
రైతుల బైఠాయింపుతో ఢిల్లీ శివారులో భారీగా ట్రాఫిక్ జామ్
నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంటు ముట్టడికి బయల్దేరడంతో ఢిల్లీ-నోయిడా హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంటు ముట్టడికి బయల్దేరడంతో ఢిల్లీ-నోయిడా హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వందల సంఖ్యలో రైతులు జాతీయ రహదారిపైకి రావడంతో సరిత విహార్ వద్ద ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రైతుల నిరసన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు చేశామని చెప్పారు.
‘‘దేశ రాజధాని సరిహద్దు ఎంట్రీ పాయింట్ల వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే పారామిలటరీ బలగాలను రంగంలోకి దించామని మరో పోలీసు అధికారి తెలిపారు.
ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్లను కలిపే సరిహద్దు ప్రాంతాల్లో పికెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనియా విహార్, డిఎన్డి, చిల్లా, గాజీపూర్, సభాపూర్, అప్సరలోని సరిహద్దు మార్గాల్లో టాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
ముందు జాగ్రత్త చర్యగా నోయిడా, గ్రేటర్ నోయిడాలో రైతుల నిరసన ప్రదర్శనకు ముందు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు బుధ, గురువారాల్లో సీఆర్పీసీ సెక్షన్ 144 విధించారు.
ట్రాక్టర్లపై రైతుల కదలికల దృష్ట్యా జంట నగరాల్లోని కొన్ని మార్గాల్లో మళ్లింపులకు వ్యతిరేకంగా ప్రయాణికులను హెచ్చరిస్తూ పోలీసులు ట్రాఫిక్ సలహా కూడా జారీ చేశారు.
ఢిల్లీకి ట్రాక్టర్ మార్చ్..
హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు మంగళవారం ఢిల్లీకి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో 2020 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా హరియాణా, పంజాబ్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి.. రాజధానిలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుకబస్తాలతో గోడలు, సిమెంట్ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

