బెంగళూర్ లో కేరళ ఎన్నికల సందడి
x

బెంగళూర్ లో కేరళ ఎన్నికల సందడి

వివిధ బస్టాండ్ ల నుంచి సొంత రాష్ట్రానికి తరలుతున్న ఓటర్లు


Click the Play button to hear this message in audio format

కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక నుంచి వలసలు జరుగుతున్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్ స్టాండ్‌లు మలయాళీలతో సందడిగా మారాయి. కలసిపల్య, శాంతినగర్, మడివాళ, మెజెస్టిక్, కెంగేరి బస్ స్టాండ్‌లలో కేరళ వాసులు కనిపిస్తున్నారు. నగరంలో పనిచేస్తూ, నివసిస్తున్న వేలాది మంది కేరళీయులు అద్దె బస్సుల్లో తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్తున్నారు.

వీలైనన్ని ఎక్కువ ఓట్లు దక్కించుకోవాలనే ఆత్రుతతో ఉన్న రాజకీయ పార్టీలు వీరిలో చాలా మందిని సొంత రాష్ట్రానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాయి. బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, నర్సులు, వ్యాపారులు వంటి పెద్ద సంఖ్యలో 'రాజకీయ చైతన్యం' ఉన్న కేరళీయులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కును అలాగే నిలబెట్టుకున్నారు.
దాదాపు ప్రతి కేరళ అసెంబ్లీ సీటులో, కనీసం 1,000-2,000 మంది ఓటర్లు బెంగళూరులో పనిచేస్తున్నారని అంచనా. గెలుపు తేడా 100-500 ఓట్లంత స్వల్పంగా ఉండే ఈ ఎన్నికల్లో, ఈ సంఖ్య చాలా కీలకం. బెంగళూర్ నుంచి బస్సులు ఎక్కువగా ఉత్తర, మధ్య కేరళకు వెళ్తున్నాయని తెలిసింది.
ఈ యాత్ర చేస్తున్న ఓటర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణం, భోజనాలను ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ కేరళ రాష్ట్ర క్రీడల విభాగం అధిపతి సంజయ్ అలెక్స్ ఈ విషయంపై 'ది ఫెడరల్'తో మాట్లాడారు.
ఈ ఏర్పాట్లను వివిధ పార్టీల మద్దతుదారులు చేస్తున్నారని, పార్టీ యంత్రాంగం నేరుగా చేయట్లేదని చెప్పారు. ఆయన ప్రకారం, 2,000 మందికి పైగా కేరళీయులు బస్సు లేదా కారులో వస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా యువకులు, మొదటిసారి ఓటు వేస్తున్నవారే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత ఊళ్లకు ఈ యాత్ర చేస్తున్నారని అలెక్స్ చెప్పారు. గూగుల్ ఫారాల ద్వారా ఓటర్లను గుర్తించారు. కర్ణాటక నుంచి అద్దెకు తీసుకున్న ప్రైవేట్ బస్సులు కేరళ సరిహద్దు వద్ద అవసరమైన పన్నులు చెల్లిస్తాయి.

ప్రతి ఓటు ముఖ్యమా?

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అసాధారణంగా ఉంది. కేరళలో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ(సర్) సమయంలో వేలాది ఓట్లను తొలగించారు. దీనితో ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లు కీలకంగా మారారు. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ మూడో సారి గద్దె నెక్కాలని ఆత్రుతగా ఉంది. కానీ దానికి అధికార వ్యతిరేకత కూడా బాగానే ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఉనికి కోసం పోరాడుతోంది. బీజేపీ ఒక విశ్వసనీయమైన మూడవ శక్తిగా నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ సమన్వయం

కేరళ సంస్థలు, బెంగళూరులోని పార్టీ మద్దతుదారులు నడుపుతున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకుంటున్నారు. బస్సు సమయాలు, పికప్ పాయింట్లపై స్పష్టమైన సమాచారం పంపుతున్నారు. గురువారం పోలింగ్ జరగనున్నందున, చాలా మంది ఓటర్లు తమ సొంత నియోజకవర్గాలకు సమయానికి చేరుకోవడానికి బుధవారమే బయలుదేరుతున్నారు. చాలా మంది మంగళవారమే బయలుదేరారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
Read More
Next Story