మేడారం జాతరలో రూ. 6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్
x

మేడారం జాతరలో రూ. 6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

మంత్రి సీతక్క చొరవతో స్వయం సహాయక గ్రూపు మహిళలకు లబ్ది


మేడారం జాతరకు హాజరు అయ్యే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించుటకు ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ. 6 కోట్ల వ్యయంతో 565 షాపులను ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 లొకేషన్లలో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు.

మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్స్, మేడారం రాక పోకలు జరిగే మార్గంలో 63 యూనిట్స్ ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్స్ ఇతర చోట్ల నెలకొల్పారు. రాష్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చొరవతో మేడారం వీటిని ఏర్పాటు చేసారు.

ఇందిరా మహిళా శక్తి ద్వారా ఇప్ప పువ్వు లడ్డులు, మిల్లెట్ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డులు విక్రయ స్టాల్స్, ఇప్ప నూనె, గానుగ నూనె, కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ/టిఫిన్, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామాగ్రీ విక్రయ స్టాల్స్ తో పాటు బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్ డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహర, కిరాణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ చేపలు, కోళ్ల విక్రయ అవుట్ లెట్, కోడి గుడ్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు.

మేడారం జాతరలో రు. 50 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్న నీటి పారుదల శాఖ

మేడారం మహా జాతరకు మూడు రోజులే ఉండడంతో హాజరయ్యే కోటిన్నర మంది భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం రు. 50 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నీటిపారుదల శాఖ గత జాతరలకన్నా అదనపు ఏర్పాట్లను చేసింది.

. ప్రధానంగా రెడ్డిగూడెం నుండి జంపన్న వాగు మీదుగా చిలకలగుట్ట వరకు నీటి మట్టాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకై జంపన్న వాగులో ఉన్న 29 ఇంఫిలిట్రేషన్ వెల్స్ ల పూడికను చేపట్టింది. స్నాన ఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ (BoT ) లను పునరుద్దరించడంతోపాటు బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లకు నిరంతర నీటిని అందించేందుకు ఇంఫిల్టరేషన్ వెల్స్ లో సుబ్మెర్సిబుల్ పంపులను ఏర్పాటు చేసి పైప్ లైన్లను నీటిపారుదల శాఖ చేపట్టింది.

జంపన్న వాగు పొడుగునా 348 బ్యాటరీ ఆఫ్ ట్యాప్ లను, 119 బట్టలు మార్చుకునే సదుపాయాలు ఏర్పాటు చేశారు. జంపన్న వాగులో నీటి మట్టాన్ని ఒకే తీరుగా ఉంచేందుకు 9 క్రాస్ బండ్ లను నిర్మించారు.

అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు

తాడ్వాయి మండలంలో దట్టమైన అడవిలో జరిగే ఈ జాతర సందర్బంగా అటవీ సంరక్షణ తో పాటుగా పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా, అటవీ సంపద ధ్వంసం కాకుండా ఉండేందుకు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాణాల నివారణ, దట్టమైన అడవుల గుండా వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించడం లాంటి పనులను అటవీ శాఖ చేపట్టింది. వీటితోపాటు, ఖాళీగా ఉన్న అటవీ భూములలో పార్కింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది.

నిరంతర విధ్యుత్ సరఫరాకు 196 ట్రాన్సఫార్మర్లు, 67 కి.మీ ఎలక్ట్రిక్ లైను

జాతరలో నిరంతర విధ్యుత్ సరఫరా కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను 911 ఎలక్ట్రిక్ స్తంబాలు, 196 ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేసి వీటి నిర్వహణకు 350 అదనపు సిబ్బందిని నియమించారు. వీటితోపాటు, 43 పార్కింగ్ ప్రాంతాలలో కూడా విధ్యుత్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికే, జాతర ప్రాంతంలో ఉన్న 11 కేవీ, 33 కేవీ సబ్ స్టేషన్ లను సిద్ధం చేసింది. భక్తుల రక్షణ చర్యల్లో భాగంగా, 11 కేవీ, 33 కేవీ లైన్లు క్రాస్ అయ్యే జంపన్న వాగు వద్ద ఆరు గస్తీ టవర్లను ఏర్పాటుచేశారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ బృందాలను నియమించారు. తాడ్వాయి, పస్రా మార్గంలో పెట్రోలింగ్ టీమ్ లను కూడా ఏర్పాటు చేశారు.

నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లకు ఒక బృందం చొప్పున (ఏఈ, ముగ్గురు ఆపరేషన్‌ సిబ్బంది) పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్‌ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్‌, ఏటూరునాగారం, కమలాపూర్‌, ములుగు సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఇవే ప్రాంతాల్లోని ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ల వద్ద విద్యుత్‌ సరఫరా పర్యవేక్షించేందుకు 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.. అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందు కు 30 వాహనాలను కేటాయించారు.

Read More
Next Story