కిరిశాయి. ఢిల్లీ సరిహద్దు వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పంజాబ్‌, హరియానా రైతులు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో వారంతా రోడ్లమీదకు చేరుకుంటున్నారు. వారిని ఢిల్లీలోకి అనుమతించకుండా సింఘ, టిక్రీ సరిహద్దుల వద్ద పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అప్సర, ఘాజీపూర్‌ సరిహద్దుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు సింఘు సరిహద్దుకు సమీపంలోని ఓ గ్రామంలోని రహదారిని అడ్డంగా తవ్వేశారు.

ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద కొద్దిగా ట్రాఫిక్‌ సమస్య ఉందని షాహదారా నుంచి నోయిడా సెక్టార్‌-62కి ప్రయాణిస్తున్న అంకిత్‌ సింగ్‌ అనే వ్యక్తి చెప్పారు.

‘‘ట్రాఫిక్‌ కొద్దిగా స్తంభించింది. ఆఫీసుకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గం కోసం ఆలోచిస్తున్నా. ఘాజీపూర్‌ బార్డర్‌ వద్ద వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. అక్కడ పోలీసులను మోహరించారు.’’ అని సింగ్‌ చెప్పారు.

రైతుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపేయడంతో ఢిల్లీ, హర్యానా మధ్య ఉన్న సింఘు సరిహద్దుకు మంగళవారం ప్రజలు కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది.

నేను పెళ్లికి హాజరయ్యేందుకు ఈశాన్య ఢిల్లీకి వెళ్తున్నా. అయితే నేను ప్రయాణిస్తున్న బస్సు సరిహద్దు నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఆగిపోయింది’’ అని హర్యానాలోని కర్నాల్‌లో నివసిస్తున్న హేమ్‌ సింగ్‌ చెప్పారు.

‘‘నా మేనల్లుడి పెళ్లి కోసం బుధవారం ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురికి బయలుదేరాం. ట్రాఫిక్‌ కారణంగా ఇరుక్కుపోయాం. బస్సు డ్రైవర్‌ సరిహద్దుకు కిలోమీటరు ముందు వాహనాన్ని ఆపేశాడు. ఇక మేం ఢిల్లీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకు ఏదైనా వాహనం లభిస్తుందో లేదో చూడాలి.’’ అని చెప్పారు సింగ్‌.

‘‘మాకు రైతుల కవాతు గురించి తెలుసు. కానీ మేము ఇక్కడ ఇరుక్కుపోతామని తెలియదు. నేను నా భార్య, కుమార్తెను తిరిగి పానిపట్‌కు వెళ్ళమని అడిగాను. కాని నా కూతురు తన బంధువు వివాహానికి హాజరు కావాలంటుంది’’ అని సింగ్‌ చెప్పాడు.

పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర మంత్రుల బృందంతో జరిపిన సమావేశం అసంపూర్తిగా మునిగియంతో ఢిల్లీ వైపు పాదయాత్రగా బయల్దేరారు.

తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీకి వెళతారని సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా తెలిపాయి.

Read More
Next Story