బీహార్‌లో భారత కూటమి స్టార్ క్యాంపెయినర్ ఒకే ఒక్కడు..
x

బీహార్‌లో భారత కూటమి స్టార్ క్యాంపెయినర్ ఒకే ఒక్కడు..

బీహార్‌లో భారత కూటమి తరుపున స్టార్ క్యాంపెయినర్ ఏవరంటే తేజస్వీ యాదవ్ పేరే వినపడుతుంది. రాహుల్ కంటే ఎక్కువగా ఆయన కూటమి తరుపున ఒంటరి పోరు సాగిస్తున్నారు.


ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్‌లో ఒంటరి పోరు సాగిస్తున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా ఎన్డీయే నేతలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో మొత్తం 40 ఎంపీ స్థానాలున్నాయి. అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అటు భారత కూటమి, ఇటు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక తేజస్వీ యాదవ్ భారత కూటమి అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తూ వారిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.

స్టార్ క్యాంపెయినర్ తేజస్వి..

RJD స్టార్ క్యాంపెయినర్ అయిన తేజస్వి యాదవ్ బీహార్‌లో భారత కూటమి అభ్యర్థుల కోసం ఒంటరిగా ప్రచారం చేస్తుండగా..ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు. మరో ఐదు సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఒకే ఒక్క ఎన్నికల సభ నిర్వహించారు. ఆయన మరో రెండు సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రచారంలో ఎక్కువ భాగం తేజస్వి నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రోజుకు మూడు నుంచి నాలుగు చొప్పున తేజస్వి ఇప్పటివరకు 100 ఎలక్షన్ మీటింగుల్లో ప్రసంగించి ఓటర్లను ఆకట్టకుంటున్నారు. బాలీవుడ్ సెట్-డిజైనర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) చీఫ్ ముఖేష్ సహానీ సహాయంతో మత్స్యకారుల మద్దతు కూటగడుతున్నారు. తేజస్వి విస్తృత ప్రచారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఇబ్బందిగా మారుతోంది. నితీష్ అసంబద్ధ ప్రసంగాలు బిజెపిని ఇరుకునపెడుతున్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్, బీజెపి ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో సహా తన రాజకీయ ప్రత్యర్థులను అధిగమించే స్థాయికి ఎదిగారు.

ప్రధానమంత్రి, ఇతర NDA నాయకులు ఇప్పటివరకూ చేసిన ప్రసంగాలు ప్రధానంగా లాలూ ప్రసాద్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చేసినవే. నవరాత్రులలో చేపలు తిన్నాడని తేజస్విని ఎత్తి చూపారు. కాని తేజస్వీ మాత్రం పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు. వాటి గురించి మాట్లాడాలని ప్రధానిని కోరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవు..

“2014లో మోదీజీ ప్రతి ఒక్కరి ఖాతాలో ₹ 15 లక్షలు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని వెనక్కి తెస్తానని హామీ ఇచ్చారు. 2019లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, అందరికీ పక్కా (కాంక్రీట్) ఇళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. 2024లో సనాతన ధర్మం, హిందూ-ముస్లిం, మంగళసూత్ర గురించి మాట్లాడుతున్నాడు” అని తేజస్వి అన్నారు. మోదీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేజస్వి హెచ్చరించాడు. కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన కులాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని పేర్కొన్నారు.

భారత కూటమి అధికారంలోకి వస్తే..

భారత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ₹1 లక్ష, వంటగ్యాస్ ధరలను ₹500కి తగ్గిస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. రాజకీయ వాతావరణం ఈ సారి భారత కూటమికి అనుకూలంగా ఉందంటున్నారు. బీజేపీ 400 ఎజెండా ఫెయిల్ అవుతుందన్నారు. బీహార్‌లో ఈ సారి ఆశ్చరకర ఫలితాలు చూడబోతారని చెప్పారు.

Read More
Next Story